కరీంనగర్, అక్టోబర్ 2 (నమస్తే తెలంగాణ): పాన్ ఇండియాలో తెలుగు సినిమాలు దుమ్ము రేపుతున్నట్టే తెలుగు పార్టీ దేశంలో దుమ్మురేపే రోజు దగ్గర్లోనే ఉన్నదని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కే తారకరామారావు అన్నారు. ఆదివారం రాత్రి కరీంనగర్లో జరిగిన కళోత్సవాల ముగింపు సభలో మాట్లాడుతూ.. కేసీఆర్ స్థాపించబోయే జాతీయ పార్టీపై కీలక వ్యాఖ్యలు చేశారు. 2001 ఏప్రిల్ 27న పుట్టిన టీఆర్ఎస్.. అదే ఏడాది మే 17న కరీంనగర్ గడ్డపై సింహగర్జన నిర్వహించిందని, కరీంనగర్ ప్రజల ఆశీర్వాదంతోనే తెలంగాణ వచ్చిందని గుర్తుచేశారు. ఇదే కరీంనగర్లో కేసీఆర్ తీసుకొన్న నిర్ణయం రేపటి సంచలనం కాబోతున్నదని చెప్పారు. కేసీఆర్ నిర్ణయానికి ప్రజలందరి మద్దతు, ఆశీర్వాదం కావాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ మాట ఎంత పవర్ఫుల్గా పేలిందో కళాకారుల ఆటా, పాట కూడా అంతే పవర్ఫుల్గా పేలాయని అన్నారు. వందేమాతరం శ్రీనివాస్ పాడిన ఎర్రజెండా పాటను ప్రస్తావించిన కేటీఆర్.. ఎరుపు, తెలుపు కలిస్తేనే గులాబీ జెండా అయ్యిందని, నాడు ఎరుపు రంగు కోరుకున్న పనులన్నీ ఇపుడు కేసీఆర్ చేస్తున్నారని వ్యాఖ్యానించారు. ఒకప్పుడు ఎర్రజెండా ఎత్తుకున్న వాళ్లంతా ఇప్పుడు కేసీఆర్ వెంట నడుస్తున్నారని చెప్పారు.
ఒకప్పుడు సినిమా ఫీల్డ్లో ఎందరో అజ్ఞాత సూర్యులు ఉండేవారని, తమది తెలంగాణ అని చెప్పుకోలేక పోయేవారని, ఇప్పుడు తెలంగాణ నేపథ్యం ఉంటేనే సినిమా హిట్టవుతున్నదని అన్నారు. కళాకారులకు తెలంగాణ ప్రభుత్వం అండగా ఉంటుందని, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ నేతృత్వంలో రాష్ట్రంలో 574 మంది కళాకారులకు ఉపాధి కల్పిస్తున్నామని చెప్పారు. ఇంకా అనేకమంది కళాకారులు ఉన్నారని, వారికీ అండగా ఉంటామని అన్నారు. తెలంగాణ వైభవాన్ని చాటేలా హైదరాబాద్లో కళోత్సవాలు నిర్వహించుకుందామన్నారు. తాను కరీంనగర్ మిషన్ హాస్పిటల్లో పుట్టానని, స్థానిక సెయింట్ జోసెఫ్ స్కూల్లో ఐదారేండ్లు చదువుకొన్నానని తన బాల్యస్మృతులను గుర్తుచేసుకొన్నారు. కరీంనగర్ అంటే తనకంటే కేసీఆర్కు ఎంతో ఇష్టమైనదని చెప్పారు. ఇక్కడి ప్రజల ఆశీర్వాదం ఉండాలన్నారు. కళోత్సవాలు నిర్వహిస్తున్నామని మంత్రి గంగుల చెప్తే ఏ వెయ్యి మందితోనో.. ఏదో కళాభారతిలో నిర్వహిస్తున్నారేమో అనుకున్నానని, చాలా వైభవంగా నిర్వహిస్తున్నట్లు మీడియా ద్వారా తెలుసుకొని ముగింపు సభకు పిలవగానే వచ్చానని చెప్పారు.
‘ఆవిర్భావ సభ కరీంనగర్లో నిర్వహించాలి’
జాతీయపార్టీ ఆవిర్భావ సభను కరీంనగర్లోనే నిర్వహించాలని బీసీ సంక్షేమం, పౌరసరఫరాల శాఖల మంత్రి గంగుల కమలాకర్ కోరారు. ఇప్పటికే ఐటీ టవర్ నిర్మించుకొన్నామని, మెడికల్ కళాశాల నిర్మించుకోబోతున్నామని, అంగరంగ వైభంగా వేంకటేశ్వరస్వామి ఆలయాన్ని కూడా నిర్మించుకొంటున్నామని చెప్పారు. వీటన్నింటికీ కారణం కేసీఆర్, కేటీఆర్ ప్రోత్సాహమేనని కొనియాడారు. 2001లో టీఆర్ఎస్ను స్థాపించి కరీంనగర్లో మొదటిసారి సింహగర్జన సభను ఏ విధంగానైతే నిర్వహించారో అదే విధంగా జాతీయ పార్టీ ఆవిర్భావ సభ కూడా ఇక్కడే నిర్వహించాలని కరీంనగర్ ప్రజల పక్షాన కేటీఆర్కు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా వందేమాతరం శ్రీనివాస్, శివారెడ్డి, రోజారమణి తదితర కళాకారులను కేటీఆర్ ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్, సుంకె రవిశంకర్, జడ్పీ అధ్యక్షురాలు కనుమల్ల విజయ, ఎమ్మెల్సీ పాడి కౌశిక్రెడ్డి, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్, నగర మేయర్ వై సునీల్రావు, కలెక్టర్ ఆర్వీ కర్ణన్, సీపీ సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్రావు, మాజీ ఎమ్మెల్యేలు ఆరెపల్లి మోహన్, కోడూరి సత్యనారాయణ పాల్గొన్నారు.
బీజేపీ పేరు మార్చుకోవాలి
కొత్త పేర్లు సూచించిన మంత్రి కేటీఆర్.. ట్విట్టర్లో వ్యంగ్యాస్త్రం
బీజేపీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ వ్యవస్థలను దుర్వినియోగం చేస్తున్నదని ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావు ఆగ్రహం వ్యక్తంచేశారు. బీజేపీ తన పేరును మార్చుకోవాలంటూ ట్విట్టర్లో వ్యంగ్యాస్త్రం సంధించారు. ప్రతిష్ఠాత్మక స్వతంత్ర సంస్థలన్నింటినీ తన గుప్పిట పెట్టుకొన్న బీజేపీ ఆ సంస్థల కంటే ముందుగానే వివరాలను ప్రకటిస్తున్నదని ఆక్షేపించారు. మునుగోడు ఉపఎన్నిక షెడ్యూల్ అక్టోబర్ 15లోగా వెలువడుతుందని, నవంబర్లో ఎన్నిక ఉంటుందని బీజేపీ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సల్ చెప్పినట్టు వచ్చిన వార్తల క్లిప్పింగ్ను ట్వీట్కు జతచేశారు. బీజేపీకి కొత్త పేరును సూచిస్తూ సెటైర్లు వేశారు. బీజేపీ తను పేరును బీజే.. ఈసీ-సీబీఐ-ఎన్ఐఏ-ఐటీ-ఈడీ..పీ ఇలా మార్చుకొంటే బాగుంటుందని కేటీఆర్ వ్యంగ్య బాణాలేశారు.
బిఫోర్ ఈసీ: ఎన్నికల సంఘం కంటే ముందు ఎన్నికల తేదీలను ప్రకటిస్తుంది.
బిఫోర్ ఈడీ: ఈడీ కంటే ముందు పేర్లను ప్రకటిస్తుంది.
బిఫోర్ ఎన్ఐఏ: నిషేధించిన వాటి వివరాలను ప్రకటిస్తుంది.
బిఫోర్ ఐటీ(ఇన్కంటాక్స్): ఎంత మొత్తమో ప్రకటిస్తుంది.
బిఫోర్ సీబీఐ: నేరారోపణలు ఎదుర్కొంటున్న వారి పేర్లను ప్రకటిస్తుంది.