KTR | మొక్కవోని ధైర్యంతో ముందుకెళ్తామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో తెలంగాణ భవన్లో ఆయన ఆదివారం సాయంత్రం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘మళ్లీ ఎంత దృఢంగా ఉద్యమాన్ని ఆ నాడు ప్రతికూలతల మధ్య నడిపినమో.. 14 ఏళ్లపాటు రానేరాదనకున్న తెలంగాణన ఎట్లయితే కష్టపడి పోరాటం చేసి సాధించామో.. అదేరకమైన పోరాట స్ఫూర్తితో, అదేరకమైన మొక్కవోని ధైర్యంతో ముందుకెళ్తాం. ఎన్నుకోబడిన శాసనసభ్యులందరికీ శుభాకాంక్షలు. వారి గెలుపు కోసం కృషి చేసిన కార్యకర్తలకు కృతజ్ఞతలు’ తెలిపారు.
‘ప్రతి జిల్లాలో బీఆర్ఎస్ పార్టీకి ప్రాతినిథ్యాన్ని ప్రజలు ఇచ్చారు. ప్రతి జిల్లా ప్రాతినిథ్యం ఇచ్చి ప్రజలు గౌరవించారు కాబట్టి అదేపంథాలో ప్రతి జిల్లా సమస్యలు, నియోజకవర్గ సమస్యలు పరిష్కరించేందుకు మనవంతు పాత్ర పోషిద్దాం. ఎన్నికల్లో సహకరించిన మీడియాకు హృదయపూర్వక ధన్యవాదాలు. జరగాల్సింది జరుగుతుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజాస్వామ్య ప్రక్రియలో పరిణితి ప్రదర్శించి.. ప్రజా తీర్పు శిరోధార్యం కాబట్టి.. రాజీనామా పత్రాన్ని గవర్నర్కు పంపారు. జరగాల్సిన ఘట్టం తర్వాత జరుగుతుంది. మేం పూర్తిస్థాయిలో కొత్తగా ఏర్పడబోయే ప్రభుత్వానికి సహకరిస్తామని తెలియజేస్తూ వారికి అభినందనలు తెలుపుతున్నాను. మా కార్యకర్తలు, నాయకులు అందరూ పూర్తిగా ఎవరూ నిరాశకు లోనుకాకుండా పార్టీ ఆదేశాల మేరకు ముందుకు సాగాలని విజ్ఞప్తి చేస్తున్నా’నన్నారు.