KTR | పోలీసులు అక్రమ కేసు బనాయించి వేధింపులకు గురిచేస్తున్న టీన్యూస్ ఖమ్మం జిల్లా రిపోర్టర్ సాంబశివరావు కుటుంబసభ్యులను రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర పరామర్శించారు. ఈ సందర్భగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో ఫోన్లో మాట్లాడించారు. ఈ సందర్భంగా జర్నలిస్టు కుటుంబానికి అండగా ఉంటామని భరోసానిచ్చారు.
యూరియా కోసం అగచాట్లు పడుతున్న రైతుల గురించి వార్తలు సేకరిస్తున్న సాంబశివరావుపై ఖమ్మం జిల్లా కొణిజర్ల పోలీసులు అక్రమ కేసు బనాయించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర శనివారం మధ్యాహ్నం ఖమ్మం బంగారయ్య నగర్లోని సాంబశివరావు ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు ఎంపీ రవిచంద్ర ఫోన్ చేసి సాంబశివరావు సతీమణి శ్రీదేవితో మాట్లాడించారు. పోలీసు కేసుతో అధైర్యపడవద్దని, తమతో పాటు బీఆర్ఎస్ కొండంత అండగా ఉంటుందని శ్రీదేవికి కేటీఆర్ భరోసానిచ్చారు.
రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల దృష్టికి తీసుకెళ్లే, ప్రశ్నించే, వార్తలు రాసే, ప్రసారం చేసే విలేకరులపై, సోషల్ మీడియా వారియర్స్, సామాజిక కార్యకర్తలపై పోలీసులు అక్రమ కేసులు బనాయించి వేధింపులకు గురిచేయడం పరిపాటిగా మారిందని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో అధైర్యపడకుండా, పిల్లలు కలత చెందకుండా చూసుకోవాలని, మీ కుటుంబానికి పార్టీ ఎల్లవేళలా అండగా ఉంటుందని కేటీఆర్, రవిచంద్రలు సాంబశివరావు సతీమణి శ్రీదేవి, అత్త మల్లమ్మ, కూతురు సహస్రలకు ధైర్యం చెప్పారు.