విమర్శ అనేది.. హుందాతనాన్ని చూపాలి
ప్రతిపక్ష తీరును ప్రదర్శించాలి
ప్రజలకు మంచి చేసేలా ఉండాలి
భావి తరాలకు మార్గదర్శి కావాలి
కానీ.. రాజకీయంగా ఎదుర్కొనటం చేతగాక..
ప్రత్యర్థిని ఫేస్ టు ఫేస్ ప్రశ్నించే దమ్ములేక..
సిగ్గులేక పిల్లలపై విద్వేషపు వ్యాఖ్యలా?
ఛీ.. ఛీ.. ఇదేనా బీజేపీ రాజకీయం..
ఛీ.. ఛీ.. ఇదేనా మీ పార్టీ సంస్కారం..
హైదరాబాద్, డిసెంబర్ 24 (నమస్తే తెలంగాణ): టీఆర్ఎస్ను రాజకీయంగా ఎదుర్కొనే సత్తాలేని కొందరు.. ఆ పార్టీ అగ్రనేతలపై అభ్యంతరకర ప్రచారాలకు దిగుతున్నారు. రాజకీయ విలువల్ని దిగజారుస్తూ కుటుంబసభ్యులు, పిల్లల్ని కూడా ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావును రాజకీయంగా ఎదుర్కొనే ధైర్యం లేక బీజేపీ నాయకులు నీచపు పనులకూ వెనుకాడటం లేదు. కుటుంబాన్ని, పిల్లలను దూషిస్తూ జనాలతో ఛీ కొట్టించుకొంటున్నారు. సభ్యత, సంస్కారం లేకుండా మాట్లాడుతూ మరింత దిగజారుతున్నారు. ఇటీవల బీజేపీలో చేరిన తీన్మార్ మల్లన్న తన యూట్యూబ్ చానల్లో మంత్రి కేటీఆర్ కుమారుడు హిమాన్షుపై అభ్యంతకరంగా పోల్ పెట్టారు.
‘అభివృద్ధి ఎక్కడ జరిగింది..?
భద్రాచలం గుడిలోనా..?
హిమాన్షు శరీరంలోనా..?’
దీన్ని చూసిన ఓ నెటిజన్ ‘ఫ్యామిలీ మెంబర్ మీద ఇంత దిగజారి పోల్స్ పెడుతుండు ఈ మల్లిగాడు. మీరు చూస్తూ కూర్చోండి అన్నా” అంటూ మంత్రులు కేటీఆర్, హరీశ్రావుకు ట్యాగ్ చేశారు. తీవ్రంగా స్పందించిన మంత్రి కేటీఆర్.. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు ట్వీట్ చేశారు. ‘శ్రీ జేపీ నడ్డా జీ.. తెలంగాణలోని బీజేపీ నేతలకు మీరు నేర్పుతున్నది ఇదేనా? బీజేపీ బాకాల నీచమైన రాజకీయ వ్యాఖ్యాల్లోకి నా కుమారుడిని లాగటం, బాడీ షేమింగ్ చేయటం సంస్కారమా? అమిత్షా విషయంలోనూ మేము ఇలాగే చేయొచ్చా? మోదీ కుటుంబంపై ఇలాగే మాట్లాడొచ్చా? దాని గురించి మీరు ఎప్పుడూ ఆలోచించలేదా?’ అని ట్వీట్లో నిప్పులు చెరిగారు.
‘దురదృష్టవశాత్తు వాక్/భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ అనేది ఇతరులను తిట్టడానికి, వారిపై బురద జల్లటానికి ఒక హక్కుగా మారిపోయింది. సోషల్ మీడియా జర్నలిజం ముసుగులో విచ్చలవిడిగా అసత్యాలు, వదంతులు, చెత్తను ప్రచారం చేస్తున్నారు. సామాజిక మాధ్యమాలు సంఘ విద్రోహ చర్యలకు అడ్డాగా మారాయి. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా వేదికగా కొందరు కించిత్ సిగ్గు లేకుండా, ఎలాంటి రుజువు లేకుండా దుర్మార్గమైన, నిరాధార ఆరోపణలు చేస్తుంటే.. అప్పుడప్పుడు నాకు అనిపిస్తుంది.. ప్రజాజీవితం లో ఉండటానికి అర్థం ఉన్నదా? అని. జర్నలిజం ముసుగులో 24 గంటలు చెత్త ప్రసారం చేసే యూట్యూబ్ చానళ్లు ఆ చెత్తలోకి పిల్లలను లాగుతున్నాయి. ఈ థర్డ్ రేట్ నాయకులు, బీజేపీ బాకాలు నా పిల్లలపై నేరపూరిత వ్యాఖ్యలు చేయకుండా దయచేసి అడ్డుకోండి. లేదంటే మేం చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి వస్తుంది. మేము కూడా ఇదే స్థాయిలో ప్రతిస్పందించాల్సి వస్తుంది. ఆ తర్వాత మాపై నింద మోపొద్దు.’ అని వరుస ట్వీట్లు చేశారు.
