హైదరాబాద్, జూలై 9 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక తొలి క్యాబినెట్లోనే 25 వేల పోస్టులతో మెగా డీఎస్సీ వేస్తామన్న హామీ ఏమైందని సీఎం రేవంత్రెడ్డిని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఒక ప్రకటనలో ప్రశ్నించారు. ముఖ్యమంత్రిగా మీకు మోకా వస్తే.. డీఎస్సీ అభ్యర్థులకు ఇంత ధోకా చేస్తారని ఊహించలేదని చెప్పారు.
మెగా డీఎస్సీ అని తీరా అధికారంలోకి వచ్చాక నిరుద్యోగ యువతను నిలువునా మోసం చేశారని ధ్వజమెత్తారు. డీఎస్సీ వాయిదా వేయాలని, పోస్టుల సంఖ్యను పెంచాలని డిమాండ్ చేస్తూ ఉస్మానియా యూనివర్సిటీలో ఆందోళన చేస్తున్న అభ్యర్థులపై అక్రమ కేసులు, నిర్బంధం, అరెస్ట్ చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. లక్షలాది మంది డీఎస్సీ అభ్యర్థుల ఆక్రందన కాంగ్రెస్ సరారుకు వినపడటం లేదా? అని నిలదీశారు.
గతంలో ఉస్మానియా విద్యార్థులు అడ్డమీద కూలీల్లాంటి వారని, తిన్నది అరిగేదాకా అరిచే బీరు, బిర్యానీ బ్యాచ్ అని ఇదే సీఎం రేవంత్రెడ్డి బద్నాం చేసిన విషయాన్ని కేటీఆర్ గుర్తు చేశారు. సిద్ధాంతం, ఆలోచన లేని ఆవారా టీమ్ అని వారి అవహేళన చేసిన మీరు.. అదే విద్యార్థులను రెచ్చగొట్టి అధికారంలోకి వచ్చారన్న సంగతి మర్చిపోవద్దని గుర్తుచేశారు.
అధికారంలోకి రాగానే నేడు అదే ఉస్మానియా యూనివర్సిటీని రణరంగంగా మార్చి.. డీఎస్సీ అభ్యర్థులపై పోలీసులను ప్రయోగించి అణచివేస్తున్నారని మండిపడ్డారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం దేశ సరిహద్దుల్లో ఉన్నదా? అకడికి అన్ని బలగాలను తెచ్చి ఎందుకంతా నిర్బంధాన్ని విధిస్తున్నారో అర్థం కావడం లేదని ప్రశ్నించారు. మళ్లీ ఉస్మానియాలో ఉద్యమం నాటి పరిస్థితులను రేవంత్రెడ్డి సరార్ తీసుకొస్తున్నదని మండిపడ్డారు.
అభ్యర్థుల భవిష్యత్తుతో చెలగాటం
డీఎస్సీ ప్రిపరేషన్కు సమయం ఇవ్వకుండా అభ్యర్థుల భవిష్యత్తుతో చెలగాటం ఆడటం న్యాయమా? అని కేటీఆర్ ప్రశ్నించారు. పరీక్షల వాయిదా కోరుతుంటే, ప్రభుత్వం ఎందుకు మొండివైఖరి ప్రదర్శిస్తున్నదని నిలదీశారు. డిమాండ్లను ఆడబిడ్డలు అడిగినంత మాత్రాన అర్ధరాత్రి వరకు అక్రమంగా నిర్బంధిస్తారా? అని ప్రశ్నించారు.
సోకాల్డ్ మేధావులెకడ?
ఇన్నాళ్లు కాంగ్రెస్ సరార్ను భుజాన మోసిన సోకాల్డ్ మేధావులు ఇప్పుడు ఎకడున్నారని కేటీఆర్ ప్రశ్నించారు. ప్రశ్నించే గొంతులు నేడు ఎందుకు మూగబోయాయో చెప్పాలని నిలదీశారు. ఇప్పటికైనా డీఎస్సీ వాయిదా, పోస్టుల పెంపు డిమాండ్లను నెరవేర్చాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. డీఎస్సీ అభ్యర్థులకు న్యాయం జరిగే వరకు బీఆర్ఎస్ జెండా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
ప్రభుత్వం మొండి వైఖరి ప్రదర్శిస్తే నిరుద్యోగులతో కలిసి మరో ఉద్యమాన్ని నిర్మిస్తామని హెచ్చరించారు. ఎన్నికల ముందు ఆశలు చూపి అధికారంలోకి వచ్చిన మరుక్షణం నుంచే అణచివేతకు పాల్పడుతున్న సరార్పై నిరుద్యోగ యువత భగ్గు మంటున్నదని బీఆర్ఎస్ పార్టీ ట్వీట్ను కేటీఆర్ రీట్వీట్ చేశారు.