KTR | భారత రాష్ట్ర సమితిని మరింత బలోపేతం చేయాలని, ప్రజాప్రతినిధులు వీలైనంత వరకు ప్రజల్లోనే ఉండాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. పార్టీ శ్రేణులతో ఆత్మీయ సమ్మేళనాలను నిర్వహించాలని సూచించారు. ఈ మేరకు కేటీఆర్ ఆదివారం పార్టీ జిల్లా అధ్యక్షులు, జనరల్ సెక్రెటరీలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. భారత రాష్ట్ర సమితిని మరింత బలోపేతం చేస్తూ.. 60లక్షల పార్టీ శ్రేణులను మరింత చైతన్యపరిచేలా విస్తృతంగా కార్యక్రమాలను చేపట్టాలని పార్టీ నిర్వహించిందని, సీఎం కేసీఆర్ సూచనల మేరకు పార్టీ కొన్ని కార్యక్రమాలను రూపొందించినట్లు తెలిపారు.
పార్టీలో పనిచేసే కిందిస్థాయి కార్యకర్త నుంచి మొదలుకొని ప్రజాప్రతినిధులు, రాష్ట్ర స్థాయి నాయకులందరి మధ్య ఒక ఆత్మీయ అనుబంధాన్ని బలోపేతం చేయనున్నట్లు చెప్పారు. బీఆర్ఎస్ పార్టీకి కార్యకర్తలే బలమన్న ఆయన.. వారితో ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించాలన్నారు. ఇందుకు ఎమ్మెల్యేలు బాధ్యత తీసుకోవాలని సూచించారు. ప్రతీ పది గ్రామాలను యూనిట్గా తీసుకొని ఎమ్మెల్యేలు పార్టీ సభ్యులతో ఆత్మీయ సమ్మేళనాలను నిర్వహించాలని కోరారు. పట్టణాల్లో ఒక్కో పట్టణానికి, లేదంటే డివిజన్లను కలుపుకుని ఈ సమ్మేళనాలు నిర్వహించాలన్నారు. సమ్మేళనాల్లో స్థానిక ఎంపీలను, ఎమ్మెల్సీలను, ఎమ్మెల్యేలను, కార్పోరేషన్ చైర్మన్లను, డీసీసీబీ, డీసీఎంఎస్ తదితర పార్టీ ముఖ్యులను కలుపుకొని పోవాలన్నారు.
ఆత్మీయ సమ్మేళనాలను రెండు నెలల్లోగా పూర్తి చేయాలని, ఏప్రిల్లో పార్టీ ఆవిర్భావ దినోత్సవం నాటికి ఈ ఆత్మీయ సమ్మేళన నిర్వహణ పూర్తి కావాలన్నారు. ఈ దిశగా జిల్లా అధ్యక్షులు తమ పరిధిలోని అన్ని గ్రామాలను కవర్ చేసేలా, పది గ్రామాలకు ఒక యూనిట్లుగా విభజించి, ఆయా యూనిట్లలో జరిగే ఆత్మీయ సమ్మేళనాలకు సంబంధించిన సంపూర్ణమైన షెడ్యూల్ (క్యాలెండర్) పార్టీకి వెంటనే అందించాలన్నారు. ఏ రోజు ఏయే యూనిట్లో, ఎక్కడ అత్మీయ సమావేశం నిర్వహిస్తున్నారో తేదీలతో సహా పార్టీ వివరాలు అందించాలని చెప్పారు. దీంతోపాటు జిల్లా పార్టీ కార్యాలయాలు అన్నింటిని ప్రారంభించుకోవాలని, కార్యక్రమం కూడా ఏప్రిల్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం నాటికి పూర్తి కావాలన్నారు. ఇందుకు సంబంధించిన షెడ్యూల్ను వెంటనే సిద్ధం చేయాలన్నారు. ఈ విషయంలో పార్టీతో సమన్వయం చేసుకొని, కార్యాలయాల ప్రారంభోత్సవ తేదీలను నిర్ణయించాలని ఆదేశించారు.
భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని ప్రభుత్వం, పార్టీ నిర్ణయించిందని కేటీఆర్ తెలిపారు. జయంతి ఉత్సవాల కార్యక్రమాలను రూపొందించుకోవాలన్నారు. దేశంలోనే అతిపెద్ద అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నామని, మరో వైపు పరిపాలన ఆత్మగౌరవ చిహ్నమైన నూతన సచివాలయనికి సైతం అంబేద్కర్ పేరు పెట్టినట్లు
గుర్తు చేశారు. దళితబంధు కార్యక్రమాన్ని ప్రారంభించి, విజయవంతంగా ముందుకు తీసుకుపోతున్నామన్నారు. దేశ చరిత్రలో ఏ పార్టీ కూడా బీఆర్ అంబేద్కర్ వారసత్వాన్ని, స్ఫూర్తిని ఇంత గొప్పగా గౌరవించుకోలేలేదన్నారు. ప్రభుత్వం, పార్టీ చేపట్టిన ఈ అద్భుతమైన కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా ఆయన జయంతి ఉత్సవాలను రాష్ట్రవ్యాప్తంగా జరుపుకోవాలన్నారు. అలాగే జూన్ 1న
అమరవీరుల స్థూపం ఆవిష్కరణ నేపథ్యంలో విస్తృతంగా కార్యక్రమాలు చేపట్టాలన్నారు. దాంతో పాటు 2023-24 విద్యా సంవత్సరం జూన్ నెల నుంచి ప్రారంభమవుతున్న నేపథ్యంలో పార్టీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలను చేపట్టాలని ఆదేశించారు.
పార్టీ విద్యార్థి విభాగ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టాల్సి ఉంటుందన్నారు. పార్టీ విద్యార్థి విభాగం నూతన కమిటీలను వేసుకోవడం ఇంటర్మీడియట్, డిగ్రీ, ఇంజినీరింగ్ వంటి వృత్తి విద్య కళాశాలలలో నూతన విద్యార్థులకు స్వాగత సభల పేరుతో కార్యక్రమాలను ఏర్పాటు చేయాలన్నారు. ఏప్రిల్ 25న నియోజకవర్గాల వారీగా పార్టీ ప్రతినిధుల సమావేశాలను నిర్వహించుకోవాలని, బీఆర్ఎస్ ఆవిర్భావం నేపథ్యంలో ఏప్రిల్ 25న పార్టీ జెండాల ఆవిష్కరణ అనంతరం నియోజకవర్గ కేంద్రాల్లో ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రజాప్రతినిధుల సభ నిర్వహించడం జరుగుతుందన్నారు. టెలీకాన్ఫరెన్స్లో ఇచ్చిన కార్యాచరణపై వారంలో నేరుగా పార్టీ కార్యాలయంలో సమావేశం ఉంటుందని, ఈ మేరకు ఆయా కార్యక్రమాలపై స్థూలమైన ప్రణాళికను సిద్ధం చేసుకురావాలని సూచించారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో పార్టీని మరింత ముందుకు తీసుకెళ్లేలా అందరం కలిసికట్టుగా పని చేద్దామని కేటీఆర్ పిలుపునిచ్చారు.