BRS | హైదరాబాద్, డిసెంబర్ 25 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ పార్టీ వచ్చే నెల 3వ తేదీ నుంచి రాష్ట్రంలోని లోక్సభ నియోజకవర్గాల వారీగా సమీక్షలు నిర్వహించనున్నది. లోక్సభ నియోజకవర్గం పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు, పార్టీ ప్రతినిధులతో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమావేశం కానున్నారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను సమీక్షిస్తూనే రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించనున్నారు. సోమవారం తెలంగాణభవన్లో చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని ముఖ్యనేతలతో ఆయన సమావేశమయ్యారు. మాజీ మంత్రి పట్నం మహేందర్రెడ్డి, ఎంపీ రంజిత్రెడ్డి, ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, ప్రకాశ్గౌడ్, అరికెపూడి గాంధీ, కాలే యాదయ్య, మాజీ ఎమ్మెల్యేలు కొప్పుల మహేశ్రెడ్డి, మెతుకు ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. చేవెళ్ల నియోజకవర్గంలో మరోసారి గులాబీ జెండా ఎగురవేసేందుకు పార్టీ శ్రేణులు కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు. చేవెళ్ల లోక్సభ నియోజకవర్గం నుంచి ఈసారి బీఆర్ఎస్ అభ్యర్థిగా ఎంపీ జీ రంజిత్రెడ్డికే టికెట్ ఇవ్వనున్నట్టు కేటీఆర్ పార్టీ ముఖ్య నాయకులకు చెప్పినట్టు సమాచారం. సమావేశం ముగిసిన తరువాత ఇదే విషయాన్ని ఎంపీ రంజిత్రెడ్డి సహా పలువురు నేతలు ధ్రువీకరించారు.
నిరాశ చెందాల్సిన పనిలేదు
రాష్ట్రంలో అధికారం చేపట్టకపోయినంత మాత్రాన, ఎమ్మెల్యే అభ్యర్థులు ఓడిపోయినంత మాత్రాన పార్టీ నాయకులు, కార్యకర్తలు నిరాశచెందాల్సిన పనిలేదని కేటీఆర్ గులాబీ శ్రేణులకు చెప్పారు. రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజమని పేర్కొన్నారు. పదేండ్లపాటు ప్రజలకు సేవ చేసే అవకాశాన్ని, అదృష్టాన్ని ఇస్తే అద్భుతాలు సృష్టించామని తెలిపారు. పార్టీలో అన్ని స్థాయిల్లో ఓటమికి కారణాలను విశ్లేషించుకొని ప్రజాభీష్టం మేరకు పార్టీ నడుచుకునే రీతిలో కార్యాచరణ ఉంటుందనే విశ్వాసాన్ని పార్టీ శ్రేణులకు కల్పించారు. చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని పార్టీ శ్రేణులు ఎక్కడికక్కడ, ఎవరికివారు ద్విగుణీకృత ఉత్సాహంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.
నియోజకవర్గం పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులకు వచ్చిన ఓట్లు, కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులకు వచ్చిన ఓట్లు పరిశీలించి, అక్కడక్కడ ఉన్న గ్యాప్ను పూడ్చుకోవాలని సూచించారు. చేసిన తప్పులు తిరిగి చేయకుండా, అన్నిస్థాయిల నాయకులు, కార్యకర్తలతో సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగాలని దిశానిర్దేశం చేశారు. అసెంబ్లీ నియోజకవర్గాలవారీగా సమావేశాలు నిర్వహించి కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకోవాలని సూచించారు. లోక్సభ నియోజకవర్గాల పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు, ఓడిపోయిన ఎమ్మెల్యే అభ్యర్థులే ఇన్చార్జీలుగా ఉంటారని పేర్కొన్నట్టు తెలిసింది.
బీఆర్ఎస్కు లక్ష ఓట్లు ఆధిక్యం
గత అసెంబ్లీ ఎన్నికల్లో చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్కు దాదాపు లక్ష ఓట్ల ఆధిక్యం లభించింది. చేవెళ్ల పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజకర్గాలు ఉండగా, నాలుగు చోట్ల బీఆర్ఎస్, మూడు చోట్ల కాంగ్రెస్ విజయం సాధించాయి. తాండూరు, పరిగి, వికారాబాద్లో కాంగ్రెస్ గెలుపొందగా, మహేశ్వరం, రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి, చేవెళ్లలో బీఆర్ఎస్ అభ్యర్థులు గెలిచారు. మహేశ్వరం, రాజేంద్రనగర్ మినహా మిగిలిన ఐదు చోట్ల బీజేపీ తృతీయస్థానానికే పరిమితమైంది.
స్పష్టమైన వ్యూహంతో ముందుకు: ఎంపీ రంజిత్రెడ్డి
చేవెళ్ల లోక్సభ నియోజకవర్గంలో గెలుపు కోసం స్పష్టమైన వ్యూహంతో ముందుకు సాగుతామని ఎంపీ రంజిత్రెడ్డి పేర్కొన్నారు. కేటీఆర్తో సమావేశమైన తరువాత తెలంగాణభవన్లో మీడియాతో మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో చేవెళ్ల నుంచి తనకే టికెట్ ఇవ్వాలని పార్టీ నిర్ణయించిందని చెప్పారు. గెలుపే లక్ష్యంగా పనిచేయాలని కేటీఆర్ దిశానిర్దేశం చేశారని తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రజలకు 412 హామీలు ఇచ్చిందని, వాటిని అమలు చేయాలని కోరారు. బీజేపీ, కాంగ్రెస్ రెండు పార్టీలు ఒక్కటై బీఆర్ఎస్పై పదే పదే అసత్య ప్రచారాలు చేస్తున్నాయని ఆరోపించారు. అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన లోటుపాట్లను సవరించుకొని తిరిగి ప్రజా ఆశీర్వాదం పొందుతామని చెప్పారు.
చేవెళ్ల లోక్సభ నియోజకవర్గం పరిధిలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీల వారీగా వచ్చిన ఓట్లు
బీఆర్ఎస్ : 7,06,578
కాంగ్రెస్ : 6,07,693
బీజేపీ : 3,34,628
బీఆర్ఎస్ ఆధిక్యం: 98,885