హైదరాబాద్ సిటీబ్యూరో/ రంగారెడ్డి, ఫిబ్రవరి 27 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలను మార్చి 17లోగా నెరవేర్చకపోతే ఆ పార్టీని బొంద పెట్టాల్సిందేనని మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు పిలుపునిచ్చారు. ప్రజలకు ఇచ్చిన 420 హామీలను ఆమలు చేసేదాకా వెంటాడి, వేటాడుతామని హెచ్చరించారు.
మంగళవారం ఆయన అంబర్పేట, ఇబ్రహీంపట్నం నియోజకవర్గ కార్యకర్తల సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఎన్నికల ముందు అందరికీ ఇస్తామని చెప్పి, ఇప్పుడు కొందరికే అంటున్నారని విమర్శించారు. రేషన్కార్డు లేకున్నా, బైక్ ఉన్నా వారికి పథకాలు రావని కోతలు పెడుతున్న రేవంత్రెడ్డి తోకను ప్రజలే కత్తిరిస్తారని హెచ్చరించారు.
రాష్ట్రంలోని 1.34 కోట్ల మందికి 200 యూనిట్ల కరెంటు, 1.24 కోట్ల మందికి రూ.500కే గ్యాస్ ఇచ్చి తీరాల్సిందేనని డిమాండ్ చేశారు. కాంగ్రెస్లో ఎవరికి వారే ముఖ్యమంత్రిలా తయారయ్యారని ఎద్దేవా చేశారు. ఎవరి దుకాణం వాళ్లు తెరిచారని, కోమటిరెడ్డిది ఒక దుకాణమైతే రేవంత్రెడ్డిది మరో దుకాణమని విమర్శించారు. ఆరు నుంచి తొమ్మిది నెలల్లో వాళ్లలో వాళ్లే తన్నుకు చస్తారని, కాంగ్రెస్ పార్టీ నైజం అదేనని చెప్పారు.
గుంపు మేస్త్రీ పాలనతో కేసీఆర్ గొప్పదనం తెలుస్తది
గుంపు మేస్త్రీ పాలన చూస్తేనే ప్రజలకు అనుభవపూర్వకంగా కేసీఆర్ గొప్పదనం తెలుస్తున్నదని కేటీఆర్ పేర్కొన్నారు. కరెంటు పోతే ప్రజలు కేసీఆర్నే గుర్తుకు తెచ్చుకుంటున్నారని పేర్కొన్నారు. రేవంత్రెడ్డిని చూసి ‘గీననా.. సీఎం’ అని ప్రజలు అనుకుంటున్నారని, ఆయన మాటలు ఎవరికీ నమ్మబుద్ధి కావడంలేదని పేర్కొన్నారు. కాంగ్రెస్ వైఫల్యాలను ప్రజలకు వివరించాలని, ప్రాజెక్టులపై ఆ పార్టీ వైఖరిని ఎండగట్టాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులో 90% పనులను బీఆర్ఎస్ హయాంలో పూర్తి చేశామని, కేవలం కాలువలు తవ్వితే నీరు ఇవ్వొచ్చని, ఆ తెలివి కూడా కాంగ్రెసోళ్లకు లేదని విమర్శించారు.
హైదరాబాద్ ప్రజల రుణం తీర్చుకోలేం
హైదరాబాద్ వాసులు బీఆర్ఎస్ హయాంలో జరిగిన అభివృద్ధిని చూసి అక్కున చేర్చుకున్నారని వారి రుణం తీర్చుకోలేనిదని కేటీఆర్ పేర్కొన్నారు. ఇక్కడి కార్యకర్తలు కష్టపడి 16 సీట్లు సాధించారని, ఇదే స్పూర్తితో వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో చైతన్యాన్ని ప్రదర్శించాలని పిలుపునిచ్చారు. రాబోయే రోజుల్లో ఉద్యమస్ఫూర్తిని మరోసారి చాటాలని పిలుపునిచ్చారు.
కిషన్రెడ్డిపై కేటీఆర్ ఫైర్
ఐదేండ్లుగా కేంద్రమంత్రి కిషన్రెడ్డి రాష్ర్టానికి ఒక్క పైసా తెలేదని కేటీఆర్ విమర్శించారు. కరోనా వస్తే కుర్కురే ప్యాకెట్లు పంచడం తప్ప కిషన్రెడ్డి చేసిందేమీ లేదని ఎద్దేవాచేశారు. గత పదేండ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం 36 ప్రాజెక్టులు చేపట్టిందని, అయితే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అంబర్పేట, ఉప్పల్ ఫ్లై ఓవర్లు పూర్తి చేయలేకపోయిందని విమర్శించారు. బీజేపీకి, బీఆర్ఎస్కీ తేడా ఇదేనని వివరించారు.
భువనగిరి, సికింద్రాబాద్ గెలుపునకు కసితో పనిచేయాలి
భువనగిరి, సికింద్రాబాద్ ఎంపీ స్థానాల్లో బీఆర్ఎస్ గెలుపు కోసం పార్టీ శ్రేణులు కసితో పనిచేయాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ హయాంలో ఇబ్రహీంపట్నం నియోజకవర్గం ఎంతో అభివృద్ధి చెందిందని, పెద్ద ఎత్తున పరిశ్రమలు ఏర్పాటయ్యాయని వివరించారు. సమావేశంలో ఎమ్మెల్యేలు కాలేరు వెంకటేశ్, ముఠా గోపాల్, బీ లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ మహమూద్ అలీ, సికింద్రాబాద్ నియోజకవర్గ బీఆర్ఎస్ ఇన్చార్జి తలసాని సాయికిరణ్, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్రెడ్డి, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్సీ ఎగ్గే మల్లేశం, ఎమ్మెల్యేలు కాలే యాదయ్య, అరికపూడి గాంధీ తదితరులు పాల్గొన్నారు.