జనగామ : తమ సమస్యను విన్నవిస్తూ మంత్రి కేటీఆర్కు ట్విట్టర్లో ట్యాగ్ చేసి తెలపగా ట్విట్టర్ మేసేజ్కు మంత్రి అర్థరాత్రి సైతం స్పందించారు. వెంటనే జిల్లా కలెక్టర్ను విచారణ చేయాల్సిందిగా ఆదేశించారు. ఘటన వివరాలిలా ఉన్నాయి. జనగామ జిల్లా లింగాల గణపురం మండలం సిరిపురం గ్రామానికి చెందిన కత్తుల సువర్ణ అనే మహిళా రైతు కొద్ది నెలల క్రితం మరణించింది.
ఆమె పేరిట 4 ఎకరాలకు పైగా వ్యవసాయ భూమి ఉంది. రైతు బంధు పథకం పట్టాదారు పాసు పుస్తకం ఆధారంగా రూ.5 లక్షల రైతు భీమా పరిహారం కోసం మహిళా రైతు కుటుంబం దరఖాస్తు చేసుకుంది. అయితే వివిధ సాంకేతిక కారణాలు చూపి అధికారులు బీమా దరఖాస్తును తిరస్కరించారు. దీంతో మృతురాలి కుమారుడు కత్తుల కౌశిక్ మంగళవారం రాత్రి 7 గంటలకు తమ సమస్యను మంత్రి కేటీఆర్ కు ట్విట్టర్ మెసేజ్ ద్వారా విన్నవించాడు.
అర్ధరాత్రి 12 గంటలకు కేటీఆర్ జనగామ జిల్లా కలెక్టర్ కె నిఖిల కు మెసేజ్ చేసి సమస్యను పరిష్కరించాల్సిన ఆదేశించారు. అదే రాత్రి 1.14 గంటలకు కలెక్టర్ నిఖిల మహిళా రైతు కుమారుడు కౌశిక్ కు ఫోన్ చేసి వివరాలు అడిగారు. బుధవారం ఉదయం 8 గంటలకు రెవిన్యూ, వ్యవసాయ అధికారులు సిరిపురం గ్రామానికి వెళ్లి విచారణ చేపట్టారు. విచారణ నివేదిక అనంతరం మాత్రమే తాము కారణాలు వెల్లడించగలమని కలెక్టర్ తెలిపారు.