హైదరాబాద్, మే 9 (నమస్తే తెలంగాణ): కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడిపై పోక్సో కేసు నమోదైన నేపథ్యంలో ఆయనను మంత్రి పదవి నుంచి ఎప్పుడు బర్తరఫ్ చేస్తారో చెప్పాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు ప్రధాని మోదీని డిమాండ్ చేశారు. ‘కేంద్రమంత్రి కొడుకుపై చట్టపరమైన చర్యలు తీసుకోవడంలో ఎందుకు జాప్యం జరుగుతున్నది. బండి సంజయ్కి, ఆయన కొడుకుకు ఏమైనా ప్రత్యేక మినహాయింపులు ఉన్నాయా? నైతిక బాధ్యత వహించి బండి సంజయ్ ఎప్పుడు రాజీనామా చేస్తారు? ఆయనను మంత్రివర్గం నుంచి ఎప్పుడు బర్తరఫ్ చేస్తారో చెప్పండి.
లేదా మీ ‘బేటీ బచావో’ అనేది కేవలం నినాదానికే పరిమితమా’.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారూ’ అని నిలదీశారు. బాధిత బాలికకు జరుగుతున్న అన్యాయంపై ఆవేదన వ్యక్తంచేస్తూ, అటు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై, ఇటు రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై శనివారం ఒక ప్రకటనలో ప్రశ్నల వర్షం కురిపించారు. తెలంగాణలో ఓ బాలిక లైంగిక వేధింపులకు గురైతే కాంగ్రెస్ ప్రభుత్వం నిందితుడిపై కనీసం కేసు నమోదు చేయకుండా బాధితురాలి కుటుంబాన్నే వేధింపులకు గురిచేస్తున్నదని విమర్శించారు. కాంగ్రెస్ పాలనలో తెలంగాణ ఒక జంగిల్రాజ్గా మారిపోయిందని మండిపడ్డారు. ఒక మైనర్ బాలిక అన్ని ఆధారాలతో ఫిర్యాదు చేసినా పోలీస్శాఖ ఎందుకు స్పందించలేదు? ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి బాధితురాలు మూడు నెలలపాటు ఎందుకు పోరాడాల్సి వచ్చింది? అని ప్రశ్నించారు. ఉన్నావ్ కేసులో బాధితురాలికి అండగా నిలిచిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ, ఇప్పుడు హైదరాబాద్ వచ్చి ఈ బాధితురాలికి అండగా నిలబడరా? లేక మీ న్యాయం తెలంగాణ బాధితులకు వర్తించదా? అని నిలదీశారు.
బాధితురాలిపైనే ఉల్టా కేసు పెడతారా?
బాధిత బాలికపైనే ఎదురు కేసులు పెట్టడాన్ని కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. ‘ఏ నిబంధన ప్రకారం బాలికపై హనీట్రాప్, వసూళ్ల కేసు నమోదు చేశారు? అని పోలీసులను నిలదీశారు. బాధితురాలిని, ఆమె కుటుంబాన్ని నేరస్తుల్లా చూస్తూ వేధించడం దుర్మార్గమని ఆగ్రహం వ్యక్తంచేశారు. న్యాయం కోసం తిరుగుతూ ఆ బాలిక ఇప్పటికే రెండుసార్లు ఆత్మహత్యాయత్నం చేసిందని, ఇప్పుడు ఆమెనే నిందిస్తూ విక్టిమ్ షేమింగ్ చేయడం ఏమిటని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ బీజేపీకి ఒక ఫ్రాంచైజీలా మారిందని విమర్శించారు. బాలిక గౌరవం విషయంలో రెండు పార్టీలు కలిసి ఒక అపవిత్రమైన, అసహ్యకరమైన ఒప్పందానికి వచ్చాయా? అని అనుమానం వ్యక్తంచేశారు. అందుకే ఇతర పోక్సో కేసు నిందితుల మాదిరిగా మంత్రి కుమారుడిని ఎందుకు విచారించడం లేదని ప్రశ్నించారు. ‘మనం ఎంతటి దుర్భరమైన, భయంకరమైన నరకంలో జీవిస్తున్నామో ఈ ఘటనను చూస్తే అర్థమవుతున్నది. గతంలో మన మహిళల గౌరవం కోసం అణచివేతదారులపై, ప్రభుత్వాలపై పోరాటాలు చేశాం. ఆడబిడ్డల రక్షణ కోసం అవసరమైతే మరో మిలియన్సార్లు పోరాడటానికి మేము సిద్ధంగా ఉన్నాం’ అని కేటీఆర్ స్పష్టంచేశారు.