నాగర్కర్నూల్, జూన్ 18 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ పార్టీ కాలం చెల్లిన మందు వంటిదని, దానికి చరిత్ర తప్ప భవిష్యత్తు లేదని ఐటీ, మున్సిపల్ శాఖల మంత్రి కే తారకరామారావు అన్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీని 3 రోజులు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తీసుకెళ్లినా ఆ పార్టీలో ప్రశ్నించే దమ్ము లేదని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ చావడానికి సిద్ధంగా పాడె మీద ఉన్నదని పేర్కొన్నారు. మంత్రి కేటీఆర్ శనివారం నాగర్కర్నూల్ జిల్లాలో పర్యటించారు. బిజినేపల్లి మండలం శాయిన్పల్లిలో రూ.76 కోట్లతో నిర్మించనున్న మార్కండేయ లిఫ్ట్ పనులతోపాటు కొల్లాపూర్లో రూ.147 కోట్లతో చేపట్టిన గోపాల్దిన్నె లింక్ కెనాల్ సహా రూ.700 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు.
అనంతరం కొల్లాపూర్, బిజినేపల్లి బహిరంగ సభల్లో మాట్లాడుతూ.. ఐదు దశాబ్దాలపాటు దేశాన్ని పాలించి ఏమీ చేయలేకపోయిన కాంగ్రెస్.. ఇప్పుడు మళ్లీ ఒక చాన్స్ అంటూ ప్రజలను అడుగుతున్నదని కేటీఆర్ విమర్శించారు. ‘కాంగ్రెస్ ఎన్ని డైలాగులు కొట్టినా ఒక్కటి మాత్రం పక్కా.. అది కాలం చెల్లిన మందులాంటిది. భూమి పుట్టినప్పుడు పుట్టింది. కాంగ్రెస్కు చరిత్ర తప్ప భవిష్యత్తు సున్నా’ అని పేర్కొన్నారు. బీజేపీ నేతలు దేశంలో విషం, విద్వేషం నింపేలా మాట్లాడుతున్నారని విమర్శించారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇంధనం, నిత్యావసర ధరలు విపరీతంగా పెంచుతూ సామాన్యులపై పెనుభారం మోపుతున్నదని ధ్వజమెత్తారు. వంటగ్యాస్ సిలిండర్ ధర గతంలో రూ.400 ఉంటే, బీజేపీ పాలనలో రూ.1,050కి చేరిందని అన్నారు. ప్రధాని మోదీ దేశ ప్రజలకు ఇచ్చిన ఒక్క హామీనీ నెరవేర్చలేదని కేటీఆర్ ఆరోపించారు. ‘మోదీ ప్రభుత్వం రాకముందు మిత్రోం, భాయియోం, బహెనో.. ఆప్ సభీ లోగ్ జన్ ధన్ ఖాతా ఖోలో.. మై ధనాధన్ పంద్రాలాఖ్ ఇస్తా అన్నడు. స్విస్ బ్యాంకుల నుంచి నల్లధనం తెస్తా అన్నడు. ప్రతి ఒక్కరికీ రూ.15 లక్షలు ఇస్తా అన్నడు.. ఏదయ్యా మోదీ? ఇప్పుడు నల్లధనమంటే తెల్లమొఖం వేసుకొని తిరుగుతున్నడు’ అని ఎద్దేవా చేశారు.
సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణలో అభివృద్ధి పరుగులు పెడుతున్నదని మంత్రి కేటీఆర్ తెలిపారు. ‘జూలై, ఆగస్టులో ఇంటింటికీ వస్తాం.. అర్హులుంటే ఆన్ ది స్పాట్ పెన్షన్ల్లు ఇస్తాం.. రేషన్ కార్డులూ ఇస్తాం’ అని వెల్లడించారు. రాష్ర్టానికి కుల పిచ్చోళ్లు.. మత పిచ్చోళ్లు వద్దని ప్రజలకు సూచించారు. ‘కాంగ్రెస్కు కులపిచ్చి.. ఒకే వర్గానికి ఓట్లు వేయండి, ఆ వర్గానికే పగ్గాలు అప్పజెప్పండి అని ఆ పార్టీ నాయకులు పనికిమాలిన మాటలు చెప్తున్నరు. బీజేపీ అస్తవ్యస్త ఆలోచనలతో దేశాన్నే రావణ కాష్టంలా మార్చింది. తెల్లారి లేస్తే హిందూ-ముస్లిం మాటలు, పక్కవాడిని పగవాడిగా చూపించడం, మతాలను కించపర్చేలా చిల్లర మాటలు.. ఒక్కటంటే ఒక్క అర్థవంతమైన పని చేసిందా..?’ అని ధ్వజమెత్తారు. దేశంలోని ఏ రాష్ట్రంలోనూ కేసీఆర్ మార్క్ పాలన లేదని అన్నారు. కేటీఆర్ వెంట మంత్రులు నిరంజన్రెడ్డి, శ్రీనివాస్గౌడ్, ఎంపీ రాములు, విప్ గువ్వల బాలరాజు, ఎమ్మెల్యేలు బీరం హర్షవర్ధన్రెడ్డి, మర్రి జనార్దన్రెడ్డి, లక్ష్మారెడ్డి, ఆల వెంకటేశ్వర్రెడ్డి, ఎమ్మెల్సీలు కూచకుళ్ల దామోదర్రెడ్డి, కశిరెడ్డి నారాయణరెడ్డి తదితరులు ఉన్నారు.
