హైదరాబాద్: ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి ఇంటిపై దాడిని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) తీవ్రంగా ఖండించారు. పట్టపగలే ఎమ్మెల్యేపై హత్యాయత్నామా అని ప్రశ్నించారు. మన రాష్ట్రం ఎటు పోతున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. ఫ్యాక్షన్, రౌడీ రాజకీయాలకు తెలంగాణను అడ్డాగా మార్చేస్తుంటే బాధగా ఉందన్నారు. కౌశిక్ రెడ్డిని గృహ నిర్భంధంలో ఉంచి అరికెపూడి గాంధీ గూండాలతో దాడి చేయిస్తారా అని ప్రశ్నించారు. ఇందిరమ్మ రాజ్యం అంటే ఎమ్మెల్యేలకు కూడా రక్షణ లేకపోవడమేనా అని నిలదీశారు.
పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై న్యాయపరంగా పోరాడుతున్నందునే కౌశిక్ రెడ్డిని టార్గెట్ చేశారన్నారు. ఇది కచ్చితంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేయించిన దాడేనని ఆరోపించారు. దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. ఇలాంటి ఉడుత ఊపుల దాడులకు బెదిరేది లేదని స్పష్టం చేశారు. ఇంతకు మించిన ప్రతిఘటన తప్పదంటూ కేటీఆర్ హెచ్చరించారు.