KTR | యువత కోసం బీఆర్ఎస్ తెగించి కొట్లాడుతున్నదని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. యూత్ ఉత్సాహం చూస్తుంటే.. సీఎం రేవంత్ రెడ్డికి మూడినట్లే కనిపిస్తుందని అన్నారు. హైదరాబాద్ సరూర్ నగర్లో తలపెట్టిన యువ సంగ్రామ సదస్సులో కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ఇప్పటిదాకా ఒక లెక్క.. ఇక నుంచి ఒక లెక్క అని రేవంత్ రెడ్డిని హెచ్చరించారు.
ఉడుకు నెత్తురితో ఉరకలెత్తే యువత ఈ సభకు వచ్చిందని కేటీఆర్ అన్నారు. నెత్తురు మండే నవతరం ఇక్కడికి పోటెత్తిందని తెలిపారు. జంగ్ సైరన్ మోగించడానికి యంగ్ జనరేషన్ తరలివచ్చిందని చెప్పారు. కేయూ, ఓయూ, మహాత్మాగాంధీ, పాలమూరు, శాతవాహన సహా వివిధ యూనివర్సిటీల నుంచి యువత తరలివచ్చిందని అన్నారు. జంగ్ సైరన్ మోగించడానికి వచ్చిన యంగ్ జనరేషన్కు సమస్కారాలు తెలిపారు. అశోక్నగర్, దిల్సుఖ్నగర్, వివిధ కోచింగ్ సెంటర్ల నుంచి తరలివచ్చిన వారికి ధన్యవాదాలు చెప్పారు.
యువశక్తి శివమెత్తితో పోరాటాలు పోటెత్తుతాయని కేటీఆర్ వ్యాఖ్యానించారు. నవశక్తి విజృంభిస్తే విప్లవాలు విరబూస్తాయని అన్నారు. మీరు పిడికిలి బిగిస్తే పీఠాలు కదలిపోతాయని యువతను ఉద్దేశించి చెప్పారు. మీ గలాలు గర్జిస్తే కుర్చీలే కూలిపోతాయని అన్నారు. యువత కదం తొక్కితే ఉద్యమాలు ఉప్పెనలవుతాయని తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో యువత కలిసి వచ్చి కొట్లాడిందని గుర్తుచేశారు. రేపటి తెలంగాణ నిర్మాతలు మీరే అని చెప్పారు. రేపటి ఈ దేశ భవిష్యత్తుకు నిర్ణేతలు మీరు అని అన్నారు. అలాంటి యువతరాన్ని దగా చేయవచ్చునా అని నిలదీశారు. యువతకు జరిగిన మహాద్రోహాన్ని గుర్తుచేసుకోవడానికే ఈ సదస్సు ఏర్పాటు చేసుకున్నామని స్పష్టం చేశారు. వంచించిన వారికి బుద్ధి చెప్పడానికే ఈ సదస్సు పెట్టుకున్నామని అన్నారు.