బీజేపీ దిగజారుడు వ్యాఖ్యలపై నెటిజన్లు, టీఆర్ఎస్ నాయకులు, కేటీఆర్ అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రిటైర్డ్ ఐఏఎస్, ఏపీ మాజీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు స్పందిస్తూ.. ఇలా బురద జల్లేవారిని శిక్షించకుండా అలాగే వదిలేయాలా.. ప్రభుత్వంలో ఉన్న మీకు ఇది ప్రధాన సమస్యగా మారింది అని ట్వీట్ చేశారు. ‘చిన్నపిల్లలను అడ్డంపెట్టుకొని రాజకీయాలు చేసే నీలాంటి వాళ్లను ఏం అనాలి.. ఒకరి పిల్లల గురించి మాట్లాడే ముందు నీ ఇంట్లో కూడా పిల్లలు ఉన్నారనేది గుర్తించుకో చింతపండు నవీన్; 75 రోజులు జైలు శిక్ష అనుభవించిన నేరస్థుడు; రాజకీయ ప్రయోజనాల కోసం పిల్లలను టార్గెట్ చేయటం చేతకాని తనానికి నిదర్శనం’ అని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. తీన్మార్ మల్లన్న రాజకీయంగా టీఆర్ఎస్ పార్టీని ఎదురొనే సత్తా లేక సీఎం కేసీఆర్ కుటుంబంపై చెత్తరాతలు రాస్తున్నారని టీఆర్ఎస్ ఎన్నారై సెల్ సౌతాఫ్రికా అధ్యక్షుడు గుర్రాల ఆనంద్ మండిపడ్డారు. కేటీఆర్ కుమారుడిపై మల్లన్న చేసిన ట్వీట్ను ఖండిస్తున్నామని, తక్షణమే బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. హిమాన్షుపై బాడీ షేమింగ్ వ్యాఖ్యలను నిరసిస్తూ కేటీఆర్ అభిమానులు కొందరు తీన్మార్ మల్లన్న కార్యాలయానికి వెళ్లి ఆయనను నిలదీశారు. దీంతో ట్విట్టర్ హ్యాక్ అయ్యిందని తీన్మార్ మల్లన్న అబద్ధం చెప్పారు. కానీ, ఆ పోల్ పోస్ట్ చేసింది తన క్యూ న్యూస్కు చెందిన యూట్యూబ్ చానల్లో. ఇప్పటికీ ఆ పోల్ అలాగే ఉన్నది. దీన్ని చూసిన నెటిజన్లు తీన్మార్ మల్లన్న అబద్ధాలకు కూడా ఓ అడ్డూఅదుపు ఉండాలని ఫైర్ అవుతున్నారు.
హిమాన్షుపై తీన్మార్ మల్లన్న చేసిన బాడీషేమింగ్ను ఎమ్మెల్సీ కవిత ఖండించారు. విమర్శించటానికి ఎలాంటి కారణాలు లేనప్పుడు కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకొంటారని ఆమె అన్నారు. సోషల్ మీడియాలో చేసే పోస్టులు బాధ్యతతో చేయాలని, కానీ.. ద్వేషం, అబద్ధాలను వ్యాప్తి చేయటానికి కొంతమంది సోషల్ మీడియాను చాలా కాలంగా ఉపయోగిస్తుండటం సిగ్గు చేటని కవిత ట్విట్టర్లో వ్యాఖ్యానించారు.