హైదరాబాద్, నవంబర్ 21 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గకేంద్రాల్లో ఈ నెల 29న దీక్షా దివస్ను ఘనంగా నిర్వహించాలని పార్టీ శ్రేణులకు బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. కరీంనగర్లో జరిగే దీక్షా దివస్లో తాను పాల్గొంటానని తెలిపారు. తెలంగాణ ప్రజల స్వరాష్ట్ర సాధనలో అత్యంత కీలకమైన ఘట్టంగా దీక్షా దివస్ నిలుస్తున్నది. 2009 నవంబర్ 29న భారత రాష్ట్ర సమితి (అప్పటి టీఆర్ఎస్) అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర్రావు చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షతో మలిదశ ఉద్యమం ఉవ్వెత్తిన ఎగిసి స్వరాష్ట్ర సాధనకు బలమైన పునాదులు పడిన సంగతి తెలిసిందే. దీక్షకు వెళ్లే ముందు ‘తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్ సచ్చుడో’ అనే తెగింపుతో చేపట్టిన ఈ దీక్ష తెలంగాణలోని సబ్బండవర్గాలను ఏకం చేసింది. యావత్ భారత దేశ రాజకీయ వ్యవస్థను కదిలించి, చరిత్రలో తొలిసారి తెలంగాణ రాష్ర్టాన్ని ఏర్పాటు చేస్తున్నామని కేంద్ర ప్రభుత్వం స్వయంగా ప్రకటన చేసేలా చేసి దశాబ్దాల తెలంగాణ ప్రజల చిరకాల ఆకాంక్షను నెరవేర్చింది.