హైదరాబాద్, మార్చి 14 (నమస్తే తెలంగాణ): ‘కేంద్రంలోని బీజేపీ సర్కారు నోట్ల రద్దు గురించి ఘనంగా చెప్పుకొన్నది.. కానీ, ఫలితం మాత్రం శూన్యం’ అని రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ చురకలంటించారు. బీజేపీ ప్రభుత్వం స్విస్ బ్యాంకుల నుంచి నల్లధనం వెనక్కి తీసుకురావడం గురించి ఇక మర్చిపోండని ఆయన మంగళవారం ట్వీట్ చేశారు. మోదీ సర్కారు అత్యంత తెలివి తక్కువతనంతో నోట్ల రద్దు నిర్ణయం తీసుకొన్నదని విమర్శించారు. నోట్ల రద్దు తర్వాత దేశంలో నగదు చలామణి రెండింతలు పెరిగిందని కేంద్రమే ఒప్పుకొన్నదని వివరించారు. ఇది నాన్ ఫెర్మార్మింగ్ అలయన్స్ (ఎన్పీఏ) ప్రభుత్వం సాధించిన మరో అద్భుతమైన విజయం అంటూ ఎద్దేవా చేశారు.
ఫలితాలే పనితీరుకు నిదర్శనం
తెలంగాణ తన పనితీరును ఫలితాల్లో చూపెడుతున్నదని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. దేశంలో ఓడీఎఫ్ ప్లస్ ఘనత సాధించిన తొలి రాష్ట్రంగా తెలంగాణ నిలవడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, అధికారుల బృం దాన్ని ప్రత్యేకంగా అభినందించారు.