హైదరాబాద్, నవంబర్ 11 (నమస్తే తెలంగాణ): ప్రజలు గాలి మాటలు నమ్మరని, గట్టిచేతలనే విశ్వసిస్తారని మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ పేర్కొన్నారు. తెలంగాణకు కేసీఆరే గ్యారెంటీ సీఎం అని ప్రజలు స్పష్టమైన అవగాహన, నిర్ణయంతో ఉన్నారని చెప్పారు. ఎవరెన్ని కుట్రలు చేసినా కేసీఆర్ మూడోసారి సీఎం కావడాన్ని ఎవరూ ఆపలేరని స్పష్టంచేశారు. శనివారం తెలంగాణభవన్లో ఆయ న మాట్లాడుతూ.. మూర్ఖుడి చేతిలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నిండా మునుగుడు ఖాయమని, రేవంత్రెడ్డి పిచ్చిమాటలకు ప్రజలు ఈసడించుకుంటున్నారని తెలిపారు.
కాంగ్రెస్ నేతల గాలి ప్రచారం, స్థాయిని మరిచి చేస్తున్న వ్యక్తగత ఆరోపణలపై ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని చెప్పారు. సీఎం కేసీఆర్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలే తమకు శ్రీరామరక్ష అని ప్రజలు నిశ్చింతంగా ఉన్నారని స్పష్టం చేశారు. రేవంత్ ప్రజలను రెచ్చగొట్టి 4 ఓట్లను రాబట్టుకోవటానికి పరుష పదజాలం వాడుతున్నారని మండిపడ్డారు. తమకు రేవంత్ కన్నా ఇంకా కిందిస్థాయి భాష వచ్చని, బాధ్యతగల స్థానా ల్లో ఉన్నందున ఓపికపడుతున్నామని చెప్పారు. ఓపిక, సహనాన్ని చేతగానితనంగా చూడొద్దని హెచ్చరించారు. రేవంత్ అదే ధోరణిలో మాట్లాడితే వచ్చే నాలుగు ఓట్లు కూడా రావని హితవు పలికారు. నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడకపోతే కాంగ్రెస్కు పుట్టగతులు ఉండవని హెచ్చరించారు.
ఇతర రాష్ర్టాల నేతలు వచ్చి కాంగ్రెస్ డిక్లరేషన్లు ప్రకటిస్తున్నారని, వాటికి ఎవరు బాధ్యత వహించాలని తలసాని ప్రశ్నించారు. తమను తాము గొప్పగా ఊహించుకొంటున్న కాంగ్రెస్, బీజేపీ బొక్కాబోర్లా పడటం ఖాయమని చెప్పారు. ఈటెల, రేవంత్ తమ ను తాము అతిగా ఊహించుకుంటున్నారని, వారికి ఓటమి తప్పదని హెచ్చరించారు. సీఎం కేసీఆర్ మీద ఓడిపోవడం గౌరవంగా ఉంటుందని మాత్రమే వారు పోటీచేస్తున్నారని ఎద్దేవా చేశారు.
ఈ నెల 17 నుంచి మంత్రి కేటీఆర్ హైదరాబాద్లో రోడ్షోలు ఉంటాయని మంత్రి తలసాని చెప్పారు. 25న బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ భారీ బహిరంగ సభ ఉంటుందని పేర్కొన్నారు. సభాస్థలి వివరాలను త్వరలో ప్రకటిస్తామని చెప్పారు. హైదరాబాద్లోని అన్ని స్థానాలను బీఆర్ఎస్ గెలుచుకుంటుందన్న ధీమా వ్యక్తం చేశారు. సమావేశంలో ఎమ్మెల్యేలు కాలేరు వెంకటేశ్, మాగంటి గోపీనాథ్, ముఠా గోపాల్, మాజీ ఎమ్మెల్సీ శ్రీనివాస్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.