KTR | హత్యా రాజకీయాలు చేయాల్సిన అవసరం తమకు లేదని, అది తమ సంస్కృతి కాదని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. ఓ టీవీ చానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు విషయాలపై మాట్లాడిన ఆయన బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ హత్యకు కుట్ర జరుగుతోందన్న ఆరోపణలపై స్పందిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం తెస్తున్న అప్పులపై మాట్లాడుతూ వాటితో సంపద సృష్టి కూడా జరిగిందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని సూచించారు. కుటుంబ పెద్దలాంటి సీఎం కేసీఆర్.. ఎమ్మెల్యేలు, ఎంపీలను పద్ధతి మార్చుకోమంటే తప్పెలా అవుతుందని ప్రశ్నించారు. పనితీరే ఎజెండాగానే వచ్చే ఎన్నికల్లో ఓట్లేయమని అడుగుతామని స్పష్టం చేశారు. ఇంకా ఏమన్నారో ఆయన మాటల్లోనే..
హైదరాబాద్, జూన్ 27 (నమస్తే తెలంగాణ): ఈటల రాజేందర్ నాకు పెద్దన్న. రాజకీయంగా ఆయన వేరే పార్టీలో ఉండొచ్చు. ఆయననుచంపేందుకు సుపారీ ఇచ్చారనేది పూర్తిగా అవాస్తవం. ఇన్నేండ్ల బీఆర్ఎస్ రాజకీయంలో అలాంటి చిల్లర రాజకీయాలు, సుపారీ రాజకీయాలు, హత్యా రాజకీయాలు ఎప్పుడూ చేయలేదు. తొమ్మిదేండ్లు అధికారంలో ఉన్నాం. అది మా సంస్కృతి కాదు. అలాంటి ప్రమాదమే ఉంటే మేమే ఆయనకు పటిష్టమైన భద్రత కల్పిస్తాం. అవసరమైతే ఆయనకు సెక్యూరిటీ పెంచమని డీజీపీకి చెప్తాం. ఆ బాధ్యత కూడా నేనే తీసుకుం టా. ప్రజాక్షేత్రంలో ఈటల రాజేందర్ అయి నా, రేవంత్రెడ్డి అయినా ఎవర్నైనా ఎదుర్కొం టాం. ప్రజాక్షేత్రంలో ప్రజల మద్దతుతోనే వారిని ఓడిస్తాం. ఇలాంటి చిల్లర రాజకీయాలు చేయం.
రాష్ర్టానికి మంచి నాయకత్వం అందిస్తాం, జాతీయస్థాయిలో ప్రత్యామ్నాయంగా ఎదుగుతాం అని తొమ్మిదేండ్ల కిందట చెప్పాం. అదే చేస్తున్నాం. ఈ తొమ్మిదేండ్లలో అనేక మంది బీఆర్ఎస్లో చేరారు. ఇందులో తెలంగాణను వ్యతిరేకించినవాళ్లు కూడా ఉన్నారు. కాదనడం లేదు. అయితే ఇదే సమయంలో ఉద్యమకారులనూ కాపాడుకొన్నాం, వీళ్లను కాపాడుకున్నాం. టికెట్లు రాని ఒకరిద్దరు నేతలు వాళ్ల బాధను ప్రజల బాధ అని, వారి స్వీయ మానసిక ఆందోళనను ప్రజలదిగా చూపుతూ, గొంతు చించుకుంటున్నారు. ప్రజలకు ఏం కష్టం ఉన్నది? ఎర్రటి ఎండల్లో దుంకుతున్న మత్తళ్లు, చెరువుల నిండా మీన రాశులు, వెనక్కి వస్తున్న వలసలు, ఇంటింటికీ చేరుతున్న మంచినీళ్లు, టింగ్టింగ్మంటూ పడుతున్న రైతుబంధు, రైతుల ఖాతాల్లో చేరిన రూ.73వేల కోట్లు కనిపించడం లేదా? రాష్ర్టాలకు ఐఏఎస్ అధికారులను యూపీఎస్సీ కేటాయిస్తుందనే కనీస అవగాహన లేకుండా ‘బీహారీల రాజ్యం’ అంటూ విమర్శలు చేయడం సిగ్గుచేటు. 140 కోట్ల మంది ఉన్న దేశానికి ఇటలీ నుంచి వచ్చిన వ్యక్తిని అధ్యక్షురాలిని చేసిన పార్టీ కూడా మాకు చెప్తుందా? మేం ప్రజలను నమ్ముకొని రాజకీయం చేస్తాం. సీఎం కేసీఆర్ ఆదేశిస్తే.. నాకు రాజకీయంగా జన్మనిచ్చిన సిరిసిల్లలోనే ఈసారి కూడా పోటీ చేస్తా. సిరిసిల్ల ఎమ్మెల్యేగా ఉండటాన్ని గౌరవంగా భావిస్తా.
