హైదరాబాద్, ఏప్రిల్ 14 (నమస్తే తెలంగాణ): స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వాన్ని బోధించే మతం అంటే తనకు ఇష్టమని ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కే తారకరామారావు పేర్కొన్నారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా ప్రపంచంలోనే అతి పెద్ద విగ్రహాన్ని సీఎం కేసీఆర్ ఆవిష్కరించడం చాలా సంతోషంగా ఉన్నదని శుక్రవారం ట్వీట్ చేశారు.
‘ఆధునిక భారతానికి మార్గదర్శి, ప్రపంచంలోనే గొప్పదైన భారత రాజ్యాంగ రూపకర్త, సామాజిక అసమానతలను రూపుమాపడానికి జీవితాంతం కృషి చేసిన మహనీయుడు డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ నమస్సుమాంజలి’ అంటూ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత శుక్రవారం ట్విట్టర్లో నివాళులు అర్పించారు. అంబేద్కర్ స్ఫూర్తితో రాష్ట్రంలో దళిత, గిరిజన, బహుజన, మైనార్టీ వర్గాలకు విద్య, వైద్యం, ఉపాధితోపాటు సామాజికంగా ఉన్న స్థితికి చేర్చేందుకు అనేక కార్యక్రమాలు అమలవుతున్నాయని పేర్కొన్నారు. హైదరాబాద్లో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడం చరిత్రాత్మకం, గర్వకారణమని తెలిపారు.