KTR | సీఎం రేవంత్ రెడ్డి కక్షపూరిత వైఖరి కారణంగా చేయని తప్పునకు చర్లపల్లి జైల్లో కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి శిక్ష అనుభవిస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. చర్లపల్లి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న పట్నం నరేందర్ రెడ్డితో కేటీఆర్ శనివారం ములాఖత్ అయ్యారు. అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. పేద, గిరిజన, బలహీనవర్గాల రైతుల తరఫున పోరాటం చేసిన పాపానికి జైలు పాలైన మా నరేందర్ రెడ్డి గారిని చర్లపల్లి జైల్లో పరామర్శించామని తెలిపారు. పట్నం నరేందర్ రెడ్డిని కలిసినప్పుడు ఆయన తన గురించి కాకుండా 30 మంది అమాయక రైతులను విడిపించండని చెప్పారని తెలిపారు. అందుకు నరేందర్ రెడ్డికి అభినందనలు చెప్పారు. కొడంగల్లో దళిత, గిరిజన, బహుజన భూములు గుంజుకొని అక్కర్లేని ఫార్మా విలేజ్ను రుద్దుతున్నారని.. వారికోసం పోరాటం చేయండని చెబుతూ బాధపడుతున్నారని పేర్కొన్నారు.
సంగారెడ్డి జైలు నుంచి చర్లపల్లి జైలు వరకు తప్పు చేయని అమాయకులు జైల్లో ఉన్నారని కేటీఆర్ అన్నారు. కానీ కొడంగల్ నుంచి కొండారెడ్డి పల్లె వరకు అరాచకాలు చేస్తున్న దుర్మార్గులు గద్దెనెక్కి కూర్చున్నారని మండిపడ్డారు. కొడంగల్లో అర్ధరాత్రి పూట ఇళ్లపై పడి మహిళలు, పిల్లలపై అరాచకాలు చేస్తూ పేద రైతుల భూములు గుంజుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి సొంతూరు కొండారెడ్డిపల్లిలో మాజీ సర్పంచ్ 85 ఏళ్ల సాయిరెడ్డి అనే వ్యక్తిపై పగబట్టారన్నారు. రేవంత్ రెడ్డి కోసం ఆయన మొన్నటి ఎన్నికల్లో పనిచేశారని.. కానీ ఆయన ఇంటికి అడ్డంగా గోడకట్టి తోవ లేకుండా చేశారని చెప్పారు. ఆ క్షోభ, అవమానంతో సాయిరెడ్డి ఆత్మహత్య చేసుకున్నారని తెలిపారు. నియంతలు, దుర్మార్గుల పాలనలోనే ఇలాంటి సంఘటనలు చూస్తుంటామని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో మేము అధికారంలో ఉన్నామని.. ఎప్పుడైనా ఇలాంటి ఘటనల గురించి విన్నామా అని ప్రశ్నించారు.
సొంత ఊరు, సొంత నియోజకవర్గమైతే నీ సామ్రాజ్యమా, నువ్వు చక్రవర్తివా అని సీఎం రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. వెయ్యి ఏళ్లు బతకటానికి ఏమైనా వచ్చావా అని వ్యాఖ్యానించారు. సొంత ఊరు, సొంత నియోజకవర్గమైతే నేను ఆడింది ఆట, పాడింది పాట అంటే కుదరదని స్పష్టం చేశారు. నువ్వు నియంత కాదు.. చక్రవర్తి కాదు.. నీలాంటి వాళ్లు చాలా మంది కొట్టుకుపోయారు. నువ్వు కూడా కొట్టుకుపోతావని అన్నారు. శిశుపాలుడి తప్పులను ఆనాడు లెక్కించినట్లు కాంగ్రెస్ ప్రభుత్వ అరాచకాలు, రేవంత్ రెడ్డి పాపాలను ప్రజలు ఇప్పుడు లెక్కిస్తున్నారని తెలిపారు.
భూ కుంభకోణాలు, ఫార్మా విలేజ్ పేరుతో దౌర్జన్యాలు, పేద, గిరిజన రైతుల కుటుంబాల మీద అర్థరాత్రి బందిపోట్ల మాదిరిగా పోలీసులు దాడి చేస్తున్నారని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారం ఉంది కదా అని విచ్చలవిడిగా దౌర్జన్యం చేస్తూ సాయిరెడ్డి, గురువా రెడ్డి లాంటి వాళ్లు ఆత్మహత్యలు చేసుకునే విధంగా చేశారని విమర్శించారు. సొంత గ్రామంలో చేస్తున్న అరాచకాల పాపాలు పండే రోజు దగ్గరలోనే ఉందని తెలిపారు. నీ కన్నా పెద్ద పెద్ద నియంతలు కూడా కొట్టుకుపోయారని అన్నారు. మా నేత నరేందర్ రెడ్డి చాలా ధైర్యంగా ఉన్నాడని అన్నారు. పేదలు, గిరిజన రైతులకు అన్యాయం జరగకుండా చూడాలని కోరాడని చెప్పారు. మహబూబాబాద్లో బీఆర్ఎస్ చేపట్టనున్న ధర్నా బాగా చేయాలంటూ మాకు ఉత్సాహానిచ్చారని అన్నారు.
నరేందర్ రెడ్డికి, చేయని తప్పునకు జైల్లో ఉన్న 30 మంది అమాయక రైతుల కుటుంబాలకు ఒకటే చెబుతున్నాం.. మీరు భయపడాల్సిన అవసరం లేదు.. మీ వెనుక కేసీఆర్ ఉన్నాడు. తప్పకుండా న్యాయం, ధర్మం గెలుస్తుంది.. అని కేటీఆర్ భరోసా ఇచ్చారు. రేవంత్ రెడ్డి మిమ్మల్ని నాలుగు రోజులు జైల్లో పెట్టవచ్చు.. కానీ ఆయనకు మళ్లీ రాజకీయ జీవితం లేకుండా చేసే బాధ్యత మీ మీద ఉందని చెప్పారు.