హైదరాబాద్, మే 21 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో పెట్టుబడులు పెట్టి స్థానిక యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడం ద్వారా రాష్ర్టాభివృద్ధిలో భాగస్వాములు కావాలని పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావు లండన్లోని ప్రవాసభారతీయులకు విజ్ఞప్తి చేశారు. తెలంగాణ ఉద్యమం సందర్భంగా ప్రవాస భారతీయులు అందించిన సహకారం మరువలేనిదని, వారు ఏ దేశంలో ఉన్నా తెలంగాణ అభివృద్ధికి ఎప్పుడూ సహకారం అందిస్తున్నారన్నారు. యూకే పర్యటనలో భాగంగా శనివారం మంత్రి కేటీఆర్ లండన్లో ప్రవాస భారతీయులు ఏర్పాటుచేసిన మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. ఎనిమిదేండ్లలో రాష్ట్రం సాధించిన ప్రగతిని వివరించారు. యూకేలో తమ బృందం నిర్వహిస్తున్న అధికారిక పర్యటన సందర్భంగా ఆయా కంపెనీల అధిపతులు, ప్రముఖులతో జరిపిన చర్చలు ఫలప్రదమయ్యాయని చెప్పారు. మరిన్ని పెట్టుబడులు సాధించడం ద్వారా తెలంగాణను ప్రగతిబాటన నడిపించడంతోపాటు స్థానికులకు ఉద్యోగావకాశాలు కల్పించడం తన బాధ్యత అని కేటీఆర్ తెలిపారు. రానున్న రోజుల్లో యూకే తో తెలంగాణ సంబంధాలు బలపడతాయని పేర్కొన్నారు.
టైర్-2 నగరాల్లో పెట్టుబడులు పెట్టండి
తెలంగాణలో కంపెనీ ఏర్పాటు చేయాలనుకొనేవారు హైదరాబాద్ కాకుండా ద్వితీయ శ్రేణి నగరాల (టైర్-2 సిటీస్)ను పరిశీలించాలని మంత్రి కేటీఆర్ సూచించారు. రాష్ట్రంలో సంపద, ఉద్యోగావకాశాల సృష్టి కోసం ప్రభుత్వం చేస్తున్న కృషికి సహకరించడం ద్వారా మాతృభూమికి తమవంతు సేవచేయాలని కోరారు. వరంగల్లో ఇప్పటికే ఐటీ రంగం శరవేగంగా అభివృద్ధి చెందుతున్నదని, ఖమ్మం, కరీంనగర్లలో కూడా ఐటీ టవర్లను ప్రారంభించామని చెప్పారు. త్వరలో మహబూబ్నగర్, నిజామాబాద్లో కూడా ఐటీ టవర్లను ప్రారంభిస్తామని తెలిపారు. లక్ష ఎకరాలకు సాగునీటిని అందించే కాళేశ్వరం ఎత్తిపోతలను నాలుగేండ్ల కన్నా తక్కువ సమయంలో నిర్మించినట్టు గుర్తుచేశారు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు అని, మన దేశంలో ఇలాంటి ప్రాజెక్టు ఉండటం భారతీయులంతా గర్వించదగ్గ విషయమని తెలిపారు. అమెజాన్ సంస్థ ప్రపంచంలోనే అతిపెద్ద క్యాంపస్ను హైదరాబాద్లో ఏర్పాటుచేసిందని, గడచిన ఆరేండ్లలో గూగుల్, ఫేస్బుక్, మైక్రాన్, యాపిల్, క్వాల్కామ్, ఉబెర్, సేల్స్ఫోర్స్, నోవార్టీస్ తదితర ప్రఖ్యాతిగాంచిన సంస్థలు తమ రెండవ అతిపెద్ద కార్యాలయాలకు హైదరాబాద్ను వేదికగా చేసుకొన్నాయని గుర్తుచేశారు.
దేశాన్ని ఆర్థికంగా ఆదుకొంటున్న నాలుగో రాష్ట్రం
2014లో నుంచి ఇప్పటివరకు తెలంగాణ తలసరి ఆదా యం రూ.1,24,000 నుంచి రూ.2,78,000కు చేరుకొన్నదని మంత్రి కేటీఆర్ చెప్పారు. 2014లో జీఎస్డీపీ రూ.5.6 లక్షల కోట్లు కాగా, నేడు రూ.11.54 లక్షల కోట్లకు చేరిందని చెప్పారు. తెలంగాణ భౌగోళికంగా దేశంలో 11వ అతిపెద్ద రాష్ట్రం కాగా, జనాభా పరంగా 12వ అతిపెద్ద రాష్ట్రమని, అయినప్పటికీ దేశ ఆర్థికాభివృద్ధికి సహకరిస్తున్న రాష్ర్టాల్లో తెలంగాణ నాలుగో స్థానంలో ఉందన్నారు.
మేడారం డాక్యుమెంటరీ పోస్టర్ ఆవిష్కరణ
లండన్లో శనివారం ‘మీట్ అండ్ గ్రీట్ విత్ కేటీఆర్’ కార్యక్రమంలో మేడారం జాతరపై రూపొందించిన డాక్యుమెంటరీ ఫిల్మ్ పోస్టర్ను మంత్రి కేటీఆర్ ఆవిష్కరించారు. తెలంగాణ భాష, సాంస్కృతిక శాఖ సహకారంతో యూకేలో ఉంటున్న ఫిల్మ్ మేకర్ ఆనంద్ కోర్వ ఈ ఏడాది తెలంగాణకు వచ్చి మేడారంపై డాక్యుమెంటరీని రూపొందించారు. వచ్చే నెలలో ఈ డాక్యుమెంటరీ విడుదల కానున్నది. దీనిని చిత్రీకరించిన ఆనంద్ను అభినందించారు. తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ, తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ యునైటెడ్ కింగ్డమ్ (టీఏయూకే) సహకారంతో లండన్లో అతి త్వరలోనే మేడారం జాతరకు ఫొటో ఎగ్జిబిషన్ సైతం నిర్వహిస్తున్నామన్నారు. టీఏయూకే వ్యవస్థాపకుడు అనిల్, అధ్యక్షుడు రత్నాకర్, సురేందర్రెడ్డి, అశోక్ తదితరులు పాల్గొన్నారు.
రాష్ర్టానికి అరైవల్ ఎలక్ట్రిక్ బస్సులు: మంత్రి కేటీఆర్
రాష్ట్రంలో త్వరలో బ్రిటన్కు చెందిన అరైవల్ ఎలక్ట్రిక్ బస్సులు తిరగనున్నాయి. యూరప్ పర్యటనలో ఉన్న మంత్రి కేటీఆర్ శనివారం బాన్బరీలోని అరైవల్ యూకే లిమిటెడ్ సంస్థను సందర్శించారు. ఈ సంస్థ అత్యాధునిక ఎలక్ట్రిక్ బస్సులు, వ్యాన్ల వంటి వాణిజ్య వాహనాలను తయారుచేస్తున్నది. అరైవల్ యూకే లిమిటెడ్ తెలంగాణతోపాటు భారతదేశంలోని వివిధ ప్రాంతాల్లో తమ ఎలక్ట్రిక్ వాహనాల వ్యాపారాన్ని విస్తరించేందుకు అలాక్స్ రిసోర్సెస్ ఎల్ఎల్పీతో ఒప్పందం చేసుకొన్నది. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ హైదరాబాద్లో మెట్రో లాస్ట్ మైల్ కనెక్టివిటీ, అంబులెన్స్ సర్వీసులతోపాటు సుదూర ప్రాంత బస్సు సర్వీసుల కోసం అరైవల్ ఎలక్ట్రిక్ వాహనాలను ప్రవేశపెట్టే అంశంపై సంస్థ ప్రతినిధులతో చర్చించారు. ఈవీ విధానా న్ని తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్నదని పేర్కొంటూ బస్సుల ప్రిఫరెన్షియల్ మార్కెట్ యాక్సెస్ కోసం అవసరమైన మద్దతు లేఖను అరైవల్ ప్రతినిధులకు అందజేశారు.
టీఆర్ఎస్ ఎన్నారై యూకే అధ్యక్షుడి ఇంటికి కేటీఆర్
లండన్లోని టీఆర్ఎస్ ఎన్నారై యూకే శాఖ అధ్యక్షుడు అనిల్ కూర్మాచలంను మంత్రి కేటీఆర్ అభినందించారు. యూకే పర్యటనలో భాగంగా శనివారం ఆయన లండన్లోని అనిల్ ఇంటికి వెళ్లారు. అనిల్ కుటుంబం మంత్రి కేటీఆర్ను సాదరంగా ఆహ్వానించింది. తెలంగాణ బతుకమ్మ గురించిన వివరాలతో అనిల్ కూతురు నిత్య క్వీన్ ఎలిజబెత్కు లేఖ రాయ గా, క్వీన్ నుంచి నిత్యకు అభినందనలు వచ్చిన విషయాన్ని మంత్రికి తెలిపారు.