KTR | క్యాతనపల్లి మున్సిపాలిటీ కోసం మంత్రి వివేక్ ఎన్ని అడ్డదారులు తొక్కినా.. ఎంత భయపెట్టినా బీఆర్ఎస్ కౌన్సిలర్లు లొంగలేదని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. మొక్కవోని ధైర్యంతో అధికార బలానికి ఎదురొడ్డి నిలిచి, ప్రజాస్వామ్యాన్ని గెలిపించారని వ్యాఖ్యానించారు.
మంచిర్యాల జిల్లాలో బీఆర్ఎస్ కారకర్తల సమావేశంలో కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. క్యాతనపల్లి మున్సిపాలిటీలో బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా ప్రజలు తీర్పునిచ్చారని కానీ.. మంత్రి వివేక్ అధికార మదంతో కౌన్సిలర్లను భయభ్రాంతులకు గురిచేశారని తెలిపారు. పోలీసులను అడ్డం పెట్టుకుని అడ్డమైన కేసులు పెట్టించి, బాల్క సుమన్ను జైలుకు పంపించారని పేర్కొన్నారు. మంత్రి వివేక్ వెంకటస్వామి ఎన్ని అడ్డదారులు తొక్కినా.. ఎంత భయపెట్టినా.. బీఆర్ఎస్ కౌన్సిలర్లు అదరలేదని అన్నారు. 51 రోజుల పాటు ఎన్ని ప్రలోభాలకు గురిచేసినా.. మొక్కవోని ధైర్యంతో అధికార బలానికి ఎదురొడ్డి నిలిచి బీఆర్ఎస్ కౌన్సిలర్లు పోరాటం చేశారని పేర్కొన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థను గెలిపించారని అన్నారు.
16 రోజుల పాటు క్యాతనపల్లి మున్సిపాలిటీ కోసం బాల్క సుమన్ను ఇబ్బంది పెట్టారని కేటీఆర్ అన్నారు. కానీ క్యాతనపల్లిలో ప్రజాస్వామ్యం గెలిచిందని కేటీఆర్ తెలిపారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని ప్రజల తీర్పును కాలరాయాలని చూస్తున్నారని మండిపడ్డారు. బాల్క సుమన్పై అక్రమ కేసులు పెట్టి రాక్షసానందం పొందారని విమర్శించారు. అంతకుముందు అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పి మోసం చేశారని ధ్వజమెత్తారు.
సింగరేణి సంపదను కాపాడాల్సింది పోయి.. దేశంలోనే ఎక్కడా లేని విధంగా సైట్విజిట్ సర్టిఫికెట్ తెచ్చి రేవంత్ రెడ్డి, ఆయన బావమరిది కలిసి వేల కోట్ల సింగరేణి సంపదను కొల్లగొడుతున్నారని కేటీఆర్ మండిపడ్డారు. నీకు దమ్ముంటే నీ బామ్మర్దిపై సిట్, ఏసీబీ విచారణ జరిపించు అని సవాలు విసిరారు. బీజేపీ, కాంగ్రెస్ ఇద్దరూ తోడు దొంగలే అని విమర్శించారు. రేవంత్ రెడ్డి తన బావమరిదితో కలిసి సింగరేణిని కొల్లగొడుతుంటే.. బీజేపీ అడ్డుకోకుండా కాపాడుతుందని తెలిపారు. బీజేపీ ఎంపీలకు రేవంత్ రెడ్డి, రేవంత్ బామ్మర్దికి బీజేపీ టెండర్లు కట్టబెడుతూ ఒకరినొకరు కాపాడుకుంటున్నారని చెప్పారు. కాంగ్రెస్ అవినీతిపై ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా కేవలం మాటలు చెబుతున్నారు తప్ప.. విచారణ జరిపించడం లేదని అన్నారు.