రాష్ట్రంలో కంపెనీ వ్యాపారాభివృద్ధిపై చర్చ
హైదరాబాద్, జూన్ 9 (నమస్తే తెలంగాణ): బోయింగ్ సంస్థ చీఫ్ స్ట్రాటజీ అధికారి మార్క్ అలెన్, బోయింగ్ ఇండియా అధ్యక్షుడు సలీల్ గుప్తాతో రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కే తారకరామారావు గురువారం ఢిల్లీలో సమావేశమయ్యారు. తెలంగాణలో బోయింగ్ సంస్థ ఉత్పత్తులతో పాటు భవిష్యత్తులో ఇక్కడ వ్యాపారాభివృద్ధికి ఉన్న అవకాశాలపై చర్చించారు. అనంతరం సమావేశానికి సంబంధించిన ఫొటోలను, బోయింగ్ ప్రతినిధులతో ఉన్న పరిచయాన్ని కేటీఆర్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. 2015లో మార్క్ను అమెరికాలో మొదటిసారి కలిశానని, అప్పటినుంచి వివిధ సందర్భాల్లో ఆయనతో సమావేశమయ్యానన్నారు.
హైదరాబాద్లో బోయింగ్ తయారీ యూనిట్ ఏర్పాటులో మార్క్ ఎంతగానో సహాయపడ్డారని వివరించారు. కాగా, విమానాల తయారీలో ప్రపంచ ప్రఖ్యాత సంస్థ బోయింగ్.. టాటా కంపెనీతో కలిసి 2016లో ఆదిభట్లలో 14 వేల చదరపు మీటర్ల వైశాల్యంలో విడిభాగాల తయారీ యూనిట్కు శంకుస్థాపన చేసింది. 2018లో మొదటి అపాచీ ఫ్యూజ్లేజ్ను ఇక్కడి నుంచి ఉత్పత్తి చేసింది. ఏహెచ్-64 అపాచీ హెలికాప్టర్ల బాడీ, విడిభాగాలను ఇక్కడ ఉత్పత్తి చేసి వివిధ దేశాలకు ఎగుమతి చేస్తున్నారు. దేశ రక్షణ రంగానికి విడిభాగాలనూ ఇక్కడి నుంచే ఉత్పత్తి చేస్తున్నారు. 2021 జూలైలో ఏహెచ్-64 అపాచీ కంబాట్ హెలికాప్టర్కు 100వ ఫ్యూజ్లేజ్ను ఇక్కడి నుంచి సరఫరా చేశారు. బోయింగ్కు సంబంధించి టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ లిమిటెడ్తో ఏర్పాటైన ఈ జాయింట్ వెంచర్ భారత్లో తొలి ఈక్విటీ జాయింట్ వెంచర్ కావటం విశేషం. 737 బోయింగ్ విమానాలకు అవసరమైన పరికరాలను ఇక్కడి నుంచే ఉత్పత్తి చేయనున్నట్టు ఇటీవలే బోయింగ్ ప్రకటించింది.
ఢిల్లీ పర్యటనలో ఉన్న మంత్రి కేటీఆర్.. గురువారం బోయింగ్ చీఫ్ స్ట్రాటజీ అధికారి మార్క్ ఆలెన్, బోయింగ్ ఇండియా ప్రెసిడెంట్ సలీల్ గుప్తాలను ఒక వేడుకలో కలుసుకున్నారు. భవిష్యత్తులో తెలంగాణలో బోయింగ్ వ్యాపార అభివృద్ధి అవకాశాలపై చర్చించారు. తమ పాత పరిచయాన్ని గుర్తు చేసుకుంటూ ఆలెన్ను 2015లో అమెరికాలో కలుసుకున్నప్పటి ఈ ఫొటోను ట్విట్టర్లో పంచుకున్నారు.