ఒక ప్రభుత్వం చేసే అప్పును భవిష్యత్తుపై పెట్టుబడిగా చూడాలి. తెచ్చిన డబ్బును దేనిమీద ఖర్చు పెట్టామన్నది ముఖ్యం. తెలంగాణ తీసుకున్న అప్పులో మిషన్ భగీరథకు రూ.40వేల కోట్లు, కాళేశ్వరం కోసం రూ.లక్ష కోట్లు, గొర్రెల పంపిణీకి రూ.11వేల కోట్లు, ఆరు గంటల కరెంటు ఇవ్వలేని స్థితి నుంచి 24 గంటల కరెంటు తీసుకొచ్చేందుకు రూ.81వేల కోట్లు, పాలమూరు-రంగారెడ్డి, మిషన్ కాకతీయ వంటివాటి కోసం మరికొంత ఖర్చు చేశాం. ఈ పెట్టుబడితో సంపద పునరుత్పత్తి అవుతున్నది. అందుకే తలసరి ఆదాయంలో నంబర్ వన్గా నిలిచాం. జీడీపీతో పోల్చితే అమెరికా అప్పు 116 శాతం, జపాన్ అప్పు 234 శాతం, ఫ్రాన్స్ అప్పు 116 శాతం, భారత్ అప్పు 60 శాతం ఉన్నాయి. తెలంగాణ అప్పు ఎఫ్ఆర్బీఎం పరిమితికి లోబడే 25 శాతంగా ఉన్నది. కెనడా తమ ఉద్యోగుల పెన్షన్ డబ్బును హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టులో పెట్టుబడిగా పెట్టింది. మన దేశంలో మాత్రం ఉద్యోగుల పెన్షన్ డబ్బు బ్యాంకుల్లో, ఎల్ఐసీలో కలిపి రూ.30 లక్షల కోట్లు మూలుగుతున్నది.
హైదరాబాద్ను విశ్వనగరంగా మార్చే ప్రణాళికలో దశలవారీగా ముందుకు వెళ్తున్నాం. భూతల స్వర్గంగా మార్చామని చెప్పడం లేదు కానీ దేశంలోనే బెస్ట్ సిటీగా మార్చాం. మర్సర్ సంస్థ 2015 నుంచి 2020 వరకు వరుసగా ఐదేండ్లపాటు దేశంలోనే అత్యుత్తమ పట్టణంగా హైదరాబాద్కు అవార్డు ఇచ్చింది. ఇటీవలే గ్రీన్ సిటీ అవార్డు రావడమే ఇందుకు నిదర్శనం. హైదరాబాద్ కన్నా మెరుగైన నగరం దేశంలో ఒక్కటి ఉన్నా చూపించాలి. ప్రజల సౌకర్యాల మెరుగుకు 150 డివిజన్లలో వార్డు ఆఫీసులు, బస్తీ దవాఖానలు, అన్నపూర్ణ సెంటర్లు ఏర్పాటు చేశాం. ఫ్లైవోవర్లు, అండర్పాస్లు కట్టి ట్రాఫిక్ రద్దీ తగ్గించాం. ప్రతి ఇంటికి మంచినీళ్లు, 24 గంటల కరెంటు అందుతున్నది. ఎఫ్ఎస్ఐ షరతులను 2005-06లో ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎత్తివేసింది. దాన్ని మేము కొనసాగిస్తున్నాం. భవిష్యత్తులో వచ్చే ట్రాఫిక్ కష్టాలు తీర్చేందుకు 70 కిలోమీటర్లు ఉన్న మెట్రోను 250 కిలోమీటర్లు పెంచాలని నిధుల కోసం ఢిల్లీ వెళ్తే రాజకీయాలు చేస్తున్నారు. హైదరాబాద్లో వరద నీటి కాల్వల కోసం మేం వెయ్యి కోట్లు పెట్టాం. మీరొక రూ.300 కోట్లు ఇవ్వమని అడిగాం. ప్రభుత్వంగా మేము ప్రజల కోసం అడిగాలి కదా. దానిపైనా రాజకీయం చేయడం మంచిదికాదు.
