కాపురాన్ని నిలబెట్టిన పార్టీ రుణం తీర్చుకున్న కుటుంబం
కరీంనగర్, ఆగస్టు 27 (నమస్తే తెలంగాణ): తమ కుమారుడికి ముఖ్యమంత్రి కేసీఆర్చే కేటీఆర్ (కలికేటి తారక రామారావు)గా నామకరణం చేయించుకున్న ఆ దంపతులు.. విడాకుల వరకు వచ్చిన తమ కాపురాన్ని నిలబెట్టిన పార్టీ రుణం తీర్చుకున్నారు. వివరాల్లోకి వెళితే.. రామడుగు మండలం మోతె గ్రామానికి చెందిన టీఆర్ఎస్ నాయకుడు కలికేటి లక్ష్మణ్కు ఎనిమిదేండ్ల క్రితం కవితతో వివాహమైంది. పెండ్లయిన కొద్దికాలానికే మనస్పర్థలు రావడంతో విడిపోయారు. రెండేండ్ల క్రితం ఎంపీటీసీ ఎన్నికల్లో మోతె ఎస్సీ మహిళకు రిజర్వ్ కావడంతో లక్ష్మణ్ తన తల్లికి అవకాశం ఇవ్వాలని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ను కోరారు. భార్యను కాపురానికి తీసుకువస్తే ఆమెకు టికెట్ ఇస్తానని ఎమ్మెల్యే ఖరాకండీగా చెప్పారు. దాంతో లక్ష్మణ్ భార్యను తీసుకొచ్చుకున్నాడు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో కవిత ఎంపీటీసీగా గెలుపొందడంతోపాటు, ఎమ్మెల్యే సహకారంతో రామడుగు ఎంపీపీగా కూడా ఎన్నికైంది. అప్పటి నుంచి వారు అన్యోన్య జీవితాన్ని గడుపుతున్నారు. ఆ దంపతులకు ఇటీవలే కుమారుడు జన్మించారు. పార్టీ కారణంగానే తమ కాపురం నిలబడటంతోపాటు, కుమారుడు కూడా జన్మించాడని సంతోషంతో ఉన్నారు. పార్టీ రుణం తీర్చుకొనేందుకు తమ కుమారుడికి తారకరామారావు పేరు పెట్టాలని నిర్ణయించుకున్నారు. సీఎం కేసీఆర్ చేతులమీదుగా ఆ నామకరణం చేయించాలని రెండునెలలుగా ఎదురుచూశారు. శుక్రవారం కరీంనగర్ పర్యటనకు వచ్చిన సీఎం కేసీఆర్ను ఎమ్మెల్యే సుంకె రవిశంకర్తో కలిసి అభ్యర్థించారు. చిన్నారిని చేతుల్లోకి తీసుకున్న సీఎం.. తారక రామారావు అని నామకరణం చేశారు. సాక్షాత్తూ ముఖ్యమంత్రి తమ కుమారుడికి పేరు పెట్టడం.. ఇంటిపేరుతో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పేరు ‘కేటీఆర్’ అని రావడంతో ఆ దంపతుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.