కరీంనగర్ : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ పరిశ్రమల మంత్రి కేటీఆర్ కరీంనగర్ జిల్లాలో మంగళవారం పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్ పరిశీలించారు. జమ్మికుంట కాలేజీ మైదానంలో సోమవారం బహిరంగ సభకు సంబంధించిన ఏర్పాట్లపై పరిశీలించి, పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా గంగుల మాట్లాడుతూ బీఆర్ఎస్ ఆవిర్భావం తర్వాత ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నిర్వహించే తొలిసభ ఇదేనని తెలిపారు. హుజూరాబాద్ నియోజకవర్గం బీఆర్ఎస్కు పెట్టని కోట అని, హుజూరాబాద్ అంటే సీఎం కేసీఆర్కు ఇష్టమైన నియోజకవర్గమన్నారు.
ఇక్కడి నుంచి రైతుబంధు, దళితబంధు పథకాలను ప్రారంభించారని గుర్తు చేశారు. కేటీఆర్ హైదరాబాద్ నుంచి హెలికాప్టర్ ద్వారా కరీంనగర్ స్పోర్ట్స్ స్కూల్కు చేరుకుంటారు. కరీంనగర్లో రూ.7కోట్లతో నిర్మించిన కరీంనగర్ సర్క్యూట్ హౌస్, ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయాలను ప్రారంభిస్తారు. ఆ తర్వాత హుజూరాబాద్ నియోజకవర్గంలో పర్యటిస్తారన్నారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్పర్సన్ విజయ, ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్, సుడా చైర్మన్ జీవీ రామకృష్ణారావు, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్రావు, హుజూరాబాద్ నియోజకవర్గ ఇన్చార్జి గెల్లు శ్రీనివాస్ యాదవ్, జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ రాజేశ్వరరావు, హుజూరాబాద్ మున్సిపల్ చైర్మన్ గందె రాధిక శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.