డబుల్ బెడ్రూం అనే కార్యక్రమం తెలంగాణలో గ్రాండ్ సక్సెస్ అయింది. ఈ దేశంలో పేదల కోసం కేసీఆర్ తప్ప.. డబుల్ బెడ్రూం కట్టిన మొగోడు ఎవ్వడు? ఎవరైనా ఉంటే చూపెట్టండి. ఇలాంటి ఆలోచన వచ్చినవారెవరైనా ఉన్నారా? ఇండ్లు కట్టడం అంటే పిట్టగూడు కట్టినట్టు కాదు. రెండు పడకగదులు, ఒక కిచెన్, ఒక హాలుతో ఇల్లు కట్టివ్వడం కేసీఆర్కే సాధ్యమైంది. కేంద్రం మొండిచేయి చూపడం, ఆర్థిక ఆంక్షలు పెట్టి, కరోనా రావడం వల్ల పేదలకు ఇండ్లు ఇవ్వడానికి కొంత ఆలస్యం కావొచ్చు. ఒక్క హైదరాబాద్లోనే లక్ష డబుల్ బెడ్రూం ఇండ్లు ఇస్తున్నాం. ఇట్లాంటి మంచిపనులు ఎన్నికల్లో ప్రచారం చేసుకుంటాం. ఇందులో తప్పేముంది? ఫ్లైవోవర్లు కట్టామని చెబితే తప్పా..? రాష్ట్ర ఆదాయం పెంచామని చెబితే తప్పా? ఉద్యోగాలు సృష్టించామని చెబితే తప్పా? మిగతా వాళ్లలా అది రద్దు చేస్తం.. ఇది బంద్ చేస్తాం అని చెప్పం. చేసిందే చెప్పుకుంటాం.
దళితులకు మేలు చేయాలనే ఉద్దేశంతో ఓ కొత్త కార్యక్రమాన్ని తీసుకొచ్చి దానికి బడ్జెట్లో నిధులు కేటాయించినప్పుడు మంత్రిగా ఈటల రాజేందర్ ఉన్నారు. అప్పుడు ఏ ఎన్నికలూ లేవు. దళితబంధు అనే పేరు తర్వాత పెట్టి ఉండొచ్చు కానీ.. దానికి డబ్బులు కేటాయించింది ఆయన మంత్రిగా, మా పక్కన ఉన్నప్పుడే. అమెరికాలో అఫర్మ్యాటివ్ యాక్షన్ ఉంది. అలాగే తెలంగాణలో దళితబంధు ఉంది. కిందిస్థాయి అణగారిన వర్గాల వారికి మేలు చేయాలనే తెచ్చిందే దళితబంధు. ఆ పథకంతో ఇప్పుడు సంపద సృష్టిస్తున్నారు. ఎల్లారెడ్డిపేట మండలం దుమాల గ్రామంలో రూ.30 లక్షలు ముగ్గురి లబ్ధిదారులకు ఇస్తే.. విజయలక్ష్మి ఇండస్ట్రీస్ అనే పేరు పెట్టి వారు మూడు కోట్లతో రైస్మిల్లు పెట్టారు. తొమ్మిది మంది 90 లక్షలతో పెట్రోల్ బంకు పెట్టుకున్నారు. ఇవన్నీ సంపద పునరుత్పత్తి సంకేతాలే. వాళ్లే ఇతర రాష్ర్టాల వారికి పని కల్పించి వారికి అన్నం పెట్టే స్థితికి వచ్చారు.
