KTR | కల్వకుంట్ల తారక రామారావు నేతృత్వంలోని బీఆర్ఎస్ నేతల బృందం ఢిల్లీలో కేంద్రమంత్రులను కలిసింది. యూజీసీ ముసాయిదా నిబంధనలపై కేంద్రానికి బీఆర్ఎస్ నేతలు కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్కు వినతిపత్రం సమర్పించింది. ఆ తర్వాత 365బీ జాతీయ రహదారిని సూర్యాపేట-సిరిసిల్ల రహదారిని కోరుట్ల వరకు విస్తరించాలంటూ నితిన్ గడ్కరీని కోరింది. అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. యూజీసీ నిబంధనల పేరుతో రాష్ట్రాల హక్కులను హరిస్తున్నారని ఆరోపించారు. నూతన నిబంధనలతో విద్యార్థులకు నష్టం జరుగుతుందన్నారు. మా అభిప్రాయాలు తెలియజేసేందుకు కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ను కలిసినట్లు తెలిపారు. రాష్ట్ర విశ్వవిద్యాలయాల్లో వీసీల నియామకానికి సంబంధించిన సెర్చ్ కమిటీల బాధ్యతను రాష్ట్ర గవర్నర్ల ద్వారా కేంద్రం నియంత్రించడం రాజ్యాంగ స్ఫూర్తికి విరూద్దమన్నారు.
సెర్చ్ కమిటీల బాధ్యతలను గవర్నర్కు అప్పగించేలా నిబంధనలు రూపొందించారన్నారు. సమాఖ్య స్ఫూర్తిని దెబ్బతీసేలా వ్యవహరిస్తూ.. కొత్త నిబంధనలు రూపొందించారని.. గవర్నర్ల ద్వారా వర్సిటీలను కేంద్రం తమ ఆధీనంలోకి తీసుకోవాలని అనుకుంటుందని ఆరోపించారు. నూతన నిబంధనలతో ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు అన్యాయం జరుగుతుందన్నారు. యూజీసీ నిబంధనలపై అభ్యంతరాలను ఆరు పేజీలతో నివేదిక కేంద్రమంత్రికి ఇచ్చినట్లు వివరించారు. నిబంధనలను సవరించాలని మంత్రిని కోరామన్నారు. ఇలా సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా నిర్ణయం తీసుకోవద్దని చెప్పామన్నారు. అలాగే, జాతీయ రహదారి 365బీని పొడిగించాలని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీని కోరామన్నారు. ఇక పార్టీ పిరాయింపు ఎమ్మెల్యేలపై వేటు పడాల్సిందేనన్నారు. అనర్హత వేటు పిటిషన్లపై న్యాయవాదులతో చర్చలు జరుపుతున్నట్లు తెలిపారు.