తెలంగాణ ఏర్పడ్డాక కొల్లాపూర్లో బీమా ప్రాజెక్టు కింద 48 వేల ఎకరాల భూమి సాగవుతున్నదని మంత్రి నిరంజన్రెడ్డి తెలిపారు. జొన్నలబొగుడ రిజర్వాయర్ పూర్తయ్యాక 52 వేల ఎకరాలకు నీరందుతున్నదని, గుడిపల్లి రిజర్వాయర్ నుంచి పెద్దకొత్తపల్లికి నీరు పారుతున్నదని చెప్పారు. చిన్నంబావి, వీపనగండ్లలో 25 వేల ఎకరాలు సాగులోకి వచ్చాయని వివరించారు. సింగోటం నుంచి నీళ్లు తరలిస్తే బాగుంటుందని సీఎం కేసీఆర్ను ఒప్పించి.. సింగోటం-గోపల్దిన్నె లింక్ కెనాల్కు కేటీఆర్ శంకుస్థాపన చేశారని చెప్పారు.
దేశం బాగుండాలని ఆలోచించే ఏకైక వ్యక్తి సీఎం కేసీఆరేనని మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. అందుకే దేశానికి కేసీఆర్ వంటి నాయకుడు కావాలని అందరూ కోరుతున్నారని చెప్పారు. కేంద్రం తెలంగాణపై సవతితల్లి ప్రేమ చూపిస్తున్నదని ధ్వజమెత్తారు. జాతీయ పార్టీల నాయకుల్లో ఒకాయనకు కులం పిచ్చి, మరొకాయనకు మతం పిచ్చి పట్టుకున్నదని దుయ్యబట్టారు.
కొల్లాపూర్, జూన్ 18: కొల్లాపూర్ పట్టణంలో శనివారం పర్యటించిన మంత్రి కేటీఆర్ మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు ఇంటికి వెళ్లి పలకరించారు. ఇద్దరు నేతల కలయిక జిల్లాలో పెద్ద రాజకీయ చర్చకు దారితీసింది. కేటీఆర్ వెంట మంత్రులు సింగిరెడ్డి నిరంజన్రెడ్డి, శ్రీనివాస్గౌడ్, ఎంపీ రాములు ఉన్నారు.
హైదరాబాద్, జూన్ 18 (నమస్తే తెలంగాణ): డబుల్ ఇంజిన్ సర్కారుతో అభివృద్ధి అంటూ గొప్పలు చెప్తున్న బీజేపీకి మంత్రి కేటీఆర్ గట్టి కౌంటర్ ఇచ్చారు. ఒక్కొక్కరి ఖాతాలో రూ.15 లక్షలు వేస్తామన్న ప్రధాని మోదీ హామీని గుర్తుచేశారు. ‘మోదీజీ మీకో సువర్ణ అవకాశం. డబుల్ ఇంజిన్ ట్రిక్ చేసి ప్రతి ఒక్కరి ఖాతాలో రూ.30 లక్షలు జమ చేయండి’ అని ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా నల్లధనంపై మోదీ చేసిన ట్వీట్లను గుర్తు చేశారు. విదేశాల్లోని నల్లధనాన్ని వెనక్కి తీసుకొచ్చేందుకు ప్రధాని మోదీ 2009లో క్యాంపెయినింగ్ ప్రారంభించిన ట్వీట్ను, విదేశాల్లోని నల్లధనాన్ని తీసుకొచ్చేందుకు చట్టం తెచ్చామంటూ 2015లో చేసిన ట్వీట్ను జతచేశారు. స్విట్జర్లాండ్ బ్యాంక్ తాజా నివేదికల ప్రకారం భారతీయుల ఖాతాల్లోని డబ్బు 50% పెరిగిందని, మొత్తం రూ.30 వేల కోట్లకు చేరిందని, 14 ఏండ్లలో ఇదే గరిష్ఠమని పీటీఐ చేసిన ట్వీట్ను కేటీఆర్ జతచేశారు.