KTR | హైదరాబాద్ నగర ప్రజలకు ప్రపంచ స్థాయి వైద్యం అందించాలనే లక్ష్యంతో నాడు బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ టిమ్స్ హాస్పిటల్స్ ఏర్పాటు చేశారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. గతంలో గాంధీ, ఉస్మానియా వంటి ప్రభుత్వ ఆసుపత్రులే ప్రధాన ఆధారమైతే, బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అత్యాధునిక టిమ్స్ హాస్పిటల్స్ అందుబాటులోకి వచ్చాయని పేర్కొన్నారు.
హైదరాబాద్ ఎర్రగడ్డలోని టిమ్స్ ఆస్పత్రి పనులను శుక్రవారం ఉదయం కేటీఆర్ పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. “హైదరాబాద్లో AIIMS స్థాయి వైద్యం అందించేలా టిమ్స్ను ఆలోచించి రూపకల్పన చేశాం” అని తెలిపారు. సనత్నగర్ టిమ్స్ కోసం 22 ఎకరాల విస్తీర్ణాన్ని వినియోగించామని పేర్కొన్నారు. అత్యాధునిక టెక్నాలజీ, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో హాస్పిటల్ నిర్మాణం చేపట్టామని వెల్లడించారు.
ప్రైవేట్ కార్పొరేట్ ఆసుపత్రులకు పోటీగా పేదలకు మెరుగైన వైద్యం అందించాలనే లక్ష్యంతో కేసీఆర్ ప్రభుత్వం టిమ్స్ను తీసుకువచ్చిందని అన్నారు. హైదరాబాద్లో సనత్నగర్, ఎల్బీనగర్, ఆల్వాల్ ప్రాంతాల్లో టిమ్స్ హాస్పిటల్స్ ఏర్పాటు చేశామని తెలిపారు. వరంగల్లో 2000 పడకలతో ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణం చేపట్టామని వెల్లడించారు. నిమ్స్ ఆసుపత్రిని కూడా భారీ స్థాయిలో విస్తరణ పనులు మొదలుపెట్టామని చెప్పారు.
సనత్నగర్ టిమ్స్లో మొత్తం మూడు బ్లాకులు నిర్మించామని తెలిపారు. 300 ICU బెడ్స్తో అత్యవసర వైద్య సేవలు అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. రోగుల బంధువుల కోసం ప్రత్యేక ధర్మశాల ఏర్పాటు చేశామని తెలిపారు. రూ.1200 కోట్ల వ్యయంతో టిమ్స్ నిర్మాణం చేపట్టామని వెల్లడించారు. “కేసీఆర్ ప్రభుత్వం కొనసాగి ఉంటే ఈ ఆసుపత్రి రెండేళ్ల క్రితమే పూర్తయ్యేది” అని తెలిపారు.
ఈ టిమ్స్లో 16 అత్యాధునిక ఆపరేషన్ థియేటర్లు ఏర్పాటు చేశామని కేటీఆర్ తెలిపారు. MRI, CT Scan సహా అన్ని డయాగ్నస్టిక్ సౌకర్యాలు అందుబాటులో ఉంటాయని చెప్పారు. ప్రత్యేక VIP సూట్స్ కూడా ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. కిడ్నీ సంబంధిత వ్యాధులపై ప్రత్యేక పరిశోధనలు జరిగేలా సదుపాయాలు కల్పిస్తున్నామని తెలిపారు. దేశంలోనే అత్యధిక వైద్య సిబ్బందితో కూడిన ప్రభుత్వ వైద్య వ్యవస్థగా టిమ్స్ను అభివృద్ధి చేస్తామని తెలిపారు. ప్రత్యేక రీసెర్చ్ బ్లాక్స్, అకాడెమిక్ సదుపాయాలు కూడా ఏర్పాటు చేశామని వెల్లడించారు. భారీ ఆడిటోరియం నిర్మాణం కూడా చేపట్టినట్లు తెలిపారు. ఒకేసారి 1000 కార్లు పార్క్ చేసేలా ఆధునిక పార్కింగ్ వ్యవస్థ ఏర్పాటు చేశామని చెప్పారు.
“టిమ్స్ హాస్పిటల్ డిజైన్ దేశంలోనే అత్యుత్తమ ప్రభుత్వ వైద్య నిర్మాణాల్లో ఒకటి” అని కేటీఆర్ పేర్కొన్నారు. అత్యవసర సేవల కోసం ప్రత్యేక ఎమర్జెన్సీ ర్యాంప్ నిర్మించామని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 350 బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేసి ప్రజలకు చేరువలో వైద్యం అందించామని గుర్తుచేశారు. మిగిలిన నిర్మాణ పనులను ప్రభుత్వం వెంటనే పూర్తి చేసి ప్రజలకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి తేవాలని డిమాండ్ చేశారు.