హైదరాబాద్, ఫిబ్రవరి 22 (నమస్తే తెలంగాణ): ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్ద జరిగిన ప్రమాదానికి సీఎం రేవంత్రెడ్డి పూర్తి బాధ్యత వహించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. సుంకిశాలలో రిటైనింగ్ వాల్ కుప్పకూలిన ఘటన మరువకముందే రాష్ట్రంలో మరో దుర్ఘటన జరగడం కాంగ్రెస్ సరారు వైఫల్యానికి నిదర్శమని పేర్కొన్నారు.
‘కాంట్రాక్టర్లతో కుమ్మక్కై కమీషన్ల వేటలో పర్యవేక్షణ గాలికొదిలేయడం, నాణ్యతా ప్రమాణాల విషయంలో పూర్తిగా రాజీపడటం వల్లే ఇలాంటి వరుస ఘటనలు జరుగుతున్నాయి. పైకప్పు కూలిన ఈ ఘటనలో లోపల చికుకున్నవారిని క్షేమంగా బయటకు తీసుకువచ్చేందుకు యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టాలి. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలి.
ఇలాంటి దుర్ఘటనలు భవిష్యత్తులో జరగకుండా ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కమీషన్లకు కకుర్తి పడకుండా నిబంధనల మేరకు పనులు జరిగేలా చూడాలి. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా ఒక బ్యారేజీలో కేవలం పిల్లర్ కుంగితే నానా హంగామా చేసిన కాంగ్రెస్ నేతలు తమ ప్రభుత్వ హయాంలో జరుగుతున్న ఈ వరుస వైఫల్యాలపై ఏం సమాధానం చెప్తారు. సుంకిశాల ప్రమాదంలో కాంట్రాక్టర్ను కాపాడేందుకు వాస్తవాలు దాచిపెట్టిన ప్రభుత్వం, కనీసం ఎస్ఎల్బీసీ సంఘటనపై అయినా పారదర్శకంగా దర్యాప్తు జరిపి, ప్రమాదానికి గల కారణాలను బయటపెట్టాలి’ అని డిమాండ్ చేశారు.