KTR | దద్దమ్మ పాలనలో తెలంగాణ రాష్ట్రం ధర్నాలతో దద్దరిల్లుతున్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. దిక్కుమాలిన పాలనలో జీవితాలు దిక్కుమొక్కు లేకుండా పోయాయని విమర్శించారు. రాష్ట్రంలో వివిధ సమస్యలపై బెటాలియన్ కానిస్టేబుల్ కుటుంబసభ్యుల ధర్నాలు, రైతులు, గురుకుల టీచర్ అభ్యర్థులు చేస్తున్న ఆందోళనలపై కేటీఆర్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఆయా ధర్నాలకు సంబంధించిన ఆర్టికల్స్ స్క్రీన్షాట్స్ను పోస్టు చేస్తూ.. కాంగ్రెస్ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు.
అలంపూర్ నుంచి మొదలు పెడితే ఆదిలాబాద్ వరకు.. గ్రామ సచివాలయం నుంచి మొదలు రాష్ట్ర సచివాలయం వరకు.. రైతు నుంచి మొదలు రైస్ మిల్లర్ల వరకు.. కార్మికుని నుంచి మొదలు కాంట్రాక్టర్ల వరకు.. టీచర్ల నుంచి మొదలు పోలీస్ కుటుంబాల వరకు.. అవ్వతాతల నుంచి మొదలు ఆడబిడ్డల వరకు.. విద్యార్థుల నుంచి మొదలు విద్యావంతుల వరకు.. నిరుద్యోగులు మొదలు ఉద్యోగుల వరకు.. కాంగ్రెస్ ప్రజాపతినిధుల నుంచి మొదలు ప్రతిపక్ష నాయకుల వరకు.. ఒక్కరా ఇద్దరా ముగ్గురా మూలకున్న ముసలవ్వ మొదలు బడిపిల్లల దాక ధర్నాలు, నిరసనలు చేస్తున్నారని కేటీఆర్ తెలిపారు. అడా ఇడా అంతటా ‘ వద్దురా నాయన కాంగ్రెస్ పాలన’ అనే ఒక్కటే స్లోగన్ నడుస్తుందని ఎద్దేవా చేశారు. ముందు దగా-వెనక దగా, కుడి ఎడమల దగా.. దగా అని విమర్శించారు. కాంగ్రెస్ వచ్చింది-కష్టాలు తెచ్చింది అని వ్యాఖ్యానించారు