మంత్రి కేటీఆర్ వ్యంగ్యాస్త్రం
మళ్లీ పెరిగిన పెట్రో ధరలు
లీటరు రూ.120 చేరువలో
గ్యాస్, డీజిల్, పెట్రోల్ పెంపును రోజువారీ
అలవాటుగా మార్చిన మోదీకి ధన్యవాదాలు
ట్విట్టర్ వేదికగా ధరల పెంపుపై కేటీఆర్ విమర్శ
హైదరాబాద్, ఏప్రిల్ 5 (నమస్తే తెలంగాణ): గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలపై రాష్ట్ర మున్సిపల్, ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్ మరోసారి ఫైర్ అయ్యారు. ‘జీడీపీ పెరగటం లేదని ఎవరు చెప్పారు. గ్యాస్, డీజిల్, పెట్రోల్ (జీడీపీ) పెంపును భారతీయులందరికీ రోజువారీ అలవాటుగా మార్చిన ప్రియమైన ప్రధాని నరేంద్ర మోదీజీకి ధన్యవాదాలు. ఈవీ(ఎలక్ట్రిక్ వెహికిల్స్)ను ప్రమోట్ చేయడానికి మోదీజీ మాస్టర్ స్ట్రాటజీ ఇదేనని మాకు చెప్పే తెలివైన బీజేపీ నాయకులు ఉంటారని నేను కచ్చితంగా చెప్పగలను’ అంటూ మంగళవారం ట్వీట్చేశారు. పెట్రోల్, డీజిల్ ధర మరోసారి పెరిగింది. గడిచిన రెండు వారాల్లో దాదాపు రూ.10 పెరిగింది. అని ఓ టీవీ చానల్ బ్రేకింగ్ న్యూస్ క్లిప్ను కూడా పోస్ట్చేశారు.
కాంగ్రెస్ ఎంపీ, మాజీ ఆర్థిక మంత్రి పీ చిదంబరం పెట్రో ధరల పెంపుపై చేసిన ట్వీట్లను మంత్రి కేటీఆర్ రీట్వీట్ చేశారు. ‘8 ఏండ్ల మోదీ ప్రభుత్వ పాలనలో కేంద్రం ఇంధన పన్నుల రూపంలో రూ.26,51,919 కోట్లు వసూలు చేసింది. భారతదేశంలో దాదాపు 26 కోట్ల కుటుంబాలు ఉన్నాయి. అంటే ప్రతి కుటుంబం నుంచి కేంద్ర ప్రభుత్వం సగటున రూ.లక్ష ఇంధన పన్ను వసూలు చేసింది. ఇంత పెద్ద మొత్తంలో ఇంధన పన్ను చెల్లించినందుకు సగటు కుటుంబానికి ప్రతిఫలంగా ఏం వచ్చిందని మీకు మీరే ప్రశ్నించుకోండి’ అని ఆ ట్వీట్లో ఉన్నది.
తెలంగాణ ఇన్నోవేషన్ పవర్ను నమ్ముతుంది
వై-హబ్పై మంత్రి కేటీఆర్ ట్వీట్
తెలంగాణ రాష్ట్రం ఇన్నోవేషన్ పవర్ను నమ్ముతుందని మున్సిపల్, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. యువత, పిల్లల్లో సృజనాత్మక శక్తిని వెలికితీసి, నూతన ఆవిష్కరణలు చేసే లక్ష్యంతో ఏర్పాటు చేయనున్న వై-హబ్పై మంగళవారం ఆయన ఆసక్తికరమైన వీడియోను ట్విట్టర్లో పంచుకున్నారు.‘తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్లో టీ-హబ్, వీ-హబ్, టీ-వర్క్స్ను ఏర్పాటు చేసింది. ఇప్పుడు టీఎస్ఐసీ బృందం వై-హబ్ను ప్రారంభించేందుకు సిద్ధమైంది. మనం ఆవిష్కర్తలను చిన్న వయసులోనే గుర్తించి పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దాలి. తెలంగాణ ఇన్నోవేషన్ పవర్, సమ్మిళిత వృద్ధిని విశ్వసిస్తుంది’ అని ట్వీట్ చేశారు.