KTR | నల్లగొండలో ఎన్నికల ప్రచార సరళి బీఆర్ఎస్కు అనుకూలంగా ఉన్నట్టే అనిపించిందని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. నల్లగొండ లోక్సభ నియోజకవర్గ సన్నాహాక సోమవారం జరిగింది. జనవరి 3న ఆదిలాబాద్తో ప్రారంభమైన సమావేశాలు నల్లగొండతో ముగిశాయి. 17లోక్సభ నియోజకవర్గాల సమావేశాలు ముగిశాయి. సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీకి కార్యకర్తలే కథానాయకులు అన్నారు. కార్యకర్తల వల్లే ఇన్నేళ్లుగా పార్టీ బలంగా ఉందని.. గత 16 సమావేశాల తీరు చూస్తే కార్యకర్తలే పార్టీకి ధైర్యమని చెప్పారు.
నల్లగొండలో ఎన్నికల ప్రచార సరళి మనకు అనుకూలంగా ఉన్నట్టే అనిపించిందని.. ఎక్కడా ఓటమిపై అనుమానాలు రాలేదన్నారు. ఎన్నికల ఫలితాలు మరోలా వచ్చాయని.. సూర్యాపేటలో మాత్రమే గెలిచామన్నారు. పార్టీకి, ప్రభుత్వానికి సమన్వయం లేకపోవడం వల్లే ఇలాంటి పరిస్థితి ఎదురైందని కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారని.. ఓటమికి అనేక కారణాలు ఉన్నాయన్నారు. పార్లమెంట్ సన్నాహాక సమావేశాలు ఆరంభం మాత్రమేనన్నారు. ఫిబ్రవరి మొదటి వారం నుంచి అసెంబ్లీ నియోజకవర్గాల సమీక్షలు మొదలవుతాయన్నారు.
సోషల్ మీడియాలో జరిగిన అసత్య ప్రచారాన్ని మనం గట్టిగా తిప్పికొట్టలేకపోయామన్నారు. అవతలి వాళ్లు అభూత కల్పనలు, అబద్దాలతో ప్రజలను తప్పుదోవ పట్టించారన్నారు. మనం ఇంకా మాట్లాడటం మొదలు పెట్టనే లేదని.. కాంగ్రెస్ నేతలు ఉలిక్కిపడుతున్నారన్నారు. కేసీఆర్ అసెంబ్లీకి వస్తే ఇంకెలా ఉంటుందో
ఉహించుకోండన్నారు. అధికారంలోకి వస్తామని కాంగ్రెస్ కూడా కలగన లేదన్నారు. అందుకే ఇష్టమొచ్చినట్టు హామీలు గుప్పించారన్నారు. హామీలకు కాంగ్రెస్ పంగనామాలు పెట్టే ప్రయత్నం చేస్తోoదని.. అయినా వదిలి పెట్టం స్పష్టం చేశారు.
ఎన్నికల్లో గెలిచేందుకు రేవంత్ రెడ్డి అడ్డమైన మాటలు చెప్పారని, కార్యకర్తలు ఉదాసీన వైఖరి, మీమాంస వీడాలన్నారు. ఎన్నికల్లో కాంగ్రెస్ నేతలు ఏం మాట్లాడారు.. ఇప్పుడేం చేస్తున్నారో ప్రజలకు విడమరచి చెప్పాలని సూచించారు. కోమటిరెడ్డి గత నవంబర్లోనే కరెంటు బిల్లులు కట్టవద్దని చెప్పారని.. నల్లగొండ ప్రజలు బిల్లులు కట్టకుండా కోమటిరెడ్డికే పంపాలన్నారు. సాగర్ ఆయకట్టుకు కాంగ్రెస్ పాలనలో మొదటిసారి క్రాప్ హాలీడే ప్రకటించే దుస్థితి దాపురించిందన్నారు. కృష్ణా రివర్ బోర్డుకు ప్రాజెక్టులను అప్పగించి తెలంగాణ జుట్టును కాంగ్రెస్ కేంద్రం చేతిలో పెడుతోందన్నారు.
శ్రీరాంసాగర్ చివరి ఆయకట్టును కాంగ్రెస్ ప్రభుత్వం ఎండ బెడుతోందన్నారు. కరెంటు కోతలు అపుడే మొదలు అయ్యాయన్నారు. కాంగ్రెస్, బీజేపీ అక్రమ బంధం నల్లగొండ మున్సిపాలిటీ అవిశ్వాసంలో బయట పడిందన్నారు. రేవంత్ భుజం మీద తుపాకీ పెట్టి మోదీ బీఆర్ఎస్ను కాలుస్తారట.. మైనారిటీ సోదరులకు కాంగ్రెస్, బీజేపీ అక్రమ సంబంధం గురించి చెప్పాలన్నారు. రాహుల్ అదానీని దొంగ అన్నారని.. రేవంత్ దొర అంటున్నాడన్నారు. కేసీఆర్పై ప్రజల్లో సానుభూతి వెల్లువలా ఉందన్నారు. ఈ పరిస్థితిని పార్లమెంట్ ఎన్నికల్లో సానుకూలంగా మలచుకోవాలన్నారు. కాంగ్రెస్కు ఇప్పటికే అనేక వర్గాలు దూరమయ్యాయన్నారు.
నల్లగొండ పార్లమెంట్ ఎన్నికల్లో సమష్టిగా పనిచేసి గెలుద్దామన్నారు. సమావేశంలో మాజీ మంత్రులు హరీశ్రావు, జగదీశ్ రెడ్డి, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, కడియం శ్రీహరి, మాజీ స్పీకర్ మధుసూధనాచారి, నల్లగొండ లోక్సభ నియోజకవర్గం పరిధిలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, జెడ్పీ చైర్మన్లు, మాజీ చైర్మన్లు, మున్సిపల్ చైర్మన్లు, మాజీ మున్సిపల్ చైర్మన్లు, వివిధ కార్పొరేషన్ల మాజీ చైర్మన్లు, నియోజకవర్గాల ఇన్చార్జీలు, జిల్లా పార్టీ అధ్యక్షులు, పార్టీ ప్రజాప్రతినిధులు, ముఖ్యనేతలు పాల్గొన్నారు.