హైదరాబాద్, మార్చి 21 (నమస్తే తెలంగాణ): దశాబ్దాలపాటు ధ్వంసమైన అడవులను కంటికి రెప్పలా కాపాడిన దార్శనికుడు కేసీఆర్ అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. సమైక్య రాష్ట్రంలో ఆగమైన అటవీ సంపద చుట్టూ అందమైన పచ్చని పందిరి అల్లిన ప్రకృతి ప్రేమికుడు కేసీఆర్ అని ప్రశంసించారు.
తెలంగాణలో మహోద్యమంలా సాగిన ఆనాటి హరితహారం, 230 కోట్ల మొక్కలు నాటాలన్న సంకల్పం ప్రపంచ చరిత్రలోనే మూడో అతిపెద్ద మానవ ప్రయత్నయని పేర్కొన్నారు. ప్రపంచ అటవీ దినోత్సవాన్ని పురస్కరించుకొని కేటీఆర్ గురువారం ట్విట్టర్ (ఎక్స్)లో పచ్చదనాన్ని వృద్ధి చేయడంలో గత కేసీఆర్ సర్కారు సాధించిన విజయాలను వెల్లడించారు.
బీఆర్ఎస్ పదేండ్ల పాలన.. పుడమి తల్లికి ఆభరణం
‘సుమారు 15 వేల నర్సరీల పెంపకం ఈ మహాయజ్ఞంలో సరికొత్త అధ్యాయం. 8 శాతం పెరిగిన గ్రీన్ కవర్ దేశ చరిత్రలోనే నెవర్ బిఫోర్. తెలంగాణ పునర్నిర్మాణం అంటే ప్రజల బతుకు చిత్రాన్ని మార్చడమే కాదు…చిక్కిశల్యమైన అడవులను సకల జీవరాశులను సంరక్షించమని నలుదిశలా చాటిచెప్పిన నాయకత్వం మనది. అందుకే బీఆర్ఎస్ పదేండ్ల ప్రస్థానం.. పుడమి తల్లికి వెలకట్టలేని ఆభరణం.
నాడు ప్రతిపల్లె పచ్చదనంతో మురిసింది… ప్రతి పట్టణం హరితశోభతో వెల్లివిరిసింది. నేడు గ్లోబల్ వార్మింగ్తో మానవాళికి వార్నింగ్లు… ఎటుచూసినా క్లౌడ్బరస్టులు, కుండపోతల ప్రమాద ఘంటికలు. ఈ ప్రకృతి విపత్తులను అరికట్టాలన్నా.. పర్యావరణ సమతుల్యత సాధించాలన్నా.. ఆపదలో ఉన్న అటవీ సంపదను కాపాడాలన్నా.. మానవజాతి చేతిలో ఉన్న ఏకైక బ్రహ్మాస్త్రం హరితహారం. నాడు.. నేడు.. ఏనాడైనా.. బీఆర్ఎస్ నమ్మే సిద్ధాంతమిది.
అందుకే… జంగిల్ బచావో.. జంగిల్ బడావో… నినాదాన్ని అక్షరాలా నిజం చేశారు నాటి సీఎం కేసీఆర్. భవిష్యత్తు తరలాలకు మనమిచ్చే వారసత్వ సంపద కాంక్రీట్ జంగిళ్లు కానే కాదని.. పచ్చని అటవీ సంపద అని చాటిచెప్పి.. గ్రేట్ వాల్ ఆఫ్ చైనాను తలదన్నేలా నిర్మించిన గ్రీన్ వాల్ ఆఫ్ తెలంగాణ సాక్షిగా..ప్రకృతి ప్రేమికులందరికీ… ప్రపంచ అటవీ దినోత్సవ శుభాకాంక్షలు. జై హరితహారం.. జై తెలంగాణ.. జై బీఆర్ఎస్’ అని కేటీఆర్ పేర్కొన్నారు.