కరీంనగర్: పదేండ్ల నిజం కేసీఆర్ పాలన, పదేండ్ల విషం బీజేపీ పాలన.. 150 రోజుల అబద్ధం రేవంత్ రెడ్డి పాలన మధ్య పోటీ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు. గత పదేండ్లలో బీజేపీ ఏం చేసిందో చెప్పాలని డిమాండ్ చేశారు. ఐదేండ్లలో బండి సంజయ్ గల్లీలో, ఢిల్లీలో ఎక్కడైనా కనిపించారా అని ప్రశ్నించారు. కరీంనగర్ అభివృద్ధికి బండి సంజయ్ కేంద్ర నిధులు తీసుకొచ్చారా అని నిలదీశారు. ప్రజల తరఫున పార్లమెంటులో గళం విప్పిన నాయకుడు వినోద్ కుమార్ అని చెప్పారు. బీఆర్ఎస్ కరీంనగర్ ఎంపీ అభ్యర్థి వినోద్ కుమార్కు మద్దతుగా హుజూరాబాద్లో కేటీఆర్ రోడ్ షో నిర్వహించారు. అమిత్షా చెప్పులు మోయడం తప్ప సంజయ్ ఒక్కపనైనా చేశారా అని ఎద్దేవా చేశారు. కేంద్ర నిధులు రాబట్టే సత్తా వినోద్కు ఉందని తెలిపారు.
కేసీఆర్ పాలన ఎలా ఉంది.. కాంగ్రెస్ పాలన ఎలా ఉందో ప్రజలు గమనించాలన్నారు. ప్రలోభాలకు ప్రజలు లొంగవద్దని కోరారు. ఆరు గ్యారంటీల హామీ నెరవేర్చారా అని ప్రశ్నించారు. రూ.500 బోనస్ ఇస్తామన్న రేవంత్ హామీ ఏమైందని నిలదీశారు. రూ.2 లక్షల రుణమాఫీ అయ్యిందా.. తులం బంగారం వచ్చిందా అని అడిగారు. మహిళలకు నెలకు రూ.2500 ఇస్తామన్న హామీ ఏమైందన్నారు. కేంద్రంలో ఉన్న సవతి తల్లిపై పోరాటం చేయాలని, అలా పోరాడే వ్యక్తులే పార్లమెంటుకు వెళ్లాలని చెప్పారు.
పార్లమెంటులో బీఆర్ఎస్ ఎంపీలు ఉంటేనే తెలంగాణకు రక్ష అని వినోద్ కుమార్ అన్నారు. హైదరాబాద్ను కేంద్రపాలిత ప్రాంతం చేసేందుకు కేంద్రం కుట్రలు చేస్తున్నదని విమర్శించారు. మోదీతో కలిసి చంద్రబాబు, రేవంత్రెడ్డిలు హైదరాబాద్పై కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. దక్షిణ కాశీ వేములవాడ ఆలయ అభివృద్ధికి మోదీ ఒక్క రూపాయి ఇవ్వలేదన్నారు. తెలంగాణ సమస్యంలపై కేంద్రంతో మాట్లాడని ఎంపీ బండి సంజయ్ అవసరమా అని ప్రశ్నించారు. కేసీఆర్ ఇచ్చిన హామీలన్నీ అమలు చేసి రాష్ట్రాన్ని అభివృద్ధి చేశారని తెలిపారు.
పదేళ్ల నిజం కేసీఆర్ పాలన..
పదేళ్ల విషం నరేంద్ర మోడీ పాలన..
150 రోజుల అబద్ధం రేవంత్ రెడ్డి పాలన మధ్య పోటీ.– హుజూరాబాద్ రోడ్ షోలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS.#VoteForCar #LokSabhaElections2024 @vinodboianpalli @KaushikReddyBRS pic.twitter.com/w69wNjJ8zB
— BRS Party (@BRSparty) May 11, 2024