నా ట్విట్టర్ను నేనే హ్యాండిల్ చేస్తా. ఐటీ మినిస్టర్ ట్విట్టర్ను వేరేవాళ్లు చూస్తారు. రోజూ మూడు గంటలు చూస్తవు ఆ ట్విట్టర్ ఏముంది? అని మా ఆవిడ అప్పుడప్పుడు తిడుతుంటది. ట్విట్టర్ అలవాటుగా, వ్యవసంగా మారిపోయింది. మూడు నాలుగు గంటలు గడుపుతా.
మోదీ ఈ మధ్య ఫ్రీ బీస్ అని అంటున్నరు. కొవిడ్ తర్వాత మన దేశం పేదరికపు రాజధానిగా మారిపోయింది. పేదరికంలో నైజీరియాను దాటిపోయాం. మన సామాజిక కూర్పు వేరుగా ఉంటుంది. సామాజిక అసమతుల్యతతోనే అంతర్యుద్ధాలు, నక్సలిజానికి దారితీస్తున్నాయి. పేదవారికి పెన్షన్లు ఇస్తే, కడుపునిండా తిండిపెడితే తప్పు అన్నట్టు మోదీ ప్రచారం చేస్తున్నడు. సంపద పెంచాలి. పేదలకు పంచాలి అన్నది మా నినాదం. సంపదను పెంచకపోయినా కార్పొరేట్లకు పంచడం మోదీ నినాదం. 12. 5లక్షలకోట్లు మోదీ కార్పొరేట్ మిత్రులకివ్వడం మంచిదేనా? పేద బీద బిక్కి కాపాడాల్సిన బాధ్యత, వారి బట్ట పొట్ట చూడాల్సిన బాధ్యత ప్రభుత్వాలదే.
నిజాం షుగర్స్ను ప్రారంభిస్తామని అసెంబ్లీలోనే సీఎం కేసీఆర్ ప్రకటించారు. మహారాష్ట్రంలో సహకార వ్యవస్థలో చక్కర ఫ్యాక్టరీలు బ్రహ్మండంగా నడుస్తున్నాయి. వాటిపై అధ్యయనానికి పోచారం శ్రీనివాస్రెడ్డి గారి నేతృత్వంలో బృందాన్ని మహారాష్ట్రకు పంపించాం. మనం కూడా కో ఆపరేటివ్ విధానంలో నిజాం షుగర్స్ ఫ్యాక్టరీని నడుపుదామని. రూ. 250 -300 కోట్లు ఖర్చుపెడతాం. కో ఆపరేటివ్ విధానంలో నడుపుతామన్నం. అవసరమైతే అధ్యక్షుడిగా కాంగ్రెస్ నేత జీవన్రెడ్డినే అధ్యక్షుడిగా ఉండమన్నం. రైతులు ముందుకొస్తే తెరిచి నడిపిస్తాం.
నేను బయటికెళితే మాస్ మీటింగ్స్లో మాస్ రాజకీయనాయకుడిని. పారిశ్రామికవేత్తల వద్దకు వెళితే ఇండస్ట్రీ మంత్రిని. ఎస్ఎం కృష్ణలా, చంద్రబాబులా సీఈవో, తొక్కతోటకూర కాదు. నేను సాఫ్ట్వేరే కాదు.. నేనూ హార్డ్వేర్ని కూడా. నాయకుడిగా సబ్జెక్టు ఉండాలి. సీఎం కేసీఆర్తో మాట్లాడాలంటే అన్ని కరెక్టుగా ఉంటేనే ఆయనతో మాట్లాడగలం. అందుకే మేం ప్రిపేరవుతాం. లీడర్గా, బాస్గా కేసీఆర్కు అన్ని విషయాలపై సమగ్ర అవగాహన ఉంటుంది. కేసీఆర్ గారి కింద పనిచేయాలంటే మనం కూడా ఆయనలా పరిశ్రమించాలి. మరో ఛాయిస్ లేదు.
