KTR | అప్పుడేమో అందరికీ 200 యూనిట్లు ఫ్రీ కరెంటు ఇస్తామని రేవంత్రెడ్డి అన్నారని.. కానీ ఇప్పుడు కొందరికే అంటున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశాల్లో భాగంగా అచ్చంపేటలో నిర్వహించిన సమావేశంలో ప్రసంగించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ కార్యకర్తలపై దాడులు చేస్తే ఊరుకునేది లేదని స్పష్టం చేశారు. మరి కొద్ది రోజులు భరిస్తామని.. తర్వాత వాళ్లు ఇటుకలతోని కొడితే తాము రాళ్లతోనే కొడతామని హెచ్చరించారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతడని ముందే చెప్పి ఉంటే కాంగ్రెస్కి 30 సీట్లు కూడా రాకపోవునన్నారు. రేవంత్ రెడ్డి సొంత ఊరు కొండారెడ్డిపల్లిలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ఎవరూ అనుకోలేదన్నారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి లెక్క మాట్లాడడం లేదని.. లంకె బిందెల దొంగ లెక్క మాట్లాడుతున్నాడన్నారు.
లంకె బిందెల కోసం దొంగలు అర్ధరాత్రి తిరుగుతారని.. కానీ సచివాలయంలో రాజకీయ నాయకులు తిరుగరన్నారు. లంకె బిందెలు వెతికే రేవంత్ రెడ్డి పాత బుద్దులు మళ్లీ బయటకి వస్తున్నాయన్నారు. రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుబంధు కోసం మొహాలు చూసుకునే పరిస్థితి వచ్చిందన్నారు. కరెంటు కోతలు, తాగునీటి గోసలు ప్రారంభమయ్యాయన్నారు. ఇదే మార్పు అంటే అని ప్రశ్నించారు. మిషన్ భగీరథను నిర్వహించే తెలివి కూడా ఈ ప్రభుత్వానికి లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులే అధికారంలోకి వస్తామని అనుకోలేదని.. అందుకే అడ్డగోలుగా హామీలు ఇచ్చారని.. అందరికీ అన్ని ఇస్తామన్నారు. అప్పుడేమో అందరికీ అన్ని ఇప్పుడేమో కొందరికి మాత్రమే కొన్ని ఇస్తామంటున్నారన్నారు. రైతులకు రూ.2లక్షల రుణమాఫీ చేస్తామన్నారన్నారు. ఆడబిడ్డలకి రూ.2,500 ప్రతినెలా ఇస్తామన్నారని.. ఇంట్లో అవ్వతాతలకు ఇద్దరికీ రూ. 4వేల చొప్పున ఇస్తామని చెప్పారని.. ఎలక్షన్ కమిషన్ లెక్క ప్రకారం.. ఒకటి కాదు రెండు కాదు 1.67 లక్షల మంది ఆడబిడ్డలున్నారన్నారు.
వాళ్లందరి నెలకు రూ.2,500 ఎప్పుడిస్తారని ఎదురుచూస్తున్నారన్నారు. రూ.500 సిలిండర్ అన్నాడని.. 1.24కోట్ల గ్యాస్ సిలిండర్ కనెక్షన్లు ఉన్నాయని.. వాళ్లంతా సిలిండర్ల కోసం ఎదురుచూస్తున్నారన్నారు.
200 యూనిట్లు ఫ్రీ అని అప్పుడేమో అందరికీ అన్ని ఇస్తా అన్నాడని.. కానీ ఇప్పుడు కొందరికే అంటున్నారని మండిపడ్డారు. వందరోజుల పాటు ప్రభుత్వానికి అవకాశం ఇద్దాం అనుకున్నామని.. శ్రీకృష్ణుడు శిశుపాలుడి 100 తప్పులు లెక్కపెట్టినట్లు ఆగుదామనుకున్నాం కానీ.. కానీ తొలి అసెంబ్లీ సమావేశంలోనే బీఆర్ఎస్ పార్టీపై, తమపై, పార్టీ అధినేతపై అడ్డగోలుగా విమర్శలు చేశారన్నారు. పార్టీ కార్యకర్తలు ఎలాంటి పదవులు ఆశించకుండా కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ కోసం సంవత్సరాల పాటు కష్టపడి పని చేశారన్నారు. వారందరికీ భవిష్యత్తు పైన భరోసా ఉంది నమ్మకం ఉన్నదన్నారు. పార్టీ నాయకులు కార్యకర్తలను ఒక్క సంవత్సరం కాపాడుకుంటే ఆ కార్యకర్తలే నాయకులను కాపాడుకుంటారన్నారు.
వచ్చిపోయే ముఖ్యమంత్రులు ఎంతమంది ఉన్నా.. తెలంగాణ తెచ్చిన నాయకుడు కేసీఆర్ ఒక్కరేనన్నారు. తెలంగాణ తెచ్చిన కేసీఆర్ చరిత్రను ఎవరు చెరిపేయలేరన్నారు. మోదీ హవా లేదని.. ఏం లేదన్నారు. పాలమూరు రంగారెడ్డికి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా ఇవ్వని ప్రధాని మోదీ గురించి మనమెందుకు ఆలోచించాలన్నారు. కృష్ణానదిపై ఉన్న నీళ్లన్ననింటిని కేఆర్ఎంబీకి అప్పజెప్పి, ఢిల్లీ వాళ్ల చేతిలో పెట్టిన వ్యక్తి రేవంత్ రెడ్డి అని విమర్శించారు. నల్లగొండలో పార్టీ మీటింగ్ పెడితే దెబ్బకు అసెంబ్లీలో తీర్మానం పెట్టి కేఆర్ఎంబీకి ఇయ్యలేనని తీర్మానం పెట్టిండన్నారు. రెండు జాతీయ పార్టీలు తెలంగాణ ప్రయోజనాలకు దెబ్బకొడుతున్నాయని ఆరోపించారు. అందుకే ఏ రోజు అయినా ఈ గులాబీ జెండా ఉంటేనే తెలంగాణ ప్రయోజనాలు గల్లీ నుంచి ఢిల్లీ దాకా కాపాడబడతాయన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో మంచి మెజార్టీ సాధించి పూర్వవైభవాన్ని సాధించుకుందామన్నారు. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కారును వంద కిలోమీటర్ల స్పీడ్తో నడిపిద్దామన్నారు. నాగర్ కర్నూల్ పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీని మళ్లీ గెలిపిస్తారన్న విశ్వాసం మాకు ఉన్నదన్నారు.