KTR | హైదరాబాద్ : ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 12 స్థానాలకు 12 గెలువబోతున్నామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ విశ్వాసం వ్యక్తం చేశారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన సీనియర్ నాయకులు డాక్టర్ చెరుకు సుధాకర్.. బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ ప్రసంగించారు.
మన ఇంట్లో పుట్టిన కూతరికి పెళ్లి చేయాలంటే ఎంతో ఆలోచిస్తాం.. ఇచ్చే వ్యక్తి మంచొడా..? కాదా..? అని ఆలోచిస్తాం అని కేటీఆర్ తెలిపారు. ఒకటికి పదిసార్లు చెడు వ్యసనాలు ఏమైనా ఉన్నాయా? అని ఆలోచిస్తాం. మనింటి అమ్మాయిని వేరే ఇంటికి ఇవ్వాలంటేనే పది సార్లు ఆలోచించే మనం.. ఇంత కఫష్టపడి సాధించుకున్న ఈ రాష్ట్రాన్ని ఎవరి చేతుల పెట్టాలనేటప్పుడు ఆలోచించుకోవాల్నా..? వద్దా..? అని కేటీఆర్ అడిగారు.
46 రోజుల పాటు కాంగ్రెస్ నిరంకుశ విధానాలకు వ్యతిరేకంగా పోరాటం చేసి, జైలు శిక్ష అనుభవించిన చెరుకు సుధాకర్ సహా, జిట్టా బాలకృష్ణ, ఏపురు సోమన్న, హర్ దీప్ రెడ్డి లాంటి వాళ్ళు పార్టీలో చేరడం గొప్ప విషయం అని కేటీఆర్ అన్నారు. నల్లగొండ జిల్లాలో 12కు 12 స్థానాల్లో బ్రహ్మాండమైన మెజార్టీతో గులాబీ జెండా ఎగురతదనే సంపూర్ణమైన విశ్వాసం వ్యక్తం చేస్తున్నానని కేటీఆర్ పేర్కొన్నారు. గ్రామాల్లో ఉన్నవారి వద్ద కూడా చర్చ పెట్టండి. తెలంగాణ ఎలా అభివృద్ధి చెందిందో వివరించండి. అడ్వాన్స్గా విజయదశమి శుభాకాంక్షలు తెలియజేస్తూ.. మంచి విజయం నల్లగొండ జిల్లాలో రావాలని కోరుకుంటున్నాను అని కేటీఆర్ తన ప్రసంగాన్ని ముగించారు.