Minister KTR | హైదరాబాద్, నవంబర్ 24 (నమస్తే తెలంగాణ): మార్పు కోసం తమకు ఓటెయ్యాలంటున కాంగ్రెస్.. ఏ మార్పు కోరుకుంటున్నదని, మళ్లీ 3 గంటల కరెంటు, ఆకలి చావుల రోజులు తిరిగిరావాలని కోరుకుంటున్నదా? అని కేటీఆర్ ప్రశ్నించారు. స్కీములు పోయి మళ్లీ స్కామ్లు రావాలని కోరుకుంటున్నారా? అని ఎద్దేవా చేశారు. శుక్రవారం హైదరాబాద్లో ఎడిటర్స్ మీట్ ది ప్రెస్లో కేటీఆర్ మాట్లాడారు. విపక్షాలు మార్పు కోసం ఓటు వేయాలని కోరుతున్నాయని, ఆరు నెలలకు ఒక సీఎం మారే మార్పు కోస మా? నిండిన చెరువులు పోయి ఎండిన చెరువులు వచ్చే మార్పు కోసమా? పచ్చని పొలా లు పోయి నెర్రెలు బారిన నేలల మార్పు కోసమా? వ్యవసాయాన్ని దండుగచేసి మళ్లీ రైతు ఆత్మహత్యలు తెచ్చే మార్పు కోసమా? గుజరాత్లో ఐదుసార్లు బీజేపీ రావచ్చు, దేశాన్ని 50 ఏండ్లు కాంగ్రెస్ పాలించవచ్చు, కానీ కేసీఆర్ రెండుసార్లు పాలించగానే మార్పు కావాలి అని అంటున్నారని పేర్కొన్నారు. గతంలో 50 ఏండ్లలో ఏమీ చేయని అసమర్థులకు ఓటు వేద్దామా? లేక ఆరున్నరేండ్లలోనే అభివృద్ధి, సంక్షేమంలో తనదైన ముద్ర వేసుకున్న కేసీఆర్కు ఓటు వేద్దామా? అనేది ప్రజలు ఆలోచించాలని కోరారు. ప్రజ లు కోరుకున్న మార్పు 2014లోనే వచ్చిందని, ఇప్పుడు ఇక ఈ ప్రగతి ప్రస్థానం ఆగకూడదని పేర్కొన్నారు. నాటి టీఆర్ఎస్, నేటి బీఆర్ఎస్ 23 ఏండ్లలో ఒక్కసారి కూడా బీజేపీతో పొత్తు పెట్టుకోలేదని చెప్పారు.
బండి, రేవంత్ ఏ పరీక్ష రాశారు?
దేశంలో తెలంగాణ చేసినన్ని ఉద్యోగ భర్తీలు ఏ రాష్ట్రంలో చేయలేదని కేటీఆర్ పేర్కొన్నారు. తాను ఆల్ ఇండియా ఎంట్ర న్స్ రాసి పాసై పుణె యూనివర్సిటీలో చదివినట్టు తెలిపారు. అమెరికాలో ఉద్యోగం చేశానని చెప్పారు. నేడు మాట్లాడుతున్న రాహుల్గాంధీ, రేవంత్ ఏనాడూ ఎంట్రన్స్లు రాసినట్టు తనకు తెలియదని, బండి సంజయ్ అసలు చదువుకున్నారో లేదో కూడా తనకు తెలియదన్నారు. వీళ్లు నిరుద్యోగుల తరఫున వకాల్తా పుచ్చుకోవడం ఏమిటని ప్రశ్నించారు. జాబ్ క్యాలెండర్తో వస్తామని స్పష్టంచేశారు. టీఎస్పీఎస్సీ ద్వారా రెండున్నర లక్షలకు పైగా ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చి, సుమారు లక్షా 60 వేల ఉద్యోగాలను భర్తీ చేశామని కేటీఆర్ చెప్పారు.
70-80 సీట్లతో మళ్లీ అధికారం మాదే
సుస్థిర ప్రభుత్వం, సమర్థ నాయకత్వం రావాలంటే తమకు ఓటు వేయాలని కోరుతున్నామని, తెలంగాణ తెచ్చిన, పదేండ్లు రాష్ర్టాన్ని విజయవంతంగా పాలిన కేసీఆర్ను మళ్లీ గెలిపించాలని కోరుతున్నామన్నారు. 70-80 సీట్లు సాధిస్తున్నామన్నారు.
మోస్ట్ సక్సెస్ఫుల్ స్టార్టప్ స్టేట్ తెలంగాణ
కరోనా, ఎన్నికల కోడ్లు తీసేస్తే నికరం గా తాము పనిచేసింది ఆరున్నరేండ్లేనని కేటీఆర్ చెప్పారు. తాము ఎన్నో అభివృద్ధి పనులు చేశామని, వచ్చే టర్మ్లోనూ అభివృద్ధి ప్రణాళికను తప్పనిసరిగా అమలుచేసి, ఓ మార్క్ను సెట్ చేస్తామని చెప్పారు. మోస్ట్ సక్సెస్ఫుట్ స్టార్టప్స్టేట్గా తెలంగాణ ఎదిగిందన్నారు. రైతుబంధు విడుదలకు ఎన్నికల సంఘం అనుమతివ్వడం సంతోషకరమని, ఉద్యోగులకు డీఏ విడుదలకు కూడా ఈసీ అనుమతి ఇవ్వాలని కోరారు.
లెక్కలేసుకొనే హామీలు ఇచ్చాం
ఆర్థికంగా అన్ని లెక్కలు వేసుకొనే మ్యానిఫెస్టో విడుదల చేశామని కేటీఆర్ చెప్పారు. కాంగ్రెస్లాగ అడ్డగోలుగా ప్రకటన చేయలేదని తెలిపారు. రాజస్థాన్లో వారు మోటర్లకు మీటర్లు పెట్టినట్టే.. ఇక్కడ కూడా పెట్టిస్తారేమోనని చెప్పారు. కేంద్రం పెంచిన గ్యాస్ ధరను ఇకపై తామే భరిస్తామని హామీ ఇచ్చారు. కామారెడ్డి, నారాయణఖేడ్లో పేదరికంపై ఫోకస్ పెట్టామన్నారు. ప్రధానిలా జెండాలు ఊపినట్టు కాకుండా.. సీఎం పింఛన్లు పంచుకుంటూ తిరగలేడని, ప్రజలు ప్రగతి భవన్కు రాకుండా, స్థానికంగానే సమస్య పరిష్కారమయ్యే పరిస్థితిని కల్పించడమే తమ సీఎం లక్ష్యమని చెప్పారు. తనకు సీఎం పదవిపై ఆశ లేద ని స్పష్టంచేశారు. 2014లో తాను పార్టీకి రాజీనామా చేద్దామని అనుకున్నానని, సోనియా పార్టీ విలీన పక్రియను సరిగా హ్యాండిల్ చేయకపోవడంతో తమ నెత్తిన పాలు పోశారని చెప్పారు. కార్యక్రమంలో ఆంధ్రజ్యోతి ఎడిటర్ కే శ్రీనివాస్, సీనియర్ పాత్రికేయులు ఉండ్రు నర్సింహారావు, విజయ్కుమార్రెడ్డి, వేణుగోపాల్ నాయుడు, కర్రి శ్రీరాం, డేవిడ్, జీఎస్ వాసు, బండారు శ్రీనివాసరావు, రవికాంత్రెడ్డి పాల్గొన్నారు.