వరంగల్, ఏప్రిల్ 19(నమస్తే తెలంగాణ ప్రతినిధి): మున్సిపల్, పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావు బుధవారం ఉమ్మడి వరంగల్ జిల్లాలో పర్యటించనున్నారు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ (జీడబ్లూఎంసీ)లో రూ.27 కోట్లతో పూర్త్తయిన పనులను ప్రారంభించనున్నారు. మరో రూ.150 కోట్లతో చేపట్టనున్న పనులకు శంకుస్థాపన చేస్తారు. రూ.11.50 కోట్లతో అభివృద్ధి చేసిన పబ్లిక్ గార్డెన్స్, రూ.1.5 కోట్లతో ఆధునీకరించిన రీజినల్ లైబ్రరీని ప్రారంభిస్తారు. రూ.7 కోట్లతో భద్రకాళి ఆలయ ఆర్చి నుంచి జీడబ్లూఎంసీ కార్యాలయం వరకు నిర్మించిన ఆర్4 రోడ్డును, రూ.7 కోట్లతో అలంకార్ దర్గా బ్రిడ్జి నుంచి స్మార్ట్ రోడ్ ఆర్3ని ప్రారంభించనున్నారు. రూ.8 కోట్లతో 150 కేఎల్డీ సామర్థ్యంతో ఏర్పాటు చేయనున్న మానవ వ్యర్థాల నిర్వహణ ప్లాంటుకు శంకుస్థాపన చేస్తారు. రూ.20.50 కోట్లతో నిర్మించనున్న జీడబ్లూఎంసీ పరిపాలన భవనానికి, రూ.2 కోట్లతో నిర్మించనున్న కౌన్సిల్ హాల్కు, విద్యుత్నగర్లో రూ.2 కోట్లతో నిర్మించనున్న దివ్యాంగుల శిక్షణ కేంద్రం పనులకు భూమిపూజ చేస్తారు. గ్రేటర్ వరంగల్, కుడాలపై అధికారులతో సమీక్షిస్తారు. తర్వాత నర్సంపేటలో ఇంటింటికీ గ్యాస్ సరఫరా కోసం పీఎన్జీ గ్యాస్ లైన్ను ప్రారంభిస్తారు. వరంగల్, హనుమకొండ జిల్లాలకు చెందిన 20 వేల మంది టీఆర్ఎస్ ముఖ్యకార్యకర్తలతో హయగ్రీవచారి గ్రౌండ్లో నిర్వహించనున్న సమావేశంలో కేటీఆర్ పాల్గొననున్నారు.