భారత్ ఎందుకు చెప్పాలి?
ప్రధాని మోదీకి కేటీఆర్ ట్వీట్
హైదరాబాద్, జూన్ 6 (నమస్తే తెలంగాణ): మహ్మద్ ప్రవక్తపై బీజేపీ నాయకులు నూపుర్శర్మ, నవీన్కుమార్ జిందాల్ చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలకు భారత్ క్షమాపణలు చెప్పాలని ఇరాన్, ఖతార్, కువైట్ దేశాలు భారత రాయబారులకు సమన్లు పంపిన నేపథ్యంలో రాష్ట్ర మంత్రి కేటీఆర్ ఘాటుగా స్పందించారు. బీజేపీ నేతల వ్యాఖ్యలకు భారత్ ఎందుకు క్షమాపణ చెప్పాలని ప్రధానిని సూటిగా ప్రశ్నించారు. క్షమాపణ చెప్పాల్సింది దేశం కాదు బీజేపీయేనని ట్వీట్ చేశారు.
‘ప్రధానమంత్రి నరేంద్రమోదీజీ.. బీజేపీ నాయకుల మతోన్మాద ద్వేషపూరిత ప్రసంగాలకు భారతదేశం అంతర్జాతీయ సమాజానికి ఎందుకు క్షమాపణలు చెప్పాలి? క్షమాపణ చెప్పాల్సింది బీజేపీ. రోజురోజుకు విద్వేషాన్ని చిమ్ముతున్నందుకు, వ్యాప్తి చేస్తున్నందుకు మీ పార్టీ ముందుగా భారతీయులకు క్షమాపణ చెప్పాలి. మోదీజీ.. మహాత్మాగాంధీ హత్యను బీజేపీ ఎంపీ ప్రజ్ఞాసింగ్ ప్రశంసించినప్పుడు మీరు మౌనంగా ఉండటం తీవ్ర దిగ్భ్రాంతి కలిగించింది. ఉన్నతస్థాయి నుంచి వచ్చిన నిశ్శబ్ద మద్దతు దేశానికి కోలుకోలేని నష్టాన్ని కలిగించే మతోన్మాదం, విద్వేషాలను బలపరుస్తుంది’ అని పేర్కొన్నారు.