KTR | పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఎందుకు అంత పిరికివాళ్లుగా మారిపోయారో చెప్పాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. ఎన్ని తమాషాలు చేసినా ఉప ఎన్నికలు తప్పవని స్పష్టం చేశారు. కాంగ్రెస్కు ఓటమి ఖాయమని అన్నారు.
హైదరాబాద్ తెలంగాణ భవన్లో భద్రాచలం నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశానికి కేటీఆర్, కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు, పలువురు బీఆర్ఎస్ నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ నైజం మోసమే పునాది అని అన్నారు. అబద్ధాల పునాదుల మీదనే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని అన్నారు.
రేవంత్ రెడ్డి చేతిలో ప్రజలు మోసపోవడంలో వారి తప్పు లేదని చెప్పారు. మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత, కాంగ్రెస్ హామీల అమలులో పూర్తిగా విఫలమైందని విమర్శించారు. పాతకాలపు కాంగ్రెస్ రోజులను తిరిగి తీసుకువచ్చిందని మండిపడ్డారు.
కాంగ్రెస్ మోసాన్ని ప్రజలకు వివరించడంలో పార్టీగా మేం విఫలమయ్యామని కేటీఆర్ అన్నారు. మనం చేసిన మంచిని, అభివృద్ధిని చెప్పుకోలేకపోయామని తెలిపారు. ఆ రోజే కాంగ్రెస్ పార్టీ దొంగ పార్టీ అని ప్రజలకు వివరిస్తే బాగుండేదని అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి పాలనను నడిపించే సత్తా లేదని అన్నారు. అందుకే ప్రతిసారీ పాత ప్రభుత్వంపై నెపం నెట్టివేస్తోందన్నారు. తమ చేతగానితనాన్ని గతం చాటున దాచిపెడుతోందని విమర్శించారు. ఎన్ని తమాషాలు చేసినా ఉప ఎన్నికలు తప్పవని.. కాంగ్రెస్కు ఓటమి ఖాయమని జోస్యం చెప్పారు.
పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఎందుకు అంత పిరికివాళ్లుగా మారిపోయారో చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. నిజంగా పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలను చేర్చుకున్న కాంగ్రెస్కు దమ్ముంటే, “వారు మా కాంగ్రెస్లో చేరారు, ఉప ఎన్నికలకు పోదాం” అని చెప్పాలన్నారు. తంతే గారెలు బుట్టలో పడినట్టు, లక్కీ లాటరీలో పడ్డట్టు మంత్రి అయిన పొంగులేటి పెద్దగా మాట్లాడుతున్నారని విమర్శించారు. ప్రజాస్వామ్యంలో అహంకారంతో ఎగిరితే తిప్పికొడతారని తెలిపారు. మళ్లీ పాలేరులో ఎలా గెలుస్తారో చూద్దామన్నారు. ఏడాది క్రితం పొంగులేటి ఇంటిపై జరిగిన ఈడీ దాడుల గురించి కేంద్రం గానీ, ఆయన గానీ ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. ఆ దాడుల్లో దొరికిన డబ్బులు ఎన్నో ఎవరూ చెప్పలేదన్నారు. మరి పొంగులేటి బీజేపీతో కుమ్మక్కయ్యాడా?
లేదా బీజేపీతో కుమ్మక్కైన రేవంత్ రెడ్డితో పొంగులేటి కలిసిపోయడా? అని ప్రశ్నించారు. బతికినంత కాలం ధైర్యంగా బతకాలి కానీ ఇంత నీచమైన కుమ్మక్కు రాజకీయాలు ఎందుకు అని విమర్శించారు.