KTR | తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కరీంనగర్లో బీఆర్ఎస్ సోషల్ మీడియా వారియర్స్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కేటీఆర్ పాల్గొని మాట్లాడారు. ‘మొన్నటి ఎన్నికల్లో బీఆర్ఎస్కు తగిలిన దెబ్బ చిన్నదే. 119 నియోజకవర్గాల్లో మనం పోటీ చేస్తే మనల్ని ప్రజలు చీకొట్టలేదు. తీసి అవతలపడేయలేదు. 39 సీట్లు ప్రజలు ఇచ్చారు. మూడోవంతు సీట్లు ఇచ్చారు. 14 నియోజకవర్గాల్లో స్వల్ప తేడాతో ఓడిపోయాం. జుక్కల్లో 1152 ఓట్లు, దేవరకద్రలో 1382 ఓట్లు, సిర్పూర్లో 3వేల ఓట్లు, బోధన్లో 3వేల ఓట్లు, ఖానాపూర్లో 4289 ఓట్లు తేడా. కొన్ని ఓట్ల తేడాతోనే కొన్ని సీట్లు కోల్పోయాం. ఈ 14 సీట్లలో ఆరేడు సీట్లు మనం గెలిచినా.. ఇవాళ ఏం ఉంటుండెనో పరిస్థితి మాకే నాకంటే బాగా తెలుసు’నని కేటీఆర్ అన్నారు.
‘మనకు జరిగింది ఊహించలేనటువంటి.. బాధపడేంత దరిద్రమైన ఓటమి కాదు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఎవరు ఎట్ల గెలిచారో ఆలోచన చేయాలి. పక్కనే ఉంటది ధర్మపురి నియోజకవర్గం. అక్కడ కొప్పుల ఈశ్వర్ ఓడిపోయారు. ఆయన ఎందుకు ఓడిపోయారు ? కరీంనగర్ పార్లమెంట్ సమీక్షా సమావేశంలో జమీల్ ఒక్క మాటన్నడు. అన్న భారతదేశం భావోద్వేగాల మీద ఓటు వేస్తది అన్నడు. మన దేశం కొద్దిగా ఎమోషనల్ దేశం. ఉద్వేగాన్ని, భావాన్ని, బాధను పంచుకుంటరు అన్నాడు. కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో గదే జరిగింది. ధర్మపురిలో ఇప్పుడు గెలిచిన ఎమ్మెల్యే లక్ష్మణ్కుమార్ ఇంతకు ముందు నాలుగు సార్లు ఓడిపోయారు. ఇంటింటికి తిరుగుతూ రోడ్డున పడుతా అంటూ ఏడ్చారు.
చొప్పదండిలో ఏం జరిగింది. ఇక్కడ గెలిచిన ఎమ్మెల్యే గతంలో రెండుసార్లు ఓడిపోయారు. ఆయన ఇంటింటికి తిరుగుతూ ఏడ్సుకుంట. ఆస్తులన్నీ అమ్ముకున్న. అవుట్పోయిన నాకు దయచేసి ఒక్కసారి ఓటు వేయాలని ఆయన తిరిగిండు. మానకొండూరులో కవ్వంపల్లి సత్యనారాయణ ఓడిపోయిండు. నాకు ఒక్కసారి అవకాశం ఇవ్వండి దండం పెడుత అన్నడు. వేములవాడలో ఇప్పుడున్న ఎమ్మెల్యే నాలుగు సార్లు ఓడిపోయాడు. దయచేసి నాకు అవకాశం ఇవ్వాలి.. ఐదోసారి ఓడిపోతే అడ్రస్ లేకుండాపోతా అని తిరిగిండు. సిరిసిల్లలో నాపై పోటీ చేసిన ఆయనది అదే ప్రయత్నం. 65 ఏళ్లు వచ్చాయ్.. వచ్చేసారి ఉంటనో లేదో.. ఈసారి ఒక్కసారి అవకాశం ఇవ్వండి ఆయన తిరిగిండు’ అని కేటీఆర్ పేర్కొన్నారు.
‘ఎక్కడికక్కడ సెంటిమెంట్తోనే కాంగ్రెస్ అభ్యర్థులంతా బ్రహ్మాండంగా గెలిచారు తప్ప.. ఇంకోటి కానే కాదు. ఈ మాట ఎందుకు అంటున్నాంటనే.. మన ఎమ్మెల్యేలంతా పని మంతులు కాదని కాదు.. కేవలం సెంటిమెంట్ కారణం. కరీంనగర్ లోక్సభ ఒకసారి మొత్తం తీసుకుంటే.. మనం ముందున్నాం. లోక్సభ పరిధిలో మొత్తం ఐదారువేల ఓట్లతో మొత్తంగా ముందంజలో ఉన్నాం. ముగ్గురు ఎమ్మెల్యేలు, నలుగురు మాజీలు, ఐదుగురు జడ్పీ చైర్మన్లు ఉన్నారు. కానీ, మొన్న ఏడుపులు, బొబ్బలతో ఓట్లు దెబ్బినోళ్లు ఇవాళ కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేలు అయ్యారు. వాళ్లకు ఈసారి సానుభూతి ఉండదు.. మన్ను ఉండదు.
అక్కడ ఈ సారి ఏం జరుగుతుందంటే.. ప్రజలు ఏమాయే బిడ్డ మీ రేవంత్రెడ్డి పెద్ద పెద్ద మాటలు చెప్పిండు.. ఏమాయే అని అడుగుతరు. నేనేం విమర్శ చేస్తలేను.. నేను గుర్తు చేస్తున్నా. ఆ నాడు రేవంత్రెడ్డి రైతులు లోన్ తీసుకోనొళ్లు ఉంటే.. అర్జెంటుపోయి రూ.2లక్షల లోన్ తీసుకోండి డిసెంబర్ 9న వచ్చి నేను కడుతా అన్నడు’ కేటీఆర్ గుర్తు చేశారు. ఈ సందర్భంగా ఎన్నికల సమయంలో రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలను వీడియో ప్లే చేయించి చూపించారు. రుణమాఫీ, పింఛన్లు, రైతుబంధు, కరెంటు బిల్లులపై చేసిన వ్యాఖ్యలను సోషల్ మీడియా వారియర్స్కు స్క్రీన్పై ప్రదర్శించారు.