హైదరాబాద్ : ఈనెల 7న జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకొని ‘నేతన్న భీమా పథకం’ అమలు చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చరిత్రాత్మక నిర్ణయం తీసుకోవడం హర్షణీయమని తెలంగాణ పద్మశాలీ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అవ్వారి భాస్కర్ సోమవారం ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు. చేనేత కార్మికుల సంక్షేమం కోసం దేశంలో మరే రాష్ట్రంలోనూ లేని విధంగా ఈ పథకాన్ని తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిందని పేర్కొన్నారు.
ఇప్పటికే చేనేత కార్మికుల కోసం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న ప్రభుత్వం తాజాగా బీమా పథకం అమలు చేయాలని నిర్ణయం తీసుకోవడం శుభ పరిణామమని తెలిపారు. బీమా కాల పరిమితిలో అర్హులైన చేనేత, మరమగ్గాల కార్మికులకు ఎవరైనా దురదృష్టవశాత్తు మరణం సంభవిస్తే వారి కుటుంబాలకు ఈ పథకం ఆర్థిక భరోసాను ఇస్తుందని తెలిపారు. మృతుల నామినీకి రూ.5 లక్షల బీమా సొమ్ము వస్తుందని తెలిపారు. లబ్ధిదారులు చనిపోయిన 10 రోజుల్లోనే నగదు సాయం వారి ఖాతాల్లో జమవుతుందని ప్రకటించిందని తెలిపారు.
బీమా ప్రీమియం కోసం కార్మికులు ఒక్క రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేదని, ప్రభుత్వమే ప్రీమియం చెల్లిస్తుందని తెలిపారు. ఈ మేరకు ప్రీమియం సొమ్ము కింద ఎల్ఐసీకి రూ.50 కోట్లు కేటాయించామని, రూ.25 కోట్లు విడుదల చేశామని మంత్రి కేటీఆర్ ప్రకటించడంపై హర్షం వ్యక్తం చేశారు. 60 ఏళ్లలోపు కార్మికులందరూ ఈ నేతన్న బీమా పథకానికి అర్హులేనని ప్రభుత్వం పేర్కొన్నదని తెలిపారు. సుమారు 80 వేల చేనేత, మరమగ్గాల కార్మికులకు ఈ పథకం వర్తిస్తుందని తెలిపారు. నేతన్న బీమా పథకం అమలుకు ముందుకొచ్చిన సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ కు అవ్వారి భాస్కర్ కృతజ్ఞతలు తెలిపారు.