హైదరాబాద్, జూలై 16 (నమస్తే తెలంగాణ): కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వంపై ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్ మరోసారి మండిపడ్డారు. ఈ నెల 18వ తేదీ నుంచి జరిగే పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో లోక్సభ, రాజ్యసభలో ఎంపీలు కొన్ని పదాలను వాడకూడదని లోక్సభ సెక్రటేరియట్ ఓ బుక్లెట్ విడుదల చేసింది. అందులో జుమ్లా జీవి, కొవిడ్ స్ప్రెడర్, అవినీతి పరుడు, అసమర్థుడు, శకుని వంటి పదాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీ నేతలు ఇన్ని రోజుల వాడిన భాషను గుర్తుచేస్తూ, మీ ఎన్పీఏ (నాన్ పెర్ఫార్మింగ్ అసెట్) గవర్నమెంట్ పార్లమెంటరీ భాష ఇదేనా? అని ప్రశ్నించారు. ‘ప్రధాని నరేంద్ర మోదీ నిరసనకారులను ‘ఆందోళన్ జీవి’ అని పిలవడం మంచిదేనా? గోలీ మారో అని మీ మంత్రి వ్యాఖ్యానించడం, యూపీ సీఎం చేసిన ‘80-20’ సరైనవేనా? మహాత్మాగాంధీని బీజేపీ ఎంపీ కించపరిచిన తీరు కరెక్టేనా? ఆందోళన చేస్తున్న రైతులను ఉగ్రవాదులు అని అవమానించటం సంగతేంటి?’ అని కేంద్ర ప్రభుత్వానికి, ప్రధాని నరేంద్రమోదీకి చురకలు అంటిచారు.