కేసీఆర్ గారితో గంట సేపు కూర్చుంటే ఏ నదిలో ఎన్ని టీఎంసీలు, ఏ పవర్ స్టేషన్లో ఎన్ని మెగావాట్లు జనరేట్ అవుతుంది. వాగులు వంకలు డొంకలు వైశాల్యం అన్నీ గణాంకాల ఎన్సైక్లోపీడియా. ఆయనలో కనీసం 10శాతం అవగాహన లేకపోతే
తేలిపోతాం.
మా పనితీరే మా ఎజెండా. వందకు వందశాతం మా ఫెర్ఫార్మెన్సే మా ఎజెండా. దీంట్లో డౌటే లేదు. ఏ వర్గానికి లాభం చేశామో వాళ్లనే ఓట్లడుగుతాం. ఆసరా పెన్షన్లు.. రైతుభీమా.. రైతుబంధు. కేసీఆర్ కిట్లు.. కళ్యాణలక్ష్మి చెక్కులు తీసుకున్నవాళ్లు, ఇంటింటికీ నీళ్లు తాగినవాళ్లు.. కడుపునిండా కరెంట్ను ఆస్వాదించినవాళ్లను ఓట్లడుగుతాం. మిగతావాళ్లను ఓట్లేయవద్దంటాం. కాంగ్రెస్, బీజేపీ నాయకులు సైతం లబ్ధిదారులే కాబట్టి వారు కూడా మాకే ఓట్లేయాల్సి వస్తుంది. తెలంగాణ రాకూడదని కోరుకున్నోళ్లు. సమైక్యాంధ్ర అని గావుకేకలుపెట్టినోళ్లు, తెలంగాణ అడ్డంగాదు.. పొడుగుకాదని మాట్లాడినోళ్లు ఇవాళ్ల తెలంగాణలో ఓట్లడగడమే దరిద్రం. కేఏ పాల్ పాపం తెలంగాణను వద్దనలేదు. షర్మిల తెలంగాణ వద్దని గావుకేకలు పెట్టిన వ్యక్తి. ఆమె వచ్చి తెలంగాణలో ఓట్లడుగుడేంది. ఎవరైతే తెలంగాణ వద్దన్నరో, రాష్ట్రం రాకూడదని గావుకేకలు పెట్టారో వారు తెలంగాణలో ఓట్లు అడగొచ్చునా. మేం ఏపీ బాగుపడాలనే కోరుకున్నాం. విభజన వికాసం కోసమే అని చెప్పాం. రాష్ర్టాలుగా విడిపోదాం.. ప్రజలుగా కలిసుందామని చెప్పాం. మేం మారలేదు. మా విధానం మారలేదు. అందుకే బీఆర్ఎస్గా ఏపీలోను విస్తరిస్తాం. మహారాష్ట్ర గ్రామాల ప్రజలు మమ్మల్ని తెలంగాణలో కలుపుకొమ్మని అడుగుతున్నారు. మంచి నాయకుడు ఉంటే ప్రజలు ఆదరిస్తారు. కేసీఆర్ గారిని మహారాష్ట్ర ప్రజలు ఒప్పుకుంటారో లేదు 2024లో చూద్దాం
అభివృద్ధిలో పోటీపడుదాం. మేం ఒక్క మంచిపనిచేస్తే.. మీరు రెండు మంచి పనులు చేయండి. ఈ పరస్పర దూషణలు, వ్యక్తిత్వ హననాలు. వ్యక్తిగత దూషణలు సరికాదు. కేసీఆర్ వయసెంత.. రేవంత్రెడ్డి, బండి సంజయ్ల వయసెంత? కేసీఆర్ 70 ఏండ్ల నాయకుడు. తెలంగాణ కోసం 14 ఏండ్లు కష్టపడి 23 ఏండ్లుగా అగ్రగామిగా ఉన్న నాయకుడు. నోటికొచ్చిన బూతులు. ఎట్ల పడితే అట్ల మాట్లాడుడు. కేసీఆర్ను ఎంత ఎక్కువ తిడితే అంత గొప్ప అనే ధోరణి మంచిదికాదు. కేసీఆర్ కంటే ఎక్కువగా తెలంగాణను ప్రేమించడం నేర్చుకోండి. కేసీఆర్ కంటే నాలుగు పనులు ఎక్కువ చేస్తామని చెప్పండి.
పవన్కల్యాణ్, లోకేశ్తో మంచి ఫ్రెండ్షిప్ ఉంది. జగనన్న కూడా ఫ్రెండే. అందరూ ఫ్రెండ్సే. ఎవరి రాజకీయం వారిది. అసెంబ్లీ పక్కనపెడితే పార్లమెంట్కు వచ్చేసరికి ఏపీలో 25 సీట్లుంటే అంతా బీజేపీతోనే ఉన్నరు. బీజేపీని వ్యతిరేకించే గొంతు బీఆర్ఎస్సు. కేసీఆర్ అని ప్రజలనుకుంటే ఏపీ ప్రయోజనాలు కాపాడే గొంతు అనుకుంటే ఏమైనా జరగొచ్చు. మేం జాతీయ పార్టీగా కేంద్రంలో కీలకమైన పాత్రను పోషించాలనుకుంటున్నం. బీజేపీని ఎదుర్కొనే క్రమంలో మోదీ ముక్కు పిండి హక్కులు సాధించే నాయకుడు కేసీఆర్. ఏపీ ప్రజలు అనుకుంటే ఏమైనా జరగొచ్చు. రేపటి దానికి రూపం లేదు. ప్రజలు కేసీఆర్ లాంటి ఫైటర్ను కచ్చితంగా ఆదరిస్తరు. లాలూచీ, కుమ్మక్కు, చిల్లర రాజకీయాలు మేం చేయం. కొట్లాడినన్ని రోజులు కొట్లాడుతం.
నా ఆస్తులు రూ. 7కోట్ల నుంచి రూ. 41కోట్లకు ఎలా పెరిగాయని అడుగుతున్నరు. నా అప్పుల సంగతేంటి. నా ఆఫిడవిట్లో రూ. 27కోట్ల అప్పులున్నాయి. ఈ రాష్ట్రంలో ఎవరి ఆదాయం పెరగలేదు చెప్పండి. గోడలకు సున్నాలేసుకునేటోళ్లు జూబ్లీహిల్స్లో ఫ్లాట్స్ కొనొచ్చా?
ఎమ్మెల్యేలు, ఎంపీలు ప్రజల విశ్వాసం కోల్పోతే, పద్ధతి మార్చుకోకపోతే పక్కన పెడతామని కేసీఆర్ హెచ్చరించారు ఇందులో తప్పేంది. ఇంట్లో కుటుంబసభ్యులు తప్పు చేస్తే పెద్ద హెచ్చరించరా? 65 లక్షల బీఆర్ఎస్ కుటుంబ సభ్యులకు ఆయన పెద్ద. తప్పుచేస్తే ఎవరైనా మందలిస్తారు కదా. ప్రజల్లో పరపతిపోతే, పలుకుబడి తగ్గితే వచ్చే ఎన్నికల్లో వేటు తప్పదేమో. ముందస్తుగానే అభ్యర్థుల జాబితాను విడుదల చేస్తాం. అందర్నీ సంతృప్తి పరచలేం. ఇతర పార్టీల నుంచి వచ్చే వారుంటారు. ఇక్కడ్నుంచి పోయే వారుంటారు. ఆధారాలతో సహా ఎవరైనా దొరికితే పార్టీ కచ్చితంగా చర్యలు తీసుకుంటుంది.
గవర్నర్ వ్యవస్థ ఛండాలంగా, దరిద్రంగా తయారైంది. రాష్ట్ర ప్రభుత్వం ఎడ్డం అంటే తెడ్డం అనాలి. కేంద్రం ఎట్ల చెబితే అట్ల తలూపాలె. దిగజారుడు రాజకీయం. రాష్ట్రప్రభుత్వం ఒక చట్టంచేస్తే సంతకం చేయకుండా వేలాది మంది విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడుడేంది. ఆపింది గవర్నర్ గారు కాదా. పిల్లలను రెచ్చగొట్టింది బీజేపీ నేతలు కాదా. బిల్లు వచ్చి 9 నెలలైంది. సంతకం పెట్టదిని గవర్నర్ కాదా? బిల్లు చట్టసభలో పాసైన తర్వాత గవర్నర్ను అడ్డంపెట్టుకుని మోదీ బిల్లులాపిండు. ఎవరైనా పిల్లలతో ఆటలాడుతారా. గవర్నర్ గారికి ఆ పిల్లలపై ప్రేమ ఉందా. గవర్నర్ గారికి, బీజేపీ నాయకులకు ఉండాలి కదా.
నేను జీవితంలో ఎమ్మెల్యేఅవుతానని, మంత్రి అవుతానని అనుకోలేదు. తెలంగాణ వస్తే చాలు అనుకున్నా. మనిషికి ఆశ ఉండాలి. కానీ దురాశ ఉండకూడదు. బాధ్యతను చూసి భయపడను. సీఎం కావాలి. ప్రధానమంత్రి కావాలన్న ఎజెండాలు అసలే లేవు. నేను ఎక్కడ ఉన్నానో అక్కడ సంతోషంగా ఉన్న. ఒక్కటి మాత్రం పక్కా. స్వీయరాజకీయ ఆస్తిత్వమే రాష్ర్టానికి శ్రీరామరక్ష. మన ఆత్మగౌరవాన్ని ఢిల్లీకి తాకట్టుబెట్టే కాంగ్రెస్, బీజేపీ దుగుల్బాజీలు ఈ రాష్ర్టానికి పనికిరారు. కేసీఆర్ గారు మాత్రమే రాష్ట్ర ప్రయోజనాలు కాపాడారు. ఆయన నాయకత్వంలో పనిచేయడం కన్నా మరో అదృష్టం ఉండదు. కాబట్టి ఆయనే మా లీడర్. ఆయనే మా భవిష్యత్తు. ఆయనే మా ముఖ్యమంత్రి.
రెండు సంవత్సరాల పాటు 50వేల వరకు రుణమాఫీ చేశాం. రెండేండ్ల పాటు కొవిడ్ వల్ల లక్ష కోట్లు నష్టపోయాం. కాబట్టి రైతురుణ మాఫీ విషయంలో కొంత జాప్యం జరిగిన మాట వాస్తవం. కానీ రూ. 75 వేలకోట్లు 70లక్షల రైతుల ఖాతాల్లో రైతుబంధు రూపంలో జమ చేసిన మాట వాస్తవం కాదా. ఇలా ఈ దేశంలో ఎవరైనా జమచేశారా? రుణమాఫీ కన్నా రైతు బంధు రూపంలో డబ్బుల రాలేదా? రుణమాఫీ చేసేందుకు పరిష్కారాలు వెతుకుతున్నాం. లక్ష కోట్టు నష్టపోయిన రాష్ట్రం 75వేల కోట్లు జమచేసిన విషయాన్ని ఎట్లా మరిచిపోతరు. రుణమాఫీ చేయలేదని ఎట్లా అడుగుతరు. రైతులు అమాయకులేం కాదు. ఉచిత కరెంటు, రైతుబంధు, రైతుబీమాను అందించిన కేసీఆర్ను రైతులు తప్పకుండా కడుపుల పెట్టుకుంటరు.