KTR | ఐదుగురు ఫిరాయింపు ఎమ్మెల్యేలపై స్పీకర్ గడ్డం ప్రసాద్ ఇచ్చిన తీర్పును బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. అసెంబ్లీ సాక్షిగా ఇవాళ ప్రజాస్వామ్యాన్ని కాంగ్రెస్ పార్టీ నిలువునా ఖూనీ చేసిందని విమర్శించారు. దేశ అత్యున్నత న్యాయస్థానాలపైనే కాదు.. చివరికి రాజ్యాంగంపై కూడా రాహుల్ గాంధీకి ఏమాత్రం గౌరవం లేదని మరోసారి తేలిపోయిందని అన్నారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఇంటికి వెళ్లి మరీ సీఎం రేవంత్ పార్టీ ఫిరాయింపులకు తెరతీసిన నాటి నుంచి నేటి స్పీకర్ నిర్ణయం వరకూ కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగాన్ని అడుగడుగునా అపహాస్యం చేస్తూనే ఉందని కేటీఆర్ విమర్శించారు. అభివృద్ధి కోసం పార్టీ మారినట్టు సాక్షాత్తు ఫిరాయింపు ఎమ్మెల్యేలే అనేక సార్లు ప్రకటించినా వారిని కాపాడటం రాహుల్ రెండు నాల్కల ధోరణికి నిదర్శనమని అన్నారు. కేవలం ఫోటోలకు ఫోజులిచ్చేందుకు చేతిలో రాజ్యాంగాన్ని పట్టుకుని తిరిగితే సరిపోదని.. తండ్రి చేసిన చట్టాన్నే గౌరవించలేని అసమర్థ నాయకుడిగా రాహుల్ గాంధీ చరిత్రలో మిగిలిపోతారని ధ్వజమెత్తారు.
సీఎం రేవంత్ రెండేళ్ల పాలనా వైఫల్యాలపై పంచాయతీ ఎన్నికల్లో పల్లెపల్లెనా వెల్లువెత్తుతున్న ప్రజావ్యతిరేకతకు భయపడే కాంగ్రెస్ పార్టీ బై ఎలక్షన్స్ అంటే జంకుతోందని కేటీఆర్ అన్నారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చర్య తీసుకోకుండా వెనకడుగు వేయడానికి ప్రధాన కారణం ఇదేనని తెలంగాణ సమాజానికి స్పష్టంగా అర్థమైపోయిందని విమర్శించారు. గోడ దూకిన BRS ఎమ్మెల్యేలను తాత్కాలికంగా కాపాడినట్టు కాంగ్రెస్ అనుకున్నా.. ప్రజాక్షేత్రంలో వారిని ఎమ్మెల్యే పదవికి అనర్హులుగా ఆయా నియోజకవర్గాల ప్రజలు ఎప్పుడో ప్రకటించేశారని తెలిపారు.