హైదరాబాద్, ఏప్రిల్ 2 (నమస్తే తెలంగాణ): ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తనపై నిరాధార, సత్యదూరమైన ఆరోపణలు చేసిన కాంగ్రెస్ నాయకులు బేషరతుగా క్షమాపణ చెప్పాలని, లేకుంటే న్యాయపరమైన చర్యలకు సిద్ధంగా ఉండాలని మాజీమంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు హెచ్చరించారు.
మంత్రి కొండా సురేఖ, కేకే మహేందర్రెడ్డిని ఉద్దేశిస్తూ కేటీఆర్ ఎక్స్ వేదికగా మంగళవారం ఈ హెచ్చరికలు చేశారు. తన ప్రతిష్ఠకు భంగం కలిగించే విధంగా ప్రకటనలు చేసిన మంత్రి సహా ఇరువురు కాంగ్రెస్ నేతలపై పరువునష్టం దావా వేయనున్నట్టు హెచ్చరించారు. వాస్తవాలు తెలుసుకోకుండా నిరాధార వార్తను ప్రచురించిన వార్తా పత్రికపై కూడా పరువునష్టం దావా వేయనున్నట్లు ఆయన స్పష్టంచేశారు.