KTR : భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల తారక రామారావు (KTR) తనపై, తన కుటుంబంపై నిరాధారమైన, పరువు నష్టం(Defamation) కలిగించే వ్యాఖ్యలు చేసినందుకుగానూ బీజేపీ ఎంపీలు బండి సంజయ్ కుమార్(Bandi Sanjay Kumar), ధర్మపురి అరవింద్(Dharmapuri Aravind)లకు విడివిడిగా లీగల్ నోటీసులు జారీ చేశారు. తన రాజకీయ ప్రతిష్టను దెబ్బతీసేలా, ప్రజల్లో తనపై ఉన్న నమ్మకాన్ని సడలించేలా వీరు చేసిన వ్యాఖ్యలను కేటీఆర్ తీవ్రంగా పరిగణించారు. బాధ్యతాయుతమైన పదవుల్లో ఉండి అడ్డగోలుగా మాట్లాడిన వీరు వెంటనే క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
రాజకీయ లబ్దికోసం బీజేపీ ఎంపీలు బండి సంజయ్, అరవింద్లు తన పరువుకు నష్టం కలిగించేలా మాట్లాడడాన్ని కేటీఆర్ ఖండించారు. ఎలాంటి సాక్షాధారాలు లేకుండా కేవలం దురుద్దేశ పూర్వకంగా, రాజకీయాల కోసం వీరిరువు దిగజారి మాట్లాడుతున్నారని ఆయన తెలిపారు. ఇప్పటికే కేంద్రమంత్రి బండి గతంలో చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన కేసు న్యాయస్థానంలో ఉన్నప్పటికీ, చట్ట వ్యతిరేకంగా ఆయన మరోసారి తనపై నోరు పారేసుకున్నారని కేటీఆర్ ధ్వజమెత్తారు. ఈ మేరకు బండి సంజయ్, అరవింద్లకు కేటీఆర్ తన న్యాయవాదులతో నోటీసులు పంపించారు.
బండి సంజయ్కు పంపిన నోటీసులో, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై ఆయన చేసిన ఆరోపణలను కేటీఆర్ న్యాయవాదులు ప్రస్తావించారు. కేటీఆర్ కుటుంబం ఫోన్ ట్యాపింగ్ ద్వారా వేల కోట్ల రూపాయలు సంపాదించిందని, సెలబ్రిటీల ఫోన్లు ట్యాప్ చేశారంటూ జనవరి 23న ప్రెస్ మీట్లో కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు పూర్తిగా అవాస్తవమని కేటీఆర్ స్పష్టం చేశారు. ఇప్పటికే బండి సంజయ్పై సిటీ సివిల్ కోర్టులో పరువు నష్టం దావా నడుస్తున్నప్పటికీ, మళ్ళీ అదే తరహాలో తప్పుడు ఆరోపణలు చేయడం దురుద్దేశపూర్వకమని కేటీఆర్ మండిపడ్డారు.
మరోవైపు ఎంపీ ధర్మపురి అరవింద్కు పంపిన నోటీసులో ఆయన చేసిన వ్యక్తిగత దూషణలను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ తప్పుబట్టారు. డ్రగ్స్ సేవించడం, మత్తుపదార్థాలు సరఫరా చేస్తున్నారంటూ అరవింద్ చేసిన వ్యాఖ్యలు అక్షేపణీయమని కేటీఆర్ పేర్కొన్నారు. కేటీఆర్ రాష్ట్ర అభివృద్ధికి, ఐటీ రంగ విస్తరణకు కృషి చేసిన మాజీ మంత్రి అని, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అని, అటువంటి వ్యక్తిపై ఎటువంటి సాక్ష్యాలు లేకుండా అడ్డగోలుగా మాట్లాడడం రాజకీయ కక్ష సాధింపేనని న్యాయవాదులు లీగల్ నోటీసులో వివరించారు.
ఈ ఇద్దరు ఎంపీలు తమ వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని, కేటీఆర్కు బహిరంగంగా నిబంధనలు లేని క్షమాపణలు చెప్పాలని న్యాయవాదులు డిమాండ్ చేశారు. నోటీసు అందిన ఐదు రోజుల్లోగా స్పందించని పక్షంలో సివిల్, క్రిమినల్ చట్టాల ప్రకారం కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రాజకీయ ప్రయోజనాల కోసం వ్యక్తిత్వ హననానికి పాల్పడితే న్యాయపరంగా మూల్యం చెల్లించుకోక తప్పదని కేటీఆర్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు.