రాజన్న సిరిసిల్ల, జనవరి 10 (నమసే తెలంగాణ): సిరిసిల్ల సహకార విద్యుత్తు పంపిణీ సంఘం (సెస్) ఎన్నికల్లో 15 డైరెక్టర్ పదవులన్నింటినీ బీఆర్ఎస్ గెలువడం ట్రైలర్ మాత్రమేనని.. మున్ముందు అసలు సినిమా చూపిస్తామని రాష్ట్ర ఐటీ, మున్సిపల్, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ స్పష్టంచేశారు. సెస్ ఫలితంతో రాజన్న సిరిసిల్ల జిల్లా రాష్ర్టానికి దారి చూపిందని, 2023లో రాష్ట్రమంతటా ఇదే ఫలితం పునరావృతమవుతుందని తెలిపారు. కేంద్రం ఇచ్చిన నిధులపై ఇటీవల చేసిన సవాల్కు తాను కట్టుబడి ఉన్నానని, తప్పని నిరూపిస్తే.. రాజీనామాకు సిద్ధమని పునరుద్ఘాటించారు.
మోదీ దేవుడంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పదే పదే పేర్కొనడంపై విరుచుకుపడిన కేటీఆర్.. పేదలపై పెనుభారం మోపిన ప్రధాని దేవుడెట్లయితడని ప్రశ్నించారు. మంగళవారం రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించిన మంత్రి కేటీఆర్.. తంగళ్లపల్లి మండల కేంద్రంలో పద్మశాలీ సంఘం ఏర్పాటు చేసిన ఆచార్య కొండా లక్ష్మణ్బాపూజీ విగ్రహాన్ని ఆవిష్కరించారు. తర్వాత మండల పరిషత్ కార్యాలయ నూతన భవనాన్ని ప్రారంభించి, సిరిసిల్ల సెస్ కార్యాలయానికి చేరుకున్నారు. సిరిసిల్ల సహకార విద్యుత్ సరఫరా సంఘం ఎన్నికల్లో గెలుపొందిన 15 మంది పాలకవర్గ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. మంత్రి సమక్షంలో చైర్మన్గా చిక్కాల రామారావు బాధ్యతలు చేపట్టిన అనంతరం పద్మనాయక కల్యాణ మండపంలో బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య అధ్యక్షతన జరిగిన వినియోగదారుల కృతజ్ఞతసభకు కేటీఆర్ ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు.
రాజన్న సిరిసిల్ల సెస్ కార్యాలయంలో మంత్రి కేటీఆర్ సమక్షంలో సెస్ చైర్మన్గా బాధ్యతలు స్వీకరిస్తున్న చిక్కాల రామారావు. చిత్రంలో ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్కుమార్, ఎమ్మెల్యేలు సుంకె రవిశంకర్, రసమయి, ఎమ్మెల్సీ ఎల్ రమణ తదితరులు
తెలంగాణ ఇచ్చిన రూ.2 లక్షల కోట్లు ఎటుపోయినయ్?
సీఎం కేసీఆర్ కేంద్రం నుంచి వచ్చే నిధులు మళ్లిస్తున్నాడని అంటున్నారని, ఎవరి సొమ్ము తో ఎవరు కులుకుతున్నారని మంత్రి కేటీఆర్ నిలదీశారు. రూపాయి కడితే కేంద్రం నుంచి తెలంగాణకు వాపస్ వచ్చేది 45 పైసలేనని స్పష్టం చేశారు. మిగిలిన 55 పైసలు ఎటుపోతున్నయ్? అని ప్రశ్నించారు. ‘తెలంగాణ పన్నుల రూపంలో కేంద్రానికి 8 ఏండ్లలో రూ.3 లక్షల 68 వేల కోట్లు ఇచ్చింది. కేంద్రం రాష్ట్రానికి రూ.లక్షా 68 వేల కోట్లు మాత్రమే తిరిగిచ్చింది. మిగిలిన రూ.2 లక్షల కోట్లు ఏమైనయ్? ఎవరి సొమ్ముతో ఎవరు కులుకుతున్నా రు? తెలంగాణ ప్రజల చెమట, రక్తంతో బీజేపీ పాలిత వెనుకబడిన రాష్ర్టాలను మీరు సాదుకుంటున్న మాట వాస్తవం కాదా?’ అని మం త్రి కేటీఆర్ ప్రశ్నించారు. ‘నిన్న హుజూర్నగర్లో చెప్పిన. మళ్లీ సిరిసిల్ల గడ్డమీద బల్లగుద్ది చెప్తున్న. నేను చెప్పిన లెక్కలు తప్పని నిరూపిస్తే నా మంత్రి పదవికి రాజీనామా చేసి మీ ము ఖాన పారేసి పోతా’ అని పునరుద్ఘాటించారు. కేంద్రమంత్రి కిషన్రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్కి తన సవాల్ను స్వీకరించే దమ్ముందా? అని నిలదీశారు. మోదీ పేదోళ్ల దేవుడంటూ బండి సంజయ్ పేర్కొనడంపైనా కేటీఆర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
‘మోదీ ఎవరికి దేవుడు? నీకా? నాకా? గుజరాత్కా? రూ.400 ఉన్న సిలిండర్ను రూ.1200 కు పెంచి మహిళల ఉసురుపోసుకున్నందుకా? రూ.70 ఉన్న లీటర్ పెట్రోల్ రేటును రూ.110 చేసి సామాన్యుడిపై భారం మోపినందుకా? తెలంగాణకు ఒక్క విద్యాసంస్థనూ ఇవ్వకుండా ఉన్నందుకా? నల్లచట్టాలు తెచ్చి, 700 మంది రైతుల చావుకు కారణమైనందుకా? గిరిజనులకు 10శాతం రిజర్వేషన్ కల్పిస్తూ తీర్మానం చేసి పంపిస్తే, దాన్ని తొక్కి పెట్టినందుకా? చేనేత మీద పన్ను వేసిన మొట్టమొదటి ప్రధానమంత్రి మోదీ. ఆయన దేవుడెట్లయితడు?’ అని నిలదీశారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత 14 మంది ప్రధానులు రూ.56 లక్షల కోట్లు అప్పు చేస్తే.. నరేంద్ర మోదీ ఒక్కడే రూ.100 లక్షల కోట్లు అంటే రెండింతల అప్పు చేశాడని కేటీఆర్ విమర్శించారు. పుట్టబోయే శిశువుపైనా లక్ష రూపాయల అప్పు మోపిన ప్రధాని మోదీయేనని ధ్వజమెత్తారు. తెలంగాణ రాష్ట్రం చేసిన అప్పులు భవిష్యత్తు తరాలకు పెట్టుబడి.. మరి మోదీ అప్పులు చేసి ఏంచేసిండో చెప్పాలని నిలదీశారు. కేంద్రంలోని బీజేపీ సర్కార్ డీజిల్, పెట్రోల్ ధరలు పెంచుతుంటే, ఇక్కడి బీజేపీ నాయకులు మాత్రం ఆర్టీసీ చార్జీలు పెంచొద్దం టూ ఆందోళనకు దిగుతున్నరని మండిపడ్డారు. పెట్రోల్ చార్జీలు పెంచినోళ్లు ఆర్టీసీ బస్సులను నీళ్లతో నడుపమంటరా? అని మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. బీజేపీ నాయకులకు చెప్పులు మోయడమే తెలుసని, రాష్ట్ర అభివృద్ధికి నిధులు తేవడం చాతకాదని విమర్శించా రు.
‘ఎంపీగా గెలిచిన నాలుగేండ్లలో కరీంనగర్కు ఏం చేసినవ్? ట్రిపుల్ ఐటీ, నవోదయ పా ఠశాలలైనా తెచ్చినవా?’ అంటూ బండి సంజయ్పై ప్రశ్నల వర్షం కురిపించారు. వినోద్కుమార్ ఎంపీగా ఉన్నప్పుడు ట్రిపుల్ ఐటీ కోసం కొట్లాడి గుంజుకొచ్చినంత పనిచేశాడని గుర్తుచేశారు. ‘వేములవాడ రాజరాజేశ్వరస్వామి గుడి కి కనీసం మోదీతో రూ.10 చందా అయినా బండి సంజయ్ కట్టించలేకపోయిండు. దేశం మీద పడి మసీదులు తవ్వుతం, మందిరాలు కడుతం అంటూ లొల్లి తప్ప ఆయనకు ఇంకేం పని లేదు’ అని కేటీఆర్ విమర్శించారు. కొత్తగా ఏర్పడ్డ జిల్లాలకు నరేంద్రమోదీ మొండి చెయ్యి చూపెట్టినా సీఎం కేసీఆర్ మాత్రం ప్రతి జిల్లాలో మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేశారని కేటీఆర్ పేర్కొన్నారు. ‘బీజేపీ నాయకులారా.. పనిచేసేటోని కాళ్లల్ల కట్టెలు పెట్టుడు కాదు. మీకు దమ్ముంటే .. మాకన్నా ఎక్కువ పనులు చేసి, తెలంగాణ ప్రజల మనసు గెలుచుకోండి. రోజూ తెల్లారిలేచి కేసీఆర్ను తిడితేనో, బూతులు మాట్లాడితేనో ఓట్లు రావని గుర్తుంచుకోండి’ అని కేటీఆర్ హితవు పలికారు.
కరీంనగర్ పార్లమెంటు స్థానంపై గులాబీ జెండానే
సెస్ ఎన్నికల్లో గెలువలేని బీజేపీ, తెలంగాణలో జెండా పాతుతమని చెప్తున్నదని, కూట్లో రాయితీయనోడు ఏట్లో రాయితీస్తనని చెప్పినట్టుగా ఉందని కేటీఆర్ ఎద్దేవా చేశారు. ‘ఇన్నిరోజులు ఊరుకుంటుంటే.. ఎగురుడు, దుంకుడు ఎక్కువైంది. సెస్ ఎన్నికల్లో గెలువనోడు రాష్ట్రంలో గెలుస్తాడా?’ అంటూ బండి సంజయ్ని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో కరీంనగర్ పార్లమెంటుపై బీఆర్ఎస్ జెండా ఎగురవేసి పార్టీ దమ్మేందో చూపిస్తామన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా స్ఫూర్తిగా నిలిచి రాష్ట్రంలోని 33 జిల్లాలకు తొవ్వచూపెట్టిందని, ఇక్కడినుంచే బీఆర్ఎస్ విజయయాత్ర ప్రారంభిద్దామని పార్టీ శ్రేణులకు ఆయన పిలుపు నిచ్చారు. గుజరాత్ పైసలు ఎన్ని పంచినా.. రేపు శాసనసభ ఎన్నికల్లోనూ వందలు, వేల కోట్ల దొంగ సొమ్ము తెచ్చి పంచినా.. పనిమంతుడు, దక్షుడు, సమర్థుడు తెలంగాణ సాధకుడైన కేసీఆర్నే తిరిగి హ్యాట్రిక్ ముఖ్యమంత్రిగా చేయాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు.
‘బండి సంజయ్ రూ.5 కోట్లు తెచ్చి సెస్ ఎన్నికల్లో ఓటుకు రూ.మూడు, నాలుగు వేలు పంచాడని బీఆర్ఎస్ కార్యకర్తలు ఆందోళనకు గురయ్యారని.. మంచి చేసినోళ్లను, పనిమంతులను ప్రజలు గెలిపిస్తరని తాను ధైర్యం చెప్పానని కేటీఆర్ తెలిపారు. ‘దొంగకు నోరెక్కువన్నట్లు.. ఓటుకు వేల రూపాయలు పంచినోళ్లే ఉల్టా కేసీఆర్, బీఆర్ఎస్ నాయకులు డబ్బులు పంచిండ్రంటూ దుష్ప్రచారం చేసిండ్రు. పైసలు పంచింది వాళ్లే, దరిద్రపు పనులు చేసింది వాళ్లే’ అని మండిపడ్డారు. ఎన్నికలంటే ప్రభుత్వం, బీఆర్ఎస్ భయపడుతుందంటూ హేళన చేసినోళ్లకు సెస్ ఎన్నికలు చెంపపెట్టని చెప్పారు.
అభివృద్ధిలో దేశంలోనే నెంబర్వన్
అభివృద్ధిలో రాజన్న సిరిసిల్ల జిల్లా దేశానికే ఆదర్శంగా నిలిచిందని మంత్రి కేటీఆర్ తెలిపారు. డిసెంబర్లో కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన స్వచ్ఛ సర్వేక్షన్ ర్యాంకింగ్లో నెంబర్ వన్ స్థానంలో నిలిచిందని చెప్పారు. అలాంటి జిల్లాలో కొత్త రిజర్వాయర్లు, టెక్స్టైల్స్ పరిశ్రమలు వచ్చాయని, వ్యవసాయం విస్తరిస్తున్నదని, కొత్తకొత్త పరిశ్రమలు రాబోతున్నాయని వివరించారు. పెరుగుతున్న పరిశ్రమలకు అనుగుణంగా కరెంటు సరఫరా చేసేలా ఆలోచన చేయాలని మంత్రి సెస్ పాలకవర్గానికి సూచించారు. రాష్ట్రంలో సహకార రంగంలో ఉన్న ఒకే ఒక్క విద్యుత్ సంస్థ సిరిసిల్లలో ఉండడం మనందరికీ గర్వకారణమన్నారు. సంస్థను కాపాడుకుంటూ బలోపేతం చేసుకోవాలని పిలుపు నిచ్చారు. సెస్ పరిధిలో ప్రత్యేకమైన విద్యుత్తు ప్రణాళిక, మాస్టర్ ప్లాన్ను రూపొందించాలని, అందుకు ఎన్ని రూ.కోట్లయినా ప్రభుత్వం నుంచి ఇప్పించే బాధ్యత తనదేనని చెప్పారు. చొప్పదండి నియోజకవర్గంలో బీజేపీకి చెందిన రైతు చనిపోతే ఆయన కుటుంబ సభ్యులకు రూ.5 లక్షల రైతు బీమా చెక్కును స్వయంగా ఇంటికి వెళ్లి అందించిన ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ను కేటీఆర్ అభినందించారు. మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ఇంటింటికీ వెళ్లి కల్యాణలక్ష్మి చెక్కులను అందిస్తున్నాడని, తమది సంస్కారవంతమైన ప్రభుత్వమని పేర్కొన్నారు.
పంచాయితీ తెంపలేనోడు యుద్ధం ఆపిండంట..
‘కర్ణాటక, మహారాష్ట్ర కొట్టుకుంటున్నయ్. ఆ రెండు రాష్ర్టాలలో ఉన్నది బీజేపీ ప్రభుత్వమే. గీ పంచాయితీ తెంపలేని మొగోడు రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ఆపిండంట! ఇది మనం నమ్మాలని బండి సంజయ్ లొల్లి పెడుతున్నడు. ఇదేం లొల్లి? మోదీ కష్టపడి కరోనా వ్యాక్సిన్ కనిపెట్టిండని కేంద్రమంత్రి కిషన్రెడ్డి మునుగోడులో చెప్తే మనం నమ్మాల్నా? ఢిల్లీలో ఉన్నోడు ఫేకుడు. ఇక్కడున్నోడు జోకుడు.. బీజేపోళ్లకు ఇదే తెలుసు’ అని మంత్రి కేటీఆర్ విమర్శించారు.
నియామకాలు చేపట్టినా విమర్శలేనా?
‘దేశంలో ఎక్కడా లేని విధంగా 80 వేల ఉద్యోగాల కోసం నోటిఫికేషన్లు ఇచ్చుకుంటే.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అనే మాటేంది? ఉద్యోగాలిచ్చి యువతను బీజేపీకి దూరం చేస్తున్నరని అంటున్నడు. ఆయనకు తెలివి ఉన్నదా? మెదడున్నదా? అంటే రైతుబంధు, దళితబంధు ఇస్తే.. రేపటిరోజున రైతులను, దళితులను బీజేపీకి దూరం చేసే కుట్ర అని దిక్కుమాలిన ఆరోపణలు చేస్తడు. 46 లక్షల మందికి పింఛన్లు ఇస్తే ముసలోళ్లని బీజేపీకి దూరం చేసే కుట్ర అంటడని మండిపడ్డారు. నీళ్లు, నిధులు, నియామకాల కోసమే తెలంగాణ ఉద్యమం నడిచింది. ఈ రోజు రాష్ట్రం సాధించుకుని మన ఉద్యోగాలు మనం భర్తీ చేసుకుంటుంటే కూడా ఈ ఆరోపణలేందో? బీజేపీ నాయకులను ఏమనాల్నో కూడా అర్థమైతలేదు’ అని కేటీఆర్ చెప్పారు. తెల్లారిలేస్తే నోటికొచ్చిన బూతులు మాట్లాడితే ఓట్లు రావని చురకలంటించారు. బీజేపీ నేతలకు దమ్ముంటే.. చేతనైతే, సత్తా ఉంటే తమకన్నా ఎక్కువ మంచి పనులు చేసి, ప్రజల మనుసును గెలుచుకోవాలని హితవు పలికారు. బీఆర్ఎస్ గెలిస్తే సెస్ను బోర్డులో కలిపేస్తరంటూ బీజేపీ నేతలు చేసిన ప్రచారాన్ని ఆయన ఖండించారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం బోర్డులో కలిపేందుకు ప్రయత్నిస్తే కొట్లాడి సంస్థను కాపాడుకున్నది అప్పటి టీఆర్ఎస్ అని మంత్రి గుర్తు చేశారు.
‘కొదురుపాక గ్రామానికి మంత్రిగా రాలేదు.. మనుమడిగా వచ్చిన’ అని మంత్రి కేటీఆర్ తెలిపారు. తన తల్లి అసలు పేరు స్వరాజ్యమని ఆయన వెల్లడించారు. సిరిసిల్ల నుంచి బోయినపల్లి మండలం కొదురుపాకకు చేరుకున్న మంత్రి, తన అమ్మమ్మ, తాతయ్య జోగినిపల్లి లక్ష్మి-కేశవరావు జ్ఞాపకార్థం రూ.2 కోట్ల సొంత నిధులతో నిర్మించనున్న ప్రాథమిక పాఠశాల భవన పనులకు భూమిపూజ చేసి, అక్కడే అంగన్వాడీ భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి తన చిన్ననాటి విషయాలను గుర్తుచేసుకున్నారు.
‘కొదురుపాక గ్రామానికి చెందిన జోగినపల్లి కేశవరావు-లక్ష్మి దంపతుల పెద్ద మనుమడిని నేను. వాళ్ల కుమార్తె స్వరాజ్యం కుమారుడిని. మా అమ్మకు తాత స్వరాజ్యం అని పేరు పెడితే.. అందరూ రాజ్యం అని పిలిచేటోళ్లు. సిరిసిల్లకు, ఇంకో ఊరికో పోయినప్పుడు.. రాజ్యం మంచిగున్నదా అని అందరూ అడిగేటోళ్లు. నాకు మొదట అర్థం కాకపోయేది. తర్వాత, ఓహో ఇది మా అమ్మ పేరు కదా? అని అనుకునేవాడిని. పెళ్లయ్యాక మా అమ్మకు అత్తింటి వారు శోభ అని పేరు పెట్టుకున్నరు, ఆ పేరే మీ అందరికీ తెలిసిందే. నన్ను హైదరాబాద్ నుంచి కొదురుపాకకు తీసుకొస్తుండగా, కరీంనగర్లో దిగిన తర్వాత సర్వీసులో వచ్చి కొదురుపాక అడ్డా వద్ద దిగేవాళ్లం. అక్కడి నుంచి రిక్షా ఎక్కి ఊరిలో సుభాష్ బొమ్మ దగ్గర దిగి, ఇంటికి నడుచుకుంటూ వెళ్లేవాళ్లం. నేను పై చదువులకు అమెరికా వెళ్లినంక మా తాతగారు క్యాన్సర్తో చనిపోయారు. ఈ విషయాన్ని నేను రెండేండ్లకు ఇండియా వచ్చినంక మావాళ్లు చెప్పిండ్రు. ముందే చెప్తే చదువు మధ్యలో ఆపి వచ్చేస్తడేమోనని చెప్పలేదు. అమ్మమ్మ, తాతయ్య పేరుకు తగ్గట్టుగానే గ్రామంలో ప్రజలకు ఉపయోగపడే పనులు చేయాలని నిర్ణయించుకున్నాను. ఇప్పటికే వాళ్ల పేరుతో రైతువేదిక నిర్మాణం చేయించిన. ఆధునిక టెక్నాలజీతో సకల సౌకర్యాలు కలిగిన పాఠశాలను నిర్మిస్తా. శంకుస్థాపన కోసం మా అమ్మను రావాలని చెప్పిన. కానీ, పాఠశాల నిర్మాణం పూర్తయ్యాక వస్తానని చెప్పింది. 6 నుంచి 9 నెలల్లో బడి నిర్మాణం పూర్తవుతుంది. అప్పుడు మా ఆమ్మను తప్పకుండా తీసుకొస్తా’ అంటూ కేటీఆర్ వివరించారు.
ఈ కార్యక్రమాల్లో రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్, ఎమ్మెల్సీ ఎల్ రమణ, టెస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు, చొప్పదండి, మానకొండూరు ఎమ్మెల్యేలు సుంకె రవిశంకర్, రసమయి బాలకిషన్, టీపీటీడీసీ చైర్మన్ గూడూరి ప్రవీణ్, సెస్ చైర్మన్ చిక్కాల రామారావు, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య పాల్గొన్నారు.