KTR | వరంగల్ జిల్లా కాకతీయ పౌరుషాల గడ్డ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఇది త్యాగాల గడ్డ.. పోరాటాల గడ్డ అని తెలిపారు. తెలంగాణ ఉద్యమ సమయంలో వరంగల్ కదం తొక్కిందని గుర్తుచేశారు. వరంగల్లో ఏం మొదలుపెట్టినా విజయవంతమవుతుందని తెలిపారు. వరంగల్లో పోరాటాల విల్లు ఎక్కుపెడితే.. ద్రోహుల గుండె జల్లుమంటుందని పేర్కొన్నారు.
హనుమకొండలో నిర్వహించిన రైతు సంగ్రామ సదస్సులో కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అమలుకాని హామీలు ఇచ్చి కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని మండిపడ్డారు. కొందరు కాంగ్రెస్ నేతలు రైతుల ఓట్ల కోసం గాలం వేశారని అన్నారు. వరంగల్ గడ్డ మీద నుంచే కాంగ్రెస్ పార్టీ రైతుల డిక్లరేషన్ ప్రకటించిందని తెలిపారు. కాంగ్రెస్ నాయకులు పెద్ద దొంగలు అని కేటీఆర్ విమర్శించారు. రాహుల్ గాంధీ వరంగల్ డిక్లరేషన్ సభ పెట్టి దొంగ హామీలిచ్చారని మండిపడ్డారు. ఇవాల్టితో కాంగ్రెస్ నయవంచనకు నాలుగేళ్లు నిండాయని తెలిపారు. రైతుల రక్తం తాగిన పార్టీ కాంగ్రెస్ అని మండిపడ్డారు. రైతు డిక్లరేషన్లో 34 హామీలిచ్చారని పేర్కొన్నారు. 34 హామీల్లో ఒక్కటి కూడా అమలు కాలేదని విమర్శించారు. బాండ్ పేపర్లు రాసి మరీ కాకమ్మ కబుర్లు చెప్పారని మండిపడ్డారు. ఆ దొంగ హామీలు నమ్మి రైతులు కాంగ్రెస్కు ఓటేశారని అన్నారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు పూర్తయిన రైతు డిక్లరేషన్ ఊసే లేదని కేటీఆర్ విమర్శించారు. రైతు డిక్లరేషన్పై అడిగితే ఒక్కరూ మాట్లాడటం లేదని అన్నారు. రైతులకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని తెలిపారు.