హనుమకొండ, మే 3: ఐటీ, పురపాలక శాఖ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ నెల 5న హనుమకొండ జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ వరంగల్ పశ్చిమ, వర్ధన్నపేట నియోజకవర్గాల పరిధిలో సుమారు రూ.181.45 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. శుక్రవారం మధ్యా హ్నం 3.30 గంటలకు హుస్నాబాద్ నుంచి ఎర్రగట్టు గుట్ట వద్ద ఉన్న కిట్స్ కళాశాలకు చేరుకొని ఇంక్యుబేషన్ సెంటర్ను ప్రారంభిస్తారు.
బాలాజీ గార్డెన్లో వర్ధన్నపేట నియోజకవర్గ పరిధిలో నిర్వహించిన క్రికెట్ టోర్నీ విజేతలకు బహుమతుల ప్రదానం, అక్కడి నుంచి వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. వరంగల్ రీజినల్ సైన్స్ సెంటర్లో రూ.1.80 కోట్లతో నిర్మించిన ఎస్సీ, ఎస్టీ సెల్ భవనాన్ని ప్రారంభించనున్నారు. హనుమకొండలో కార్మిక భవన్, పూలే భవన నిర్మాణానికి భూమిపూజ చేస్తారు. అ త్యాధునికంగా నిర్మించిన వైకుంఠధామాన్ని ప్రారంభిస్తారు. హనుమకొండ బాలసముద్రం లో నిర్మించిన బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు. సాయంత్రం కాజీపేటలోని సెయింట్ గ్యాబ్రియల్ స్కూల్ మైదానంలో 50 వేల మందితో ఏర్పాటు చేసే బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు.