హైదరాబాద్, ఏప్రిల్ 24 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పదేండ్ల పాలన.. గ్రామస్వరాజ్యంలో స్వర్ణయుగమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అభివర్ణించారు. దేశంలో 3శాతం జనాభా ఉన్న తెలంగాణ, పల్లె ప్రగతిలో 30శాతం అవార్డులను గెలుచుకోవడం పల్లె ప్రగతిలో భాగస్వాములైన ప్రతి ఒకరి విజయమని పేర్కొన్నారు. కేసీఆర్ పాలనలో పదేండ్లపాటు మురిసిన పల్లెలు.. కాంగ్రెస్ పాలనలో నేడు మళ్లీ కన్నీరు పెడుతున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. కాంగ్రెస్ పాలనలో గ్రామస్వరాజ్యం పూర్తిగా గాడితప్పిందని గురువారం ఎక్స్ వేదికగా ఆందోళన వ్యక్తంచేశారు. పదేండ్ల పాలనలో ఉద్యమ నినాదాలను నిజం చేయడమే కాకుండా గ్రామస్వరాజ్యం కోసం జాతిపిత మహాత్ముడు కన్న కలలను కూడా కేసీఆర్ సాకారం చేశారని గుర్తుచేశారు. గురువారం జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం జరుపుకొంటున్న వేళ.. పల్లెసీమలే దేశానికి పట్టుగొమ్మలన్న మహాత్మాగాంధీ ఆశయాలే స్ఫూర్తిగా బీఆర్ఎస్ పాలనలో ప్రాణంపోసిన ‘పల్లెప్రగతి’ని గుర్తుచేసుకోవాల్సిన సందర్భమిదని పేర్కొన్నారు.
‘కేసీఆర్ సంకల్పంతో ప్రతి పల్లెసీమ ప్రగతిసీమగా మారింది. ప్రతి పల్లెలో డంప్ యా ర్డు తప్ప.. చెత్త కంపు లేకుండా పోయింది. కూలిపోయే స్థితిలో ఉన్న ఖాళీ ఇండ్ల కిరికిరి నుంచి పొంగిపొర్లే మురికికాలువల శుభ్రత వరకూ ప్రతి సమస్యకు పదేండ్ల పాలనలో శాశ్వత పరిషారం లభించింది. కలుషిత నీటి కలకలం లేకుండా, సీజనల్ రోగాల చింతలేకుండా సాగిన పంచాయతీల ప్రస్థానం ఒక స్వర్ణయుగం! పచ్చదనానికి కొదువలేకుండా, నిధులకు కొరతలేకుండా, విధులకు ఆటంకం లేకుండా, ప్రతి ఊరును మెరుగైన జీవనానికి మారుపేరుగా మార్చింది మన కేసీఆర్ విజన్!’ అని కేటీఆర్ కొనియాడారు.
సమైక్యపాలనలో దశాబ్దాలపాటు దగాపడ్డ పల్లెలను.. దర్జాగా కాలర్ ఎగరేసుకునే స్థాయికి కేసీఆర్ తీసుకొచ్చారు. సమస్యల సుడిగుండంలో విలవిలలాడిన ప్రతి పల్లె.. పదేండ్ల పాలనలో సకల సౌకర్యాల హరివిల్లుగా మారింది. కేసీఆర్ సంకల్పంతో ప్రతి పల్లెసీమ ప్రగతిసీమగా మారింది. దేశంలోనే ఆదర్శ గ్రామాలకు చిరునామాగా నిలిచిన తెలంగాణ పల్లెలు ఇప్పుడు కాంగ్రెస్ పాలనలో అధ్వాన పరిస్థితులకు అడ్రస్గా మారడం అత్యంత బాధాకరం.
‘కాంగ్రెస్ పాలనలో గ్రామస్వరాజ్యం పూర్తిగా గాడితప్పింది. ఏడాదిన్నర గడిచినా స్థానిక సంస్థలకు ఎన్నికల్లేవు. 15వ ఆర్థిక సంఘం నిధులు లేవు. గ్రామాల్లో కనీస వసతులు లేవు. పల్లెప్రజలకు గుకెడు మంచినీళ్లు దికులేవు. చివరికి పంచాయతీ సిబ్బందికి వేతనాల్లేవు. ఉపాధి హామీ కూలీలకు పనిదినాలు లేవు. మాజీ సర్పంచ్ల బిల్లులకు మోక్షం లేదు. ఢిల్లీ పార్టీలను నమ్మిన పాపానికి పంచాయతీరాజ్ వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేసిన తీరును తెలంగాణ పల్లె ప్రజలు గమనిస్తున్నారు. కేంద్రంలో అధికారంలో ఉండి తీవ్ర అన్యాయం చేస్తున్న బీజేపీకి, పచ్చని పల్లెలను సంక్షోభంలోకి నెట్టిన కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ ప్రజలు కర్రుగాల్చి వాతపెడ్తరు’ అని కేటీఆర్ హెచ్చరించారు.