KTR | ప్రతి గెలుపులో పాఠాలుంటాయని.. ఓటమిలో గుణపాఠాలుంటాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ తొమ్మిదిన్నర ఏళ్ల పాలనపై ‘స్వేదపత్రం’ పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. అనంతరం మీడియా అడిగిన పలు ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చారు. ఈ సంద్భంగా మాట్లాడుతూ.. ‘ఓటమిలో గుణపాఠాలుంటాయి. చాలా అంశాలు ఉన్నాయి. ఒకటి రెండు అని చెప్పను గానీ.. భారతదేశంలో ఉద్యోగులకు అత్యధిక జీతాలు ఇచ్చాం. కానీ, ఆ ఉద్యోగులకు ఈ జీతాలు అత్యధికమని మేం ప్రచారం చేసుకోలేకపోయాం. అత్యధికంగా భారతదేశంలోనే నిరుద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చాం. కానీ, చెప్పుకోలేకపోయాం.. వారి వరకు ఆ విషయం చేరలేకపోయింది. జరిగిందంటే.. ‘నిజం గడప దాటేలోపల.. అబద్ధం ఊరంతా తిరిగి వస్తుంది’ పెద్దలు సామత చెబుతుంటారు. మా విషయంలో అదే జరిగింది. ఉద్యోగాలు ఇచ్చి చెప్పుకోలేకపోయాం.. యూట్యూబ్లో కొందరు బట్టగాల్చి మీదేసే ప్రయత్నం చేస్తే దాన్ని నివారించలేకపోయాం. తద్వారా కొంత నష్టం జరిగింది’ అన్నారు.
‘1.85శాతం ఓట్లతో తాము ఓడిపోయాం. అందులో ఏడెనిమిది సీట్లు నాలుగైదు వేల ఓట్ల మెజారిటీతో పోయాయి. కాబట్టి ఇది ఘోర అపజయం కాదు. ఇది కేవలం ఒక స్పీడ్ బ్రేకర్ మాత్రమే. అందుకే అదే కాన్ఫిడెన్స్తో చెబుతున్నాను. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏం జరుగుతుందో ప్రజలు గమనిస్తున్నారు. అలవికాని వాగ్ధానాలు ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటే కోరుతున్నా. మీరు విజయవంతం కావాలని మేం కోరుకుంటున్నాం.. మీరిచ్చిన ప్రతి హామీ నెరవేర్చాలని కోరుతున్నాం. వందరోజుల్లో చాలా చేస్తామని చెప్పారు. వందరోజుల కౌంట్డౌన్ ప్రారంభమైంది. తప్పకుండా ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలి. మొన్ననే నాలుక మడతేశారు. నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి మ్యానిఫెస్టోలో పెట్టి.. మొన్న ఉప ముఖ్యమంత్రి మేం అనలేదనే మాట అన్నారు. ఇట్ల ఎన్నో అంశాలున్నాయ్.. ఆరు గ్యారెంటీలు కాదు.. 142 హామీలున్నాయి. వాటిని లెక్కదీశాం. మా పార్టీ తరఫున షాడో టీమ్ ఏర్పాటు చేస్తాం. డిపార్ట్మెంట్బై డిపార్ట్మెంట్ షాడో టీంను ఏర్పాటు చేస్తాం. వేరే దేశాల్లో షాడో క్యాబినెట్ అంటారు. అలాంటిదే మా లెజిస్లేచర్లో ఏర్పాటు చేసుకుంటాం. తప్పకుండా ఈ ప్రభుత్వ ప్రతిశాఖలో, ప్రతిరంగంలో వీళ్ల పనితీరు.. వీళ్లు ఏం చేస్తున్నరు.. ఏయే నిర్ణయాలు తీసుకుంటున్నరు? వాటన్నింటిని నిశితంగా గమనించి ప్రజలకు వివరిస్తాం. ప్రజల పక్షాన నిలబడతాం. దీపస్తంభంగా మారిన తెలంగాణను ఆరనివ్వం.. పడిపోనివ్వమని చెబుతున్నా’నన్నారు.
‘రాజకీయాల్లో గెలుస్తమనే ఆశిస్తాం పోటీకి వెళ్లిన ప్రతిసారీ. గెలుస్తమే విశ్వాసం ఉండేది. ఫలితాలు మమ్మల్ని నిరాశ పరిచినా బాధ లేదు. ఎందుకంటే ప్రజలు రెండుసార్లు అవకాశం ఇచ్చారు. వారికి కృతజ్ఞతలు చెబుతున్నాం. వారి కోసం పోరాడుతాం. ప్రతి అంశంపై రివ్యూ చేస్తాం. మేం శాసనసభలోనే డిమాండ్ చేశాం. సాగునీటిపై చర్చలో, శ్వేతపత్రాల విడుదలలోనే మేం డిమాండ్ చేశాం. అధికారం వాళ్ల చేతుల్లోనే ఉంది. అధికారాన్ని ప్రజలకు సేవ చేసేందుకు, హామీలను నెరవేర్చేందుకు వినియోగిస్తారా? కక్ష్య సాధింపు కోసం వినియోగిస్తారా? అది వాళ్ల విజ్ఞత. ఏరకంగా చేసిన మాకు అభ్యంతరం లేదు. ఏ ఎంక్వైరీ అయినా.. ఏ కమిషన్ అయినా.. ఏ రకమైన ఆదేశాలు ఇచ్చినా మాకు అభ్యంతరం లేదు. మేమే సభలో ఎంక్వైరీ చేయమని డిమాండ్ చేశాం. తప్పులుంటే బయటపెట్టమనండి. అన్నింటిని న్యాయపరంగా ఎదుర్కొంటాం. యువత దుష్ప్రచారాన్ని నమ్మినట్టు అనిపించింది. దాన్ని సవరించుకోవాల్సిన బాధ్యత మా మీదున్నది. ఆ రోజే స్పందించి ఉంటే బాగుండే అని అభిప్రాయం ఉంది. మా తరఫున చిన్నచిన్న తప్పులు, పొరపాట్లు జరిగినయ్. సవరించుకొని ముందుకెళ్తాం. నిరర్ధక అప్పులు, ప్రొడక్టివ్ సెక్టార్పై పెట్టే పెట్టుబడికి వ్యత్యాసం గమనించాలి. పెరిగిన సంపద చూడాలి.. ఉద్యోగుల జీతాలు అనేది కరోనా ఆర్థిక ప్రతిష్ఠంభన తర్వాతనే కొంత ఇబ్బంది వచ్చింది. దాన్ని కూడా అర్థం చేసుకోవాలని కోరుతున్నాను’ అని కేటీఆర్ అన్నారు.