హైదరాబాద్: బీఆర్ఎస్ను 100 మీటర్ల లోపల బొంద పెడ్తానన్న సీఎం రేవంత్ రెడ్డిపై పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) విరుచుకుపడ్డారు. తెలంగాణ తెచ్చినందుకా.. తెలంగాణను అభివృద్ధి చేసినందుకా లేక మిమ్మల్ని, మీ దొంగ హమీలను ప్రశ్నిస్తున్నందుకా అని నిలదీశారు. 100 మీటర్ల లోపల బీఆర్ఎస్ను బొంద పెట్టే సంగతి తర్వాత చూసుకుందాం కానీ, వంద రోజుల్లో నెరవేరుస్తామన్న హామీల సంగతేంటి రేవంత్ రెడ్డి అని ప్రశ్నించారు. హైదరాబాద్, సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాల సన్నాహక సమావేశంలో కేటీఆర్ ప్రసంగించారు. రేవంత్ రెడ్డి లాంటి అహంకార నాయకులను టీఆర్ఎస్ పార్టీ తన ప్రస్థానంలో చాలామందిని చూసిందని వెల్లడించారు. మఖలో పుట్టి పుబ్బలో పోయే పార్టీ అని మీలాంటోళ్లు చాలామంది నీలిగిన్రు. అయినా రెండున్నర దశాబ్దాల పాటు నిలబడి, నీలాంటి వాళ్లను మట్టికరిపించిందన్నారు.
‘పార్లమెంట్ ఎన్నికల తర్వాత కాంగ్రెస్, బీజేపీలు కలిసిపోతాయి. రేవంత్.. కాంగ్రెస్ పార్టీలో ఏక్ నాథ్ షిండేగా మారుతాడు. రేవంత్ రక్తం అంత బీజేపీదే. ఇక్కడ చోటా మోదీగా రేవంత్ రెడ్డి మారిండు. గతంలో అదానీ గురించి అడ్డగోలుగా మాట్లాడిన రేవంత్ రెడ్డి.. ఈరోజు అదానీ కోసం వెంటపడుతున్నాడు. స్విట్జర్లాండ్లో రేవంత్ రెడ్డి అదానీతో అలైబలై చేసుకున్నాడు. అదానీ-రేవంత్ రెడ్డి ఒప్పందాల అసలు లొగుట్టు బయటపెట్టాలి. రాహుల్ గాంధీ ఏమో అదానీ గురించి వ్యతిరేకంగా మాట్లాడితే.. ఈ రోజు రేవంత్ రెడ్డి అదానీ కోసం అర్రులు చేస్తున్నాడు. డబుల్ ఇంజన్ అంటే అదానీ, ప్రధాని అని వ్యాఖ్యానించిన రేవంత్.. ఇప్పుడు ట్రిపుల్ ఇంజన్గా మారిండు.
ఈ జనవరి నెల కరెంటు బిల్లులు ప్రజలు ఎవరూ కట్టవద్దు. ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఉచిత విద్యుత్ పథకం గృహజ్యోతి హామీని నెరవేర్చే దాకా బిల్లులు కట్టొద్దు. స్వయంగా ముఖ్యమంత్రి.. కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్పినట్లుగానే ఉచిత విద్యుత్ కోసం డిమాండ్ చేయాలి. కరెంటు బిల్లులు అడిగితే అధికారులకు ముఖ్యమంత్రి మాటలను చూపించాలి. సోనియా గాంధీ బిల్లు కడుతుందని ముఖ్యమంత్రి ఎన్నికల అప్పుడు చెప్పిండు. కరెంటు బిల్లు ప్రతులను సోనియా గాంధీ ఇంటికి, , 10 జన్పథ్కు పంపించాలి. హైదరాబాద్ నగరంలో ఉన్న ప్రతి ఒక్క మీటర్కి గృహజ్యోతి పథకం కింద ఉచిత విద్యుత్ అందించాలి. గృహ జ్యోతి కార్యక్రమాన్ని వెంటనే అమలు చేయాలి.. ఇందులో కిరాయి ఇండ్లలో ఉండే వాళ్లకు కూడా ఉచిత విద్యుత్ ఇవ్వాలి. మహాలక్ష్మి కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్క మహిళకు రూ.2500 వెంటనే ఇవ్వాలి. ఇచ్చిన హామీలను తప్పించుకోవడానికి కాంగ్రెస్ చూస్తే వదిలిపెట్టే పరిస్థితి లేదు. బీజేపీతో బీఆర్ఎస్కు ఏరోజు పొత్తు లేదు.. భవిష్యత్తులోనూ ఉండదు.
కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి సికింద్రాబాద్కు గత ఐదేండ్లలో ఏం చేసిండో చెప్పాలి. కేసీఆర్ ప్రపంచంలోనే అతిపెద్ది లిప్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కడితే, కిషన్ రెడ్డి సీతాఫల్ మండి రైల్వే స్టేషన్లో లిఫ్ట్లను జాతికి అకింతం చేశారు. ఇదే అయన చేసిన అతిపెద్ద పని. బీఆర్ఎస్ కేసీఆర్ ఆధ్వర్యంలో 36 ఫ్లైఓర్లు కడితే.. ఉప్పల్, అంబర్పేట ఫ్లైఓవర్లు సంవత్సరాలైనా కట్టలేక చేతులెత్తెశారు.
రాష్ట్రంలో బీజేపీని అడ్డుకున్నది ముమ్మాటికి బీఆర్ఎస్ పార్టీనే. బీఆర్ఎస్ వల్లే బీజేపీ సీనియర్ నాయకులు హైదరాబాద్లోని పలు నియోజకవర్గాల్లో పోటీకి వెనుకంజ వేశారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కేవలం ఒక స్పీడ్ బ్రేకర్ మాత్రమే అని గుర్తుంచుకోవాలి. ఓడినా గెలిచినా బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడూ ప్రజాపక్షమే. కేవలం 50 రోజుల కాంగ్రెస్ పాలనలో ఆటో డ్రైవర్ల నుంచి మొదలుకొని అనేకమంది ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వచ్చింది. రైతన్నలకు రైతుబంధు అందడం లేదు. మహిళలకు వాగ్దానం చేసిన రూ.2500 రావడం లేదు. ఇచ్చిన హామీలు ఏవీ నెరవేర్చకుండా కాంగ్రెస్ పార్టీ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నది. కాంగ్రెస్ ఇచ్చింది ఆరు గ్యారెంటీలు కాదు 420 హామీలు అని ప్రజలు గుర్తుంచుకోవాలి. వివిధ డిక్లరేషన్ల పేరుతో ఇచ్చిన ప్రతి ఒక్క హామీని కాంగ్రెస్ పార్టీ అమలు చేసేదాకా వెంటాడుతాం’ అని కేటీఆర్ అన్నారు.
సికింద్రాబాద్, హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాల సన్నాహక సమావేశంలో ప్రసంగించిన బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS
– 100 మీటర్ల లోపల పార్టీని బొంద పెట్టే సంగతి తర్వాత చూసుకుందాం కానీ వంద రోజుల్లో నెరవెరుస్తామన్న హామీలను అమలు చేసే అంశంపైన దృష్టి పెట్టు రేవంత్ రెడ్డి
— BRS Party (@BRSparty) January